Tirumal Brahmotsavam: తిరుమలలో స్వర్ణరథంపై ఊరేగిన కోనేటి రాయుడు

Tirumal Brahmotsavam: కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి వెలసిన తిరుమలలోని శ్రీవారి వార్షిక‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన శ‌నివారం సాయంత్రం శ్రీవారు బంగారు తేరులో పయనిస్తూ, భక్తుల్ని తన కృపాకటాక్షాలతో అనుగ్ర‌హించారు. దాసభక్తుల నృత్యాలతోను, భజనబృందాల కోలాహలం, మంగళ వాయిద్యాల న‌డుమ తిరు మాడవీధులలో కడురమణీయంగా స్వ‌ర్ణర‌థోత్స‌వం అత్యంత వైభ‌వంగా జరిగింది.

Tirumal Brahmotsavam

మ‌హిళ‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొని శ్రీ‌వారి స్వర్ణ రథాన్ని లాగారు:

తిరుమలలో స్వర్ణ రథాన్ని మహిళలు మాత్రమే లాగడం సాంప్రధాయంగా వస్తోంది. స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ; భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భ‌క్తుల విశ్వాసం.

గజ వాహనంపై శ్రీ మలయప్ప కనువిందు

శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు శ‌నివారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు గజవాహనంపై దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్ర‌ద‌ర్శ‌న‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు స్వామివారిని వాహ‌న‌సేవ‌లో ద‌ర్శించుకున్నారు.

Tirumal Brahmotsavam: Srivari Salakatla Brahmotsavam in Tirumala, TTD observed Swarna Rathotsavam

గజ వాహనం అంటే క‌ర్మ విముక్తి అని పురాణాలు చెబుతున్నాయి.

నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి. మంగళకరమైన గజరాజుకు అతిశయమైన మంగళత్వం కలిగించేందుకు శ్రీవారు ఆరో రోజు తన సార్వభౌమత్వాన్ని భక్తులకు తెలిపేందుకు గజవాహనంపై ఊరేగుతాడు.

ఏనుగు ఓంకారానికీ, విశ్వానికీ సంకేతం. స్వామి ప్రణవరూపుడు, విశ్వాకారుడూ, విశ్వాధారుడూ కనుక గజరాజుపై ఊరేగడం ఎంతో సముచితం. ఈ ఉత్సవం మనలోని అహంకారం తొలగితే మనపై రక్షకుడుగా భగవంతుడుంటాడనే సంగతి గుర్తు చేస్తుంది.

వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల‌ శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, తిరుమ‌ల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి పాల్గొన్నారు.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్స‌వాల్లో ఆర‌వ‌ రోజైన శ‌నివారం రాత్రి గ‌జ‌ వాహ‌నసేవ‌లో టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కళా బృందాల ప్రదర్శనలు భక్తులకు మ‌రింత ఆధ్యాత్మికానందం కలిగించాయి. ఆంధ్ర‌, త‌మిళ‌నాడు, పాండిచ్చేరి, కేర‌ళ‌, ఒరిస్సా, రాజ‌స్థాన్ రాష్ట్రాలకు చెందిన క‌ళాబృందాలలో 250 మంది క‌ళాకారులు ప్ర‌ద‌ర్శ‌న‌లిచ్చారు.

పాండిచ్చేరికి చెందిన శ్రీ ల‌లితాంబిగై ట్రూప్‌లోని క‌ళాకారులు బ్ర‌హ్మ‌, ల‌క్ష్మీనారాయ‌ణులు, ప‌ర‌మ‌శివుడిని ప్రార్ధిస్తున్న భ‌గీర‌ధుడి వేష దార‌ణ‌లు ధ‌రించి గంగా అవ‌త‌ర‌ణ నృత్య రూప‌క ప్ర‌ద‌ర్శ‌న ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌కు అనుగుణంగా పంబ‌లు వాయిస్తూ క‌ళాకారులు మ‌రింత ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.

Story first published: Sunday, September 24, 2023, 9:30 [IST]
Desktop Bottom Promotion