ఉగాది స్పెషల్.. నోరూరించే మామిడికాయ పచ్చిమిర్చి పప్పు..తింటే అమృతమే!

Posted By:

తెలుగు వారి తొలి పండుగ ఉగాది రాగానే ప్రకృతిలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. చెట్లు చిగురిస్తాయి, కోయిలలు కిలకిలరావాలు చేస్తాయి, మల్లెల సువాసనలు వెదజల్లుతాయి, అన్నింటికీ మించి మామిడికాయలు నోరూరిస్తుంటాయి. ఉగాది పచ్చడికి ఎంత ప్రాధాన్యత ఉందో, ఉగాది పండుగ రోజు మధ్యాహ్నం భోజనంలో మామిడికాయ పప్పుకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది.

కారం పొడి వేయకుండా, కేవలం పచ్చిమిర్చి కారంతో, పుల్లటి మామిడికాయ, కమ్మటి కందిపప్పుతో చేసే ఈ మామిడికాయ పచ్చిమిర్చి పప్పు రుచి అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పప్పు, కాస్త నెయ్యి, వడియాలు నంచుకుని తింటే ఆ మజాయే వేరు.

Ugadi Special Super TastyTraditional Mamidikaya Pachimirchi Pappu Recipe in Telugu

మామిడికాయ పచ్చిమిర్చి పప్పు తయారీ విధానం

కందిపప్పు - 1 కప్పు
పుల్లటి పచ్చి మామిడికాయ - 1
పచ్చిమిర్చి - 10
ఉల్లిపాయ - 1
పసుపు - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - 3 కప్పులు
నూనె లేదా నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
ఎండుమిర్చి - 3
వెల్లుల్లి రెబ్బలు - 5
కరివేపాకు - 2 రెమ్మలు
ఇంగువ - చిటికెడు

మామిడికాయ పచ్చిమిర్చి పప్పు తయారీ విధానం

-ముందుగా ఒక కప్పు కందిపప్పును తీసుకుని రెండు సార్లు శుభ్రంగా నీటితో కడగాలి. ఆ తర్వాత అందులో తగినన్ని నీళ్లు పోసి సుమారు 15 నుండి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.

-తర్వాత పచ్చి మామిడికాయను శుభ్రంగా కడిగి, పైన ఉన్న చెక్కు తీసేయాలి. లోపల ఉన్న టెంకను తీసేసి, మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

-ఉల్లిపాయను పెద్ద ముక్కలుగా, పచ్చిమిర్చిని పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకోవాలి.

-ఇప్పుడు నానబెట్టిన కందిపప్పులో ఉన్న నీటిని వంపేసి, పప్పును ప్రెషర్ కుక్కర్‌ లో వేయాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, అర టీస్పూన్ పసుపు, సుమారు 2.5 నుండి 3 కప్పుల నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి మీడియం మంట మీద 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆపేయాలి.

-కుక్కర్లోని ఆవిరి (ప్రెషర్) పూర్తిగా పోయే వరకు ఆగాలి. ఆవిరి పోయాక మూత తీసి, రుచికి సరిపడా ఉప్పు వేసి పప్పుగుత్తితో మెత్తగా ఎనపాలి. మామిడికాయ ముక్కలు అక్కడక్కడా తగులుతూ ఉంటే ఇష్టపడేవారు మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా ఎనుపుకోవచ్చు. పప్పు మరీ గట్టిగా ఉంటే కొద్దిగా వేడి నీళ్లు కలుపుకోవచ్చు.

-ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె లేదా నెయ్యి వేడి చేసి ఆవాలు, జీలకర్ర,దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. చివరగా చిటికెడు ఇంగువ వేసి స్టవ్ ఆపేయాలి.

-సిద్ధం చేసుకున్న ఈ తాలింపును ఉడికించి పెట్టుకున్న మామిడికాయ పప్పులో వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో కమ్మనైన మామిడికాయ పచ్చిమిర్చి పప్పు రెడీ.

[ of 5 - Users]
Story first published: Thursday, March 19, 2026, 13:45 [IST]
Desktop Bottom Promotion