వారాహి అమ్మవారి నవరాత్రి పూజలు ఇలా చేయాలి..ఒక్క రోజు చేసినా అమ్మవారి ఆశీస్సులు వుంటాయ్..!

హిందూ సాంప్రదాయంలో వారాహి దేవిని ఆషాడమాసంలో పూజిస్తారు. వారాహి అమ్మవారిని పూజించడం వల్ల సకల శుభాలూ కలుగుతాయ. జులై 6 నుంచి 15 వ తేదీ వరకు వారాహి అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయ్. ఈ వారాహి నవరాత్రులు చాలా శక్తివంతమైనవిగా చెప్పుకుంటారు. ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారిని పూజిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం దక్కుతుందని శాస్త్రంలో వుంది. పండితులు కూడా అదే విషయాన్ని చెబుతున్నారు. తొమ్మిది రోజులు పూజ చేస్తే మీకు ఎంతో మంచి జరుగుతుంది. ఈ నవరాత్రుల్లో ఏదైనా ఒక రోజు ఇక్కడ చెప్పిన విధంగా పూజచేయండి. ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కరోజు పూజించినా ఆ అమ్మవారి చల్లని చూపు మీపై మీ కుటుంబంపై పడుతుంది. ఏ ఇంటి మీదైతే అమ్మవారి అనుగ్రహం వుంటుందో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు నిండి వుంటాయ్. మీకు ఎన్ని సమస్యలు వున్నా వారాహి అమ్మవారిని పూజిస్తే మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయ్.

varahi ammavari navaratri pooja

వారాహి అమ్మవారి పూజ ఎప్పుడంటే అప్పుడు చేయడానికి వీలు పడదు. సాయంత్రం 6 నుంచి 9 లోపు మాత్రమే పూజ చేయాలి. పూజ చేసే ముందు వారాహి అమ్మవారి ఫోటోను తీసుకొని వచ్చి పూజా మందిరంలో పెట్టుకోవాలి. వారాహి అమ్మవారి ఫోటో లేకపోతే లక్ష్మీదేవి ఫోటోకైనా మీరు పూజ చేయవచ్చు. వారాహి అమ్మవారిని ఏ రూపంలోనైనా సరే పూజించుకోవచ్చు. లేదంటే పసుపుతో చిన్న ముద్దను చేసి దానికి కుంకుమను పెట్టి వారాహి అమ్మవారి స్వరూపంగా భావించి పూజలు చేసుకోవచ్చు. అమ్మవారికి పూజ చేసే ముందు స్త్రీలు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రంగా తుడుచుకోవాలి. ఇంటిని తుడిచే సమయంలో నీళ్లల్లో కొంచెం రాళ్ల ఉప్పును వేసి తుడవాలి. ఇలా చేస్తే ఇంట్లో వున్న నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుంది.

ఇళ్లు తుడిచిన తరువాత ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకోవాలి. ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇంటి గుమ్మం ముందు కచ్ఛితంగా ముగ్గులు వేసుకోవాలి. పూజ గదిని కూడా బాగా శుభ్ర చేసుకొని దేవుని పటాలకు పసుపు కుంకుమలు పెట్టి పూలతో అలంకరించుకోవాలి. వారాహి అమ్మవారికి ఎరుపు రంగంటే ఎక్కువ ఇష్టం కాబట్టి ఎరుపు రంగు పువ్వులను పూజలో ఉపయోగించాలి. పూజగది ముందు లేదంటే పూజ గదిలో అష్టదళ ముగ్గును వేసి ముగ్గుపై పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. అమ్మవారి ముందు తాంబూలం పెట్టి ఒక చీర లేదంటే జాకెట్ ముక్కను అమ్మవారికి సమర్పించాలి. లేదంటే ఒక ముత్తైదువును ఇంటికి పిలిచి ఆమెను అమ్మవారి స్వరూపంగా భావించి ఆమెకు పసుపు, కుంకుమతో పాటు వస్త్రాన్ని వాయనంగా ఇవ్వాలి.

varahi ammavari navaratri pooja

దీపం వెలిగించే ముందు ప్రమిదలకు పసుపు కుంకుమను రాసి బొట్టు పెట్టి దీపంలో నువ్వుల నూనెను పోసి, అందులో ఐదు వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. వెంటనే ఆ దీపానికి సమస్కారం చేసుకోవాలి. పూజలో వారాహి అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని సమర్పించాలి. అమ్మవారికి బెల్లం పానకం చాలా ఇష్టం కాబట్టి మీరు సమర్పిస్తే అమ్మవారు చాలా సంతోషిస్తారు. మీ శక్తి సామర్ధ్యాలను బట్టి ఎన్ని నైవేద్యాలనైనా సమర్పించవచ్చు.

అమ్మవారికి హారతినిచ్చి 5 ప్రదక్షిణలు చేసుకోవాలి. తరువాత ధూపాన్ని కూడా సమర్పించాలి. ధూపం వేస్తేనే పూజ పూర్తయినట్టు. ధూపం వేసిన తరువాత పూజగదిలో వున్న అక్షింతలను ఇంట్లో అందరి తలపై వేసుకోవాలి.పూజ చేసేటప్పుడు వారాహి మంత్రం జపిస్తే మరింత మంచి ఫలితం వస్తుంది. "ఓం హ్రీం వారాహి హరి ఓం" ఈ మంత్రాన్ని వారాహి అమ్మవారి నవరాత్రల వరకు ప్రతీ రోజూ పారాయణం చేయాలి.

Story first published: Sunday, July 7, 2024, 20:31 [IST]
Desktop Bottom Promotion