దమ్ బిర్యానీలో సరికొత్త రుచి..అసలైన పెషావరీ చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూడండి

Posted By:

బిర్యానీ పేరు వింటే చాలామందికి నోట్లో నీళ్లూరుపోతుంటాయి,మనసు పులకించిపోతుంది. వందల రకాల బిర్యానీలు ఉన్నప్పటికీ కొన్నింటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి వాటిల్లో పెషావరీ చికెన్ బిర్యానీ ఒకటి. ఏదైనా పండుగకు లేదా ప్రత్యేక సందర్భమైనా మీ కుటుంబ సభ్యులకు చాలా ప్రత్యేకంగా అద్భుతమైన విందులో సర్ ప్రైజ్ చేయాలనుకుంటే ఈ పెషావరీ చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది హైదరాబాదీ బిర్యానీ అంత ఘాటుగా కాకుండా సుగంధ ద్రవ్యాల సువాసనలతో,మితమైన మసాలాల కలయితో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సూపర్ టేస్టీ పెషావరీ చికెన్ బిర్యానీని మీ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

పెషావరీ చికెన్ బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు

-బాస్మతి బియ్యం
-చికెన్
-పెరుగు
-బిర్యానీ ఆకు
-యాలకలు
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-కారం
-పసుపు
-లవంగాలు
-గరం మసాలా
-ఉప్పు
-బిర్యానీ మసాలా
-దాల్చిన చెక్క
-నూనె లేదా నెయ్యి
-ఉల్లిపాయ
-టమాటో
-కొత్తిమీర
-పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వు
-క్రెవా నీరు
-పుదీనా

Weekend Special Step by Step Guide to Flavorful Peshawari Chicken Biryani Recipe in Telugu

తయారీ విధానం

-ముందుగా ఒకటిన్నర కప్పు బాస్మతి బియ్యంను నీళ్లు పోసి శుభ్రంగా కడి కనీసం అరగంట సేపు నీటిలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల బియ్యం పొడిపొడిగా,పొడవుగా ఉడుకుతుంది.

-తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో 400 గ్రాములు మీడియం సైజ్ చికెన్ ముక్కలు వేసి, ఇందులోనే అరకప్పు చిక్కటి పెరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, అర స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, సరిపడా ఉప్పు వేసి మెత్తం చికెన్ ముక్కలకు పట్టేలా బాగా చేత్తో కలిపి అరగంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. దీంతో మసాలాలన్నీ చికెన్ లోకి బాగా ఇంకి ముక్కలు జ్యూసీగా,రుచిగా మారతాయి.

-తర్వాత అడుగు మందంగా ఉన్న ఒక పాత్రను తీసుకుని మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను ఒక పొరలా పరచాలి.

-తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి మరిగించి అందులో నానబెట్టిన బియ్యం, 3 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, 1 అంగుళం ముక్క దాల్చిన చెక్క, 3 యాలకలు వేసి 70శాతం వరకు ఉడికించి నీటిని వంపేయాలి.

-ఇప్పుడు పొరలా పరిచి ఉన్న చికెన్ ముక్కలపై 70శాతం ఉడికిన అన్నాన్ని సమానంగా పరచండి దీనిపై అరకప్పు టమాటో ముక్కలు, అర కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, కొద్దిగా నూనె లేదా నెయ్యి వేయాలి. మిగిలిన అన్నాన్ని మరో పొరగా వేసి పైన మళ్లీ ఉల్లిపాయ చీలికలు, కుంకుమపువ్వు పాలు కొద్దిగా,క్రెవా నీరు కొన్ని చుక్కలు వేసి గిన్నెపై మూతపెట్టి గాలి బయటకు పోకుండా అల్యూమినియం ఫాయిల్ తో లేదా తడిసిన పిండితో సీల్ చేయాలి.

-ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద మొదట 5 నిమిషాలు పెద్ద మంటపై,ఆ తర్వాత 40 నిమిషాలు సన్నని మంటపై ఉడికించాలి.

-తర్వాత మూత తెరిస్తే వేడివేడి, షుమషుమలాడే పెషావరీ చికెన్ బిర్యానీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Saturday, October 4, 2025, 17:06 [IST]
Desktop Bottom Promotion