పర్యాటక కేంద్రంగా వైజాగ్ కాలనీ.. ప్రకృతిని ఆస్వాదిస్తూ మైమరిచిపోతున్న టూరిస్టులు

నాగార్జున సాగర్ ప్రాజెక్టు మాత్రమే కాదు దాని బ్యాక్ వాటర్ కూడా పర్యాకట శోభను సంతరించుకుంటోంది. నాగార్జున సాగర్ అనగానే గేట్ల నుంచి జాలువారే నీటి ప్రవాహం లేదంటే.. జలాశయం మధ్యలో ఉండే నాగార్జున కొండ మాత్రమే అనుకుంటారు చాలా మంది.

ఎవరైనా నాగార్జున సాగర్ కు వెళ్లినా గేట్లు ఓపెన్ చేస్తే నీటి ప్రవాహాన్ని లేదంటే.. నీటి మధ్యలో ఉండే ఐలాండ్ ను చూసి వస్తారు. ఈ జాబితాలోకి మరో ప్రాంతం చేరుకుంది. నాగార్జనసాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Nalgonda Vizag Colony Is Attracting As A Tourist Destination Know In Telugu

ఈ బ్యాక్ వాటర్ ప్రాంతాన్నే వైజాగ్ కాలనీగా పిలుస్తారు. చెంతనే కృష్ణమ్మ, ఇసుక తిన్నెలు, రాళ్లూ, చల్లగా వీచే గాలితో ఈ ప్రాంతం చాలా బాగుంటుంది. కాసేపు అలా వచ్చి ఇక్కడ సేదతీరేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. క్రమంగా వైజాగ్ కాలనీకి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది.

ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకుల కోసం సమీపంలోనే చేపలు, నాటు కోడికూర, జొన్న రొట్టెలు కూడా లభిస్తుంటాయి. లేదంటే.. మనమే స్వయంగా వంట చేసుకుని హాయిగా గడపొచ్చు. పచ్చని కొండల నడుమ, గిలిగింతలు పెట్టే చల్లని గాలి, పక్కనే కృష్ణమ్మ ఊహించుకోవడానికే చాలా అద్భుతంగా ఉంటుంది.

పర్యాటకేంద్రంగా మారుతున్న వైజాగ్ కాలనీ:

నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతంలోని చందంపేట, నేరేడుగొమ్మ మండలాల్లో నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ కలిసి ఉంటుంది. నేరేడుగొమ్మ మండలంలోని వైజాగ్ కాలనీ ఇప్పుడు పర్యాటక కేంద్రంగా మారుతోంది. సెలవు దినాల్లో, ఆదివారాల్లో ఈ వైజాగ్ కాలనీకి పర్యాటకుల తాకిడి పెరుగుతుంది.

పులకింపజేసే ప్రకృతి:

నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ తో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన వైజాగ్ కాలనీ పర్యాటకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఈ ప్రాంత పచ్చదనంతో కనువిందు చేసే కొండల మధ్య, గిరిజన తండాలతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి ప్రకృతి పులకింపజేస్తుంది. సెలవు దినాల్లో, ఆదివారాల్లో ఇక్కడికి వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వర్షాలు కూడా మొదలవడంతో ఈ ప్రాంతం మరింత ఆహ్లాదంగా కనిపిస్తోంది. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు స్థానిక మత్స్యకారుల కుటుంబాలు భోజన ఏర్పాట్లు కూడా చేస్తుంటాయి. ఆర్డర్ మెస్ లు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి.

అలలపై జాలీగా విహరించొచ్చు:

ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం స్థానిక మత్స్యకారులు బోట్లు, నాటు పడవలు, మర బోట్లు కూడా నడిపిస్తుంటారు. కొంత మొత్తంతో కృష్ణా నీటిపై హాయిగా, జాలీగా ట్రిప్పు వేసేయొచ్చు. చుట్టూ కొండలు, కింద నీళ్లు, చల్లగా వీచే గాలితో సూపర్ గా ఎంజాయ్ చేయవచ్చు.

ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య రెట్టింపు అయినట్లు స్థానికులు చెబుతున్నారు. వాతావరణం అనుకూలిస్తుండటం వల్ల సెలవు దినాల్లో, ఆదివారాల్లో వైజాగ్ కాలనీకి వెళ్లి ఎంజాయ్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. వైజాగా కాలనీ ప్రాంతాన్ని కొద్దిగా అభివృద్ధి చేస్తే మరింత ఎక్కువ మంది పర్యాటకులు ఇక్కడి వచ్చే అవకాశం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

Story first published: Monday, July 17, 2023, 15:00 [IST]
Desktop Bottom Promotion