Millet Curd Rice: కొర్రలతో కమ్మని పెరుగన్నం: ఆరోగ్యం, రుచి ఒకే దాంట్లో..ఎలా చేసుకోవాలంటే

Posted By:

పెరుగన్నం లేదా దద్దోజనం ఈ పేర్లు వింటేనే కొంతమందికి నోట్లో నీళ్లూరుతాయి. మండుటెండలో తిరిగి అలసిపోయి వచ్చినప్పుడు, కడుపులో కాస్త నలతగా ఉన్నా ఓ ముద్ద పెరుగన్నం తింటే ప్రాణం లేచొస్తుంది. అయితే మీరెప్పుడైనా మిల్లెట్ కర్డ్ రైస్ తిన్నారా? ఇది మన పాత పెరుగన్నానికి అప్‌గ్రేడ్ వెర్షన్ లాంటిది. బియ్యం బదులుగా పోషకాలు నిండిన కొర్రలను ఉపయోగించి దీనిని తయారుచేస్తారు. ఇది జీర్ణానికి తేలికగా ఉండటమే కాకుండా రుచిలోనూ అద్భుతంగా ఉంటుంది. ఎండాకాలంలో చల్లగా, ఇతర సమయాల్లో హాయిగా తినగలిగే ఈ వంటకం మీ డైట్‌ లో తప్పక ఉండాల్సిందే. ఈ అద్భుతమైన మిల్లెట్ కర్డ్ రైస్ ని ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
-కొర్రలు - 1 కప్పు
-నీరు - రెండున్నర కప్పులు
-పాలు - అర కప్పు (లేదా మజ్జిగ)
-గడ్డ పెరుగు (బాగా చిలికినది) - 3 కప్పులు
-తురిమిన దోసకాయ, క్యారెట్ - ఒక్కో కప్పు
-సన్నగా తరిగిన ఉల్లిపాయ, క్యాప్సికమ్ - 3 టేబుల్ స్పూన్లు
-తరిగిన కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు
-ఉప్పు - రుచికి సరిపడా
-నూనె - రెండున్నర టీస్పూన్లు
-ఆవాలు - 1 టీస్పూన్
-మినపప్పు, శనగపప్పు - 2 టీస్పూన్లు
-ఎండుమిర్చి - 2
-ఇంగువ - అర టీస్పూన్
-వేరుశనగలు - 2 టేబుల్ స్పూన్లు
-సన్నగా తరిగిన పచ్చిమిర్చి - 2
-కరివేపాకు - 6-7 రెబ్బలు

This Millet Curd Rice Recipe Is a Must Try for a Healthy Gut Recipe in Telugu

తయారీ విధానం

-ముందుగా కొర్రలను శుభ్రంగా కడగాలి.

-తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో కొర్రలు, రెండున్నర కప్పుల నీళ్లు పోయండి. మీడియం మంట మీద 15-20 నిమిషాల పాటు కొర్రలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి.

-కొర్రలు ఉడికిన తర్వాత దానిని పూర్తిగా చల్లారనివ్వాలి.

-కొర్రల మిశ్రమం చల్లబడిన తర్వాత గరిటెతో గానీ, చేతితో గానీ కొద్దిగా మెత్తగా మెదుపుకోవాలి.

-ఇప్పుడు అందులో చిలికిన పెరుగు, సన్నగా తురిమిన క్యారెట్, దోసకాయ, తరిగిన ఉల్లిపాయ, క్యాప్సికమ్, కొత్తిమీర వేసి అన్నీ బాగా కలిసేలా కలపాలి.

-ఆ తర్వాత పాలు, రుచికి సరిపడా ఉప్పు వేసి మరోసారి కలపండి. మరింత ఆరోగ్యకరంగా కావాలంటే పాలకు బదులుగా చల్లని మజ్జిగను కూడా ఉపయోగించవచ్చు.

-ఇప్పుడు పోపు రెడీ చేసుకోవాలి. ఇందుకోసం ఒక చిన్న పాన్‌ లో నూనె వేడి చేసి ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. తర్వాత మినపప్పు, శనగపప్పు, వేరుశనగలు వేసి దోరగా వేయించాలి. అవి కొద్దిగా రంగు మారాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి, పప్పులు కరకరలాడే వరకు వేయించుకోవాలి. ఈ పోపు వేగుతుంటే వచ్చే ఘుమఘుమలాడే వాసన అద్భుతంగా ఉంటుంది.

-ఈ వేడి వేడి పోపును మనం సిద్ధం చేసుకున్న కొర్ర పెరుగన్నం మిశ్రమంలో వేసి బాగా కలపాలి. అంతే కమ్మని, ఆరోగ్యకరమైన కొర్రల దద్దోజనం రెడీ. దీనిని వెంటనే ఆరగించవచ్చు లేదా కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా తింటే మరింత బాగుంటుంది.

[ of 5 - Users]
Story first published: Tuesday, September 9, 2025, 16:55 [IST]
Desktop Bottom Promotion