సాధారణంగా గర్భగుడిలో ఒకటే శివలింగం ఉంటుంది, ఆ ప్రఖ్యాత ఆలయంలో మాత్రం 2 లింగాలు ఉంటాయి

పవిత్ర గోదారవరి నదికి ఉపనది అయిన ప్రాణహిత కలిసే చోట ఉంటుంది కాళేశ్వర క్షేత్రం. ఈ ఆలయం పేరు మీదుగానే తెలంగాణలోని అతిపెద్ద ప్రాజెక్టుకు కాళేశ్వరం ప్రాజెక్టు అనే పేరు పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధి గాంచిన త్రిలింగ క్షేత్రాల్లో కాళేశ్వర ఆలయం కూడా ఒకటి.

ఈ ఆలయం ఎంతో మహిమ కలది. కరీంనగర్ కు 125 కిలోమీటర్ల దూరంలో మహాదేవపూర్ మండలానికి సమీపంలో దట్టమైన అడవి మధ్యలో, చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల నడుమ, పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలసిన ఈ క్షేత్రానికి చాలా విశిష్టత ఉంది.

Kaleshwaram Temple In Telangana Significance In Telugu

కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ ప్రత్యేకత:

సాధారణంగా ఏ గర్భగుడిలో అయినా ఎన్ని శివలింగాలు ఉంటాయి. ఒకటే కదా.. కానీ కాళేశ్వర క్షేత్రం అందుకు మినహాయింపు. ఎందుకంటే కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం గర్భగుడిలో రెండు శివలింగాలు పూజలు అందుకుంటాయి. అందులో ఒక శివలింగాన్ని ముక్తేశ్వరుడిగా(శివుడిగా), మరొకటేమో కాళేశ్వరునిదిగా(యముడు) గా పూజిస్తారు. ఇటువంటి ప్రత్యేకత కలిగిన ఆలయం బహుశా.. భారత్ లో మరో చోట కనిపించదు.

కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ స్థల పురాణం:

తనను దర్శింకుకున్న భక్తులు అందరికీ ముక్తేశ్వర స్వామి అనుగ్రహించేవారట. అలా యమధర్మ రాజుకు పని లేకుండా పోయిందట. దీంతో చేసేదేం లేక యముడు ముక్తేశ్వర స్వామి వద్దకు వెళ్లి తన పరిస్థితి గురించి విన్నవించుకుని వేడుకున్నాడు. యముని విజ్ఞప్తిని ఆలకించిన శివుడు.. యముడిని తన పక్కనే ఉండమని లింగరూపంలో నిల్చోమని ఆదేశించాడు. తన క్షేత్రానికి వచ్చి, తనను దర్శించుకుని యముడిని దర్శించుకోని వారికి మోక్షం లభించదని చెప్పాడు శివుడు. అలాంటి వారికి ఆయుష్షు కూడా ఎంత నిర్ణయించబడితే అంతే ఉంటుందిట. ఆ తర్వాత వారిని తన వెంట తీసుకెళ్లాలని శివుడు యముడితో చెప్పాడు. అలా ఈ క్షేత్రానికి కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంగా పేరు వచ్చింది. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులు శివుడితో పాటు యముడిని కూడా దర్శించుకుని పూజిస్తారు.

శివలింగాల ప్రత్యేకత:

కాళేశ్వర క్షేత్రంలోని గర్భగుడిలో రెండు శివలింగాలు ఉంటాయి. అవి కూడా ఒకే పానవట్టం మీద ఉండటం విశేషం. అలాగే ముక్తేశ్వర స్వామి లింగంలో రెండు రంధ్రాలు ఉండటం మరో ప్రత్యేకత. ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు సమీపంలోని గోదావరి, ప్రాణహిత సంగమ స్థలంలో వెళ్లి కలుస్తాయని అంటారు.

ఆది ముక్తేశ్వర ఆలయం:

కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయానికి పడమటి వైపు యమగుండం మీద సుమారు ఒక కిలోమీటరు దూరంలో ఆదిముక్తీశ్వరాలయం ఉంటుంది. ఆ ఆలయం చుట్టూ పక్కల ప్రకృతి సిద్ధంగా విభూతి రాళ్లు లభించడం విశేషం. అలాగే ఈ ఆలయంలోకి వెళ్లేటప్పుడు యమకోణం కూడా కనిపిస్తుంది. ఈ యమకోణం నుంచి బయటకు వెళ్తే యమ దోషం తొలగిపోతుంది అని భక్తుల విశ్వాసం.

కాళేశ్వరంలో శ్రీ శుభానంద ఆలయం, రాముల వారి ఆలయం, దత్తాత్రేయ స్వామి ఆలయం, సంగమేశ్వర ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, విజయ గణపతి ఆలయం, గోదావరి మాత ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, నాగదేవత ఆలయం చూడవచ్చు.

Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.

Story first published: Monday, July 17, 2023, 13:30 [IST]
Desktop Bottom Promotion