ఒక్క సంఘటన.. ఆ దంపతులను మళ్లీ కలిపింది.. నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో.!

విడాకుల కేసుల్లో చివరికి భార్యాభర్తలు కాంప్రమైజ్‌ అయ్యి ప్రేమతో ఒక్కటయ్యే సందర్భాలు సినిమాల్లో చూస్తుంటాం. నిజం జీవితంలోనూ ఇలాంటివి జరుగుతాయా అంటే అంత సినిమాటిక్‌ డ్రామాలు కుదరవు అనే సమాధానం వస్తుంది. కానీ గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌ అవుతోంది. విడాకులు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్న దంపతులకు వీరి జీవితం కనువిప్పు కలిగిస్తుంది.

wife tears up divorce papers after realizing her husband s love goes viral

మరికొన్ని గంటల్లో కోర్టు ఆ దంపతులకు విడాకులు మంజూరు చేసే సమయం. న్యాయమూర్తి తీర్పుతో వారిద్దరి వివాహ బంధానికి ఫుల్‌స్టాప్‌ పడనుంది. వారి దారులు వేర్వేరు కానున్నాయి. కానీ అంతలోనే ఊహించని పరిణామం వారి దాంపత్య జీవితాన్ని మలుపు తిప్పింది. దంపతుల్లో ఒకరు వేసిన ముందడుగు వారి పచ్చని కాపురం మళ్లీ ఊపిరి పోసుకుంది.

విడాకుల కేసులు.. కొవిడ్‌కి ముందు ఆ తర్వాత అని చెప్పకోవచ్చు. కరోనా సమయంలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, ఉమ్మడి కుటుంబాలు, వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానంతో దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు, కలహాలు చోటుచేసుకున్నాయి. ఫలితంగా కోర్టులో డైవర్స్‌ కేసులు కరోనాకి ముందుతో పోలిస్తే విపరీతంగా పెరిగాయి. ఆ సమయంలోనే ఢిల్లీలోని ఓ జంట కూడా తమ బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారు.

ఢిల్లీకి చెందిన శిఖా సింగ్‌కి సౌరభ్‌తో 2020లో వివాహమైంది. కొంతకాలం తర్వాత వారి మధ్య విభేదాలు తలెత్తడంతో పరిస్థితి దిగజారి ఒకరికొకరు కలిసి ఉండలేమని నిర్ణయానికి వచ్చారు. దీంతో సౌరభ్‌పై శిఖా వరకట్న వేధింపుల కేసు పెట్టింది. అయితే అప్పటి నుంచే శిఖా పుట్టింటి తరఫు వారికి అసలు సమస్యలు మొదలయ్యాయి.

సౌరభ్‌పై న్యాయపోరాటం చేస్తున్న సమయంలో శిఖా తండ్రికి లాయర్‌ ఫీజులు, తరచూ కోర్టుకి వెళ్లాల్సి రావడం ఇలా చాలా కారణాలతో డబ్బు చాలా ఖర్చు చేశారు. దీంతో తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ క్రమంలో శిఖా తండ్రికి ఇటీవల గుండెపోటు రావడంతో ఆయనను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.

అప్పటివరకూ ఎడ మొహం పెడ మొహంగా ఉన్న సౌరభ్‌.. మామగారి పరిస్థితి తెలియగానే భార్య, ఆమె కుటుంబంతో ఉన్న గొడవలన్నీ మరిచిపోయాడు. కుటుంబ బంధాలు, మానవత్వం కోణంలో అతను ఆస్పత్రికి వెళ్లి మామగారిని పరామర్శించి మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా.. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది.

ఇదిలా ఉండగా.. శిఖ, సౌరభ్‌ విడాకుల విచారణలో భాగంగా చివరి సారిగా కోర్టులో హాజరుకావాల్సిన సమయం వచ్చింది. ఈ క్రమంలో కోర్టుకి చేరుకున్న భర్తను చూడగానే శిఖ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకని వెంటనే విడాకుల పత్రాలన్నీ చించివేసింది. భర్తను కౌగిలించుకుని మనసారా కన్నీళ్లు రాల్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విడాకుల విచారణకి కొన్ని క్షణాల్లో ముందే శిఖ వేసిన ఆ ఒక్క అడుగు వారి బంధం బలపడటానికి కారణమైందంటూ నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో దంపతుల మధ్య బలమైన బంధానికి చాలా సలహాలు నేర్పిస్తుంది. వివాహ బంధం స్ట్రాంగ్‌గా ఉండాలంటే గొడవల కంటే సామరస్యానికే ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తుంది.

Story first published: Monday, June 15, 2026, 15:11 [IST]
Desktop Bottom Promotion