Bonalu 2023: శివసత్తులు అంటే ఎవరు? వారి ప్రాముఖ్యత ఏంటో తెలుసా?

బోనాలు.. తెలంగాణ రాష్ట్రీయ పండగ. బోనాల జాతర తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు ప్రతీక. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో అట్టహాసంగా జరిగే బోనాల జాతర.. ముఖ్యంగా హైదరాబాద్ లో అంబరాన్ని అంటుతాయి. గోల్కొండ బోనాలు, లష్కర్ బోనాలు, లాల్‌దర్వాజ బోనాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంటాయి. ఇక్కడ జరిగే ఉత్సవాల్లో నగరమంతా పాల్గొంటుంది. అయితే డప్పు చప్పుళ్లతో జాతరగా బోనాలు తరలివెళ్తుంటాయి. ముందు డబ్బు చప్పుళ్లు, ఆ తర్వాత పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, వెనక తలపై బోనాలతో మహిళలు అమ్మవార్ల దగ్గరికి వెళ్తుంటారు. బోనాల జాతరలో కనిపించే శివసత్తులు అంటే ఎవరు, వారి ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Bonalu 2023 Who Is Shiva Sathulu? Significance Of Shiva Sathulu In Bonalu Know In Telugu

శివసత్తులు అంటే ఎవరు?

డప్పు చప్పుళ్లతో జాతరగా బోనాలు తరలివెళ్తుంటాయి. ముందు డబ్బు చప్పుళ్లు, ఆ తర్వాత పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, వెనక బోనాలతో మహిళలు తరలి వెళ్తుంటారు. ఈ సమయంలో పసుపు రంగు చీరలు(ఎక్కువ శాతం) కట్టుకుని జుట్టు విరబూసుకుని, చేతుల్లో వేప మండలు పట్టుకుని పూనకంతో డప్పు చప్పుళ్లకు అనుగుణంగా నృత్యం చేస్తూ ముందుకు సాగుతారు శివసత్తులు. ఈ సమయంలో వారికి సిగం వస్తుంది. సిగం అంటే అమ్మవారు పూనడం. దీనినే పూనకం అని కూడా అంటారు.


శివపార్వతుల దైవిక శక్తితో సిగం:

దైవం అంశంతో వచ్చే దైవిక శక్తి అది. సిగం వచ్చిన వారికి ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఈ సిగం వచ్చినప్పుడు వారేం చేస్తున్నారో కూడా వారికి తెలియదు. వారు సత్యాలు పలుకుతారు. భవిష్యత్తు గురించి చెబుతారు. పచ్చి కుండపై నిలబడి రంగం చెబుతారు. రంగం అంటే భవిష్యత్ లో జరగబోయే విషయాల గురించి చెబుతారు. భవిష్యత్ ఎలా ఉండబోతుందో వివరిస్తారు. సిగం వచ్చినప్పుడు వారిలోకి శివశక్తి ప్రవేశిస్తుందని నమ్ముతారు. శివపార్వతుల సంయుక్త శక్తి శివసత్తుల్లో ప్రవేశించి వారితో భవిష్యత్తు చెప్పిస్తుందని భక్తుల విశ్వాసం.


శివసత్తుల చుట్టూ భక్తుల విశ్వాసాలు:

సిగం వచ్చి సిగాలెత్తే శివసత్తులను దైవ స్వరూపంగా భావిస్తారు భక్తులు. వారి రూపంలో ఆ అమ్మే ముందు ఉందని విశ్వసిస్తారు. శివసత్తుల చేతుల మీదుగా పండ్లు ఫలాలు పుచ్చుకున్నా, వాళ్లు తలపై చేయి పెట్టి దీవించినా, వాళ్లు ఎదురైనా మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. బోనాలతో పాటు మేడారం జాతర, మల్లన్న పట్నాలు, కొమురవెల్లి జాతరలో కూడా శివసత్తులు తమ పూనకాలతో దైవత్వాన్ని ప్రదర్శిస్తారు. జాతరల్లో పాల్గొనే సమయంలో శివసత్తులు పూర్తిగా ఉపవాసాన్ని పాటిస్తారు.

గావు పట్టడం అంటే ఏంటి?

బోనాల వేళ గావు పట్టడం అనేది చాలా కాలంగా వస్తున్న సాంప్రదాయం. గావు పట్టడం అంటే వేటపోతు గొంతును నోటితో కొరికి దానిని బలి ఇవ్వడం. జంతు హింసతో కూడుకుని ఉన్న ఈ ఆచారాన్ని చాలా ప్రాంతాల్లో ఈరోజుల్లో పాటించడం లేదు. ప్రభుత్వ అధికారిక వేడుకల్లోనూ గావు పట్టడానికి బదులు కుష్మాండ బలి ఇస్తుంటారు. కుష్మాండం అంటే బూడిద గుమ్మడి కాయ. వేటపోతు స్థానంలో కుష్మాండాన్ని బలి ఇస్తున్నారు. చాలా మంది భక్తులు కూడా గావు పట్టడానికి బదులు మేకలు, కోళ్లను సమర్పించి మొక్కు తీర్చుకుంటున్నారు. అయితే పశువులను బలి ఇచ్చినప్పటికీ.. గ్రామ దేవతలకు మాత్రం సాత్విక ఆహారాన్నే బోనంగా సమర్పిస్తారు. బెల్లంతో చేసిన అన్నం, పెరుగు అన్నంతో తయారు చేసిన బోనం సమర్పిస్తారు. బలి ఇచ్చిన పశువుల మాంసాన్ని భక్తులు మాత్రమే స్వీకరిస్తారు.

Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.

Story first published: Sunday, June 25, 2023, 13:13 [IST]
Desktop Bottom Promotion