భైశాఖి, సూర్యమాన నూతన సంవత్సరం

భైశాఖి, సూర్యమాన నూతన సంవత్సరం

సిక్కులు జరుపుకునే పండుగలలో అత్యంత ప్రాశస్త్యం కలిగిన పండుగ బైశాఖి లేదా వైశాఖి. ప్రతిసంవత్సరం ఏప్రిల్ 13వ తేదీన మరియు 36 సంవత్సరాలకు ఒకసారి ఏప్రిల్ 14 వ తేదీన వచ్చే ఈ పండుగను సూర్యమాన నూతన సంవత్సరం దినంగా జరుపుకుంటారు.

ఈ సంవత్సరం ఏప్రిల్ 14 వ తేదీన, శనివారంనాడు ఈ పండుగ వచ్చింది. వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు కనుక, పంజాబ్ మరియు హర్యానాల్లో ప్రముఖంగా చేసుకుంటారు. అత్యధిక శాతం సిక్కులు ఇప్పటికీ ఈ రాష్ట్రాలలోనే ఉన్నారు.

సిక్కు మతంలోని వ్యవసాయదారులు రబి కాలం ముగియడాన్ని కొత్త సంవత్సరంగా భావించి, ఈ రోజున ఖల్సా పంత్ ఏర్పాటు చేస్తారు. పంజాబ్ మరియు హర్యానా రెండు రాష్ట్రాల్లో జరుపుకున్నప్పుటికిని, పంజాబ్ లో ఈ వేడుకను అత్యంత వైభవంగా జరుపుకుంటారు.

Baisakhi, The Solar New Year

వైశాఖిని వివిధ నామాలతో ఇతర రాష్ట్రములలో కూడా జరుపుకుంటారు. అసోంలో "రంగోలి బిహు", బెంగాల్ లో "నబ బర్ష" , తమిళనాడులో "పుతాండు", కేరళలో "పురం విషు" మరియు బీహారులో "వైశాఖ్" పేర్లతో జరుపుకుంటారు.

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కూడా ఈ రోజున సూర్యుడు మేష రాశిలోనికి ప్రవేశిస్తాడు. అందుకే ఈ పండుగను "మేష సంక్రాంతి" అని కూడా అంటారు.

సిక్కుమతంలో ఈ దినము యొక్క ప్రాశస్త్యం: మొఘల్ రాజైన ఔరంగజేబు దేశమంతటా ఇస్లాం మతం మాత్రమే ఉండాలన్న కోరికతో, దానికనుగుణంగా అనేక ఆంక్షలు పెట్టాడు. దీనివల్ల అనేక ఇతర మతాలు కనుమరుగయ్యే అవకాశం ఉన్నందున కలత చెందిన సిక్కుల 9వ గురువైన గురు అర్జున్ దేవ్ సిక్కుమత ఉనికిని కాపాడటానికి మరియు వ్యాప్తిని ప్రోత్సహించడానికి నడుము బిగించారు.

గురు అర్జున్ దేవ్ ను తన ఆశయాలకు అడ్డంకిగా భావించిన ఔరంగజేబు, ఆయన తలను బహిరంగంగా నరికేశాడు. అర్జున్ దేవ్ తదనంతరం ఆయన కుమారుడైన గురు గోవింద్ సింగ్ తన మాట ప్రవర్ధమానానికై తండ్రి బాధ్యతలను తన తలకెత్తుకున్నాడు. ఈ పదవ గురువు 1699లో బైశాఖి దినమున ఖల్సా పంత్ స్థాపించాడు. కనుక ఈ దినం సిక్కు మతం వారికి ప్రాముఖ్యమైనది.

భారతదేశంలోని సిక్కులందరు ఈ పండుగను స్పూర్తితో జరుపుకుంటారు. ప్రాతఃకాలాన్నే లేచి పవిత్ర నదులలో స్నానం ఆచరించి తమ ఇష్ట దేవతలను కొలుస్తారు. చాలామంది ఖల్సా పంత్ ప్రకటింపబడిన అమృతసర్ లో ఉన్న బంగారు దేవాలయం లేదా ఆనంద్ సాహిబ్ ను దర్శిస్తారు. మిగిలిన వారు తమకు దగ్గరలో ఉన్న గురుద్వారాను సందర్శిస్తారు.

పొద్దుటి ప్రార్ధనలు సమర్పించిన అనంతరం, తమ మతపరమైన కార్యక్రమాలు చేపడతారు. తమ మతగ్రంధమైన గురుగ్రంథ సాహిబ్ కు పాలు నీళ్లతో స్నానమాచరింపచేస్తారు. గురు గోవింద్ సింగ్ కు "పాంచ్ ప్యారా"లుగా పిలువబడే ఐదుగురు ప్రియ శిష్యులున్నారు. వారు ఖల్సా పంత్ ప్రారంభమైనప్పుడు, పవిత్ర మంత్రములను జపించారు. అదేవిధంగా ఇప్పటికి ఐదుగురు వారి పేరుతో పవిత్ర మంత్రములను జపిస్తారు. తరువాత భక్తులకు"అమృత్ ప్రసాదాన్ని" పంచుతారు. అప్పుడు వారి బైశాఖి సాంస్కృతిక కార్యక్రమాలు మొదలవుతాయి.

తమ సాంప్రదాయ వస్త్రాలతో, ఢోల్ మోతలకు అనుగుణంగా భాంగ్రా, గిద్దా వంటి పంజాబీ గ్రామీణ నృత్యాలు చేస్తూ ఆనందిస్తారు. మధ్యాహ్న భోజనమైన "లంగర్"లో ప్రసాదాన్ని ఆరగిస్తారు.

రైతులకు ప్రాధాన్యత: రైతులు కూడా ఈ రోజును పవిత్ర నదులలో స్నానం ఆచరించి మొదలుపెడతారు. తరువాత ప్రార్ధనలు సమర్పించిన అనంతరం ఆ కాలంలో లభించే వివిధ ఆహర పదార్థాలతో చేసిన వంటలను భగవంతునికి సమర్పిస్తారు. వారు భగవంతునికి తమకు మంచి పంటని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుని, మరుసటి సంవత్సరం కూడా మరలా సుభిక్షంగా ఉండేటట్టు చేయమని వేడుకుంటారు.

Story first published: Thursday, April 12, 2018, 7:00 [IST]
Desktop Bottom Promotion