ఈ రోజుల్లో పెళ్లిళ్లు పెటాకులు అవడానికి అసలు కారణం చెప్పిన ప్రేమానంద్ మహారాజ్

కూరలో ఉప్పు ఎక్కువ వేస్తుందని భార్యకు విడాకుల్చిన భర్త, తన సబ్బు రుద్దుకుంటున్నాడని భర్తతో విడిపోయే భార్య, తమ అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నారని భాగస్వామలను చంపడం లేదా చంపించడం వంటి ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. చిన్న చిన్న కారణాలకే బంధాలు తెగిపోతున్నాయి. అది లవ్ మ్యారేజ్ అయినా లేదా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా జీవితాంతం కలిసుండటం అనేది రాను రాను కలగానే మిగిలిపోతుంది. ఒకప్పుడు ఏడడుగుల బంధం ఏడు జన్మల బంధంగా భావించే సమాజంలో నేడు ఏడడుగులు కూడా కలిసి నడవలేక విడిపోతున్న జంటలు బోలెడు. చిన్నపాటి మనస్పర్థలకు కూడా పవిత్ర బంధాలు పెటాకులైపోతున్నాయి. ఈ ఆందోళనకర సామాజిక మార్పుపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రేమానంద్ మహారాజ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

రకరకాల రుచులకు అలవాటు పడి..
ఈ బంధాల విచ్ఛిన్నానికి మూలకారణం నేటి యువతలో కొరవడుతున్న వ్యక్తిత్వ పటిమ,పవిత్రతేనని ప్రేమానంద్ మహారాజ్ చెబుతున్నారు. నిత్యం బయట హోటళ్లలో రకరకాల రుచులు ఆస్వాదించడానికి అలవాటుపడిన వ్యక్తికి ఇంట్లో వండిన భోజనం అంతగా రుచించదని.. అదేవిధంగా పెళ్లికి ముందే అనేక మందితో ఎఫైర్స్ పెట్టుకుని వివిధ వ్యక్తుల నుండి ఆనందాన్ని వెతుక్కోవడం అలవాటు చేసుకున్న యువతీయువకులు పెళ్లి తర్వాత ఒక్క జీవిత భాగస్వామితో సర్దుకుపోయి సంతృప్తిగా జీవించలేకపోతున్నారు అని ఆయన స్పష్టం చేశారు. ఈ బహుళ సంబంధాల తాలూకు మానసిక అలజడే వైవాహిక జీవితంలో అసంతృప్తికి, అపనమ్మకానికి దారితీస్తోందని ఆయన హెచ్చరించారు.

Seven Steps Not a Lifetime Spiritual Guru Explains Real Reason For Why Marriages Failed

పవిత్రతకు పాతర..
ఒకప్పుడు మన సంస్కృతిలో పవిత్రతకు ప్రాణమిచ్చేవారని మహారాజ్ గుర్తుచేస్తున్నారు. పరాయి పాలకుల దాడుల సమయంలో భారతీయ మహిళలు తమ మానప్రాణాలను కాపాడుకోవడానికి ప్రాణత్యాగం చేశారు కానీ తమ పవిత్రతను కోల్పోవడానికి ఇష్టపడలేదన్నారు. భర్తనే సర్వస్వంగా భావించే ఆ సంస్కారం నేడు కనుమరుగవుతోందని ప్రేమానంద్ మహారాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. వివాహానికి ముందు పవిత్రమైన జీవితం గడుపుతున్న అమ్మాయిలు నూటికి ఒకరుంటే ఇప్పుడు గొప్ప అయిపోయిందని.. మరి అలాంటి పరిస్థితుల్లో బంధంలో నమ్మకం ఎలా నిలుస్తుంది? అని ఆయన ప్రశ్నించారు. స్వార్థం, మితిమీరిన స్వేచ్ఛ అనే భావనలు విధేయత, త్యాగం వంటి వైవాహిక విలువలని నాశనం చేస్తున్నాయని అన్నారు.

వాడి పడేసే డేటింగ్ సంస్కృతి
నేటి బాయ్‌ఫ్రెండ్-గర్ల్‌ఫ్రెండ్ సంస్కృతిని మహారాజ్ వాడి పడేసే సంస్కృతిగా అభివర్ణించారు. ఈ తాత్కాలిక సంబంధాలు వివాహ వ్యవస్థ గంభీరతను, పవిత్రతను బలహీనపరుస్తున్నాయని, దీనివల్ల కుటుంబ వ్యవస్థే ప్రమాదంలో పడుతోందని ఆయన హెచ్చరించారు.

పరిష్కారం ఇదే
గతాన్ని తలుచుకుంటూ బాధపడటం పరిష్కారం కాదని వర్తమానాన్ని సరిదిద్దుకోవడమే మార్గమని మహారాజ్ సూచిస్తున్నారు. గతంలో ఏమైనా పొరపాట్లు జరిగి ఉండవచ్చు.. కానీ పెళ్లి తర్వాత సంపూర్ణ విధేయతతో, పవిత్రమైన జీవితాన్ని గడపడానికి సంకల్పించుకోవాలని ప్రేమానంద్ మహారాజ్ సూచించారు. మీకు నిజాయితీగల, పవిత్రమైన జీవిత భాగస్వామి లభిస్తే దానిని దైవ వరంగా భావించాలని ఆయన హితవు పలికారు. వైవాహిక జీవితం కేవలం ప్రేమ, ఆకర్షణపై ఆధారపడి నిలవదు. వ్యక్తిత్వం, నమ్మకం, ఆధ్యాత్మిక అనుబంధం అనే బలమైన పునాదులు వైవాహిక బంధానికి అవసరం. ప్రేమానంద్ మహారాజ్ మాటలు, కేవలం బంధాలను ఏర్పరచుకోవడమే కాకుండా వాటిని జీవితాంతం నిలబెట్టుకోవడం ఎలాగో నేటి యువతను ఆత్మపరిశీలన చేసుకునేలా ప్రేరేపిస్తున్నాయి.

Story first published: Monday, June 30, 2025, 7:43 [IST]
Desktop Bottom Promotion