జగన్నాథుడి రథయాత్ర ఓ ముస్లిం సమాధి వద్ద ఎందుకు ఆగుతుంది? దీని వెనక ఆధ్యాత్మిక గాథ తెలుసా?

పూరీ జగన్నాథుని రథయాత్ర.. ఈ గొప్ప ఆధ్యాత్మిక వేడుక ఎంతో అట్టహాసంగా జరుగుతుంది. 9 రోజుల పాటు జరిగే దేశంలో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకల్లో ఒకటైన రథయాత్రను చూసేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. లక్షలాది మంది భక్తులతో ఈ ప్రాంతం కిక్కిరిసిపోతుంది. జగన్నాథుడు, బలరాముడు, సుభద్రలతో కూడిన మూడు రథాలు 9 రోజుల పాటు యాత్ర సాగిస్తాయి.

జూన్ 20వ తేదీన ప్రారంభమైన పూరీ జగన్నాథుడి రథయాత్ర 9 రోజుల పాటు సాగనుంది. అయితే ఈ రథయాత్రకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం ఉంది. జగన్నాథుడి రథయాత్ర ఓ ముస్లిం సమాధి వద్ద ఆగుతుంది. అక్కడ కాసేపు ఆగిన తర్వాత తిరిగి యాత్ర కొనసాగుతుంది. ముస్లిం సమాధి వద్ద రథయాత్ర ఆగడం వెనక కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Masani Amman lying down

శ్రీకృష్ణుడి ముస్లిం భక్తుడు:

పురాణాల ప్రకారం పూరీ జగన్నాథుడికి సలబేగా అనే ముస్లిం భక్తుడు ఉండే వాడు. సలబేగా తల్లి హిందువు కాగా, తండ్రి మాత్రం ముస్లిం. తండ్రి పేరు లాల్‌బేగ్. అతడు జహంగీర్ ఖులి ఖాన్ మొఘల్ చక్రవర్తి జహంగీర్ పాలనలో సుబేదార్ గా పని చేసేవాడు. ఒకరోజు ఒడిశాకు వచ్చిన లాల్‌బేగ్.. స్నానం చేసి తిరిగి వస్తున్న ఓ వితంతువురాలైన బ్రహ్మణ మహిళను చూసి ఇష్టపడతాడు. ఆమెను బలవంతంగా తన గుర్రంపై వేసుకుని ఇంటికి తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాడు. లాల్‌బేగ్ మంచితనం చూసిన ఆ మహిళ తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. వీరికిల సలబేగా అనే కుమారుడు జన్మిస్తాడు. లాల్‌బేగ్ ముస్లిం అయినప్పటికీ.. తన భార్యను హిందువుగానే కొనసాగేందుకు స్వేచ్ఛనిస్తాడు. ఆమె శ్రీకృష్ణుడి భక్తురాలు.

గాయాలతో మొదలైన భక్తి:

సలబేగా తండ్రితో పాటు యుద్ధాల్లో పాల్గొనేవాడు. అలా ఓ యుద్ధంలో పాల్గొన్నప్పుడు సలబేగా తీవ్రంగా గాయపడ్డాడు. అప్పుడు సలబేగా తల్లి శ్రీకృష్ణుడి నామాన్ని జపించాలని, ఆయనను ఆరాధిస్తే గాయాల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుందని చెబుతుంది. తల్లి చెప్పినట్లుగానే శ్రీకృష్ణుడి నామాలను జపించడంతో సలబేగా త్వరగా కోలుకున్నాడు. అలా సలబేగాకు శ్రీకృష్ణుడి పట్ల ఇష్టం పెరుగుతుంది. ఆయనను ఆరాధించడం మొదలు పెట్టాడు. శ్రీకృష్ణ భగవానుడి గురించి మరిన్ని విషయాలు తెలుసుకున్నాడు. అలా శ్రీకృష్ణుడి భక్తిలో పరవశించిపోయాడు. అలా ఒకరోజు సలబేగా తల్లి పూరీ జగన్నాథుడి ఆలయ విశిష్టత, అక్కడి చరిత్ర, పురాణ ఇతిహాసాల్లో పూరీ క్షేత్ర ప్రాముఖ్యత గురించి చెప్పింది. అవన్నీ విని పరవశించిపోయిన సలబేగా పూరీలో జగన్నాథుడిని దర్శించుకోవాలని బయల్దేరాడు.

ముస్లిం కావడంతో అడ్డుకున్న సిబ్బంది:

సలబేగా ముస్లిం కావడంతో తనను పూరీ జగన్నాథ ఆలయంలోకి ప్రవేశించేందుకు ఆలయ సిబ్బంది అడ్డుకున్నారు. దాంతో నిరాశతో వెనుదిరిగాడు సలబేగా. తర్వాత శ్రీకృష్ణడు నడయాడిన బృందావనానికి వెళ్లాడు. అక్కడ సాధువులతో, సన్యాసులతో కలిసి ఆధ్యాత్మిక సేవలో తరించిపోయాడు. బృందావనంలోనే ఉంటూ అక్కడి శ్రీకృష్ణుడిని ఆరాధించాడు. అలా ఓ సంవత్సరం పాటు అక్కడే ఉన్న సలబేగా.. పూరీలో జరిగే రథయాత్రను వీక్షించేందుకు బయల్దేరాడు.

ఆగాలని చేసిన ప్రార్థనను ఆలకించిన శ్రీకృష్ణుడు:

పూరీ క్షేత్రానికి బయలుదేరిన సలబేగా మార్గమధ్యంలో అస్వస్థతకు గురయ్యాడు. కదల్లేక పోయాడు. మార్గమాధ్యంలో ఉన్న సలబేగా ఆ కృష్ణ భగవానుడిని ప్రార్థించాడు. ఎంతో దూరం నుంచి రథయాత్ర చూసేందుకు వెళ్తుంటే ఇలా జరుగుతోందని, తను పూరీ క్షేత్రానికి వెళ్లే వరకు రథ యాత్ర వేచి ఉండాలని శ్రీకృష్ణుడిని ప్రార్థించాడు. అయితే ఆ రోజు రథయాత్ర ఓ చోటుకు వచ్చే సరికి ఆగిపోయిందట. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంచ్ కూడా కదల్లేదట నందిగోష్ (జగన్నాథుని రథం). వేలాది మంది లాగడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయట. అంతలోనే సలబేగా పూరీ క్షేత్రానికి చేరుకుని జగన్నాథుడిని దర్శించుకున్న తర్వాతే రథం ముందుకు కదిలిందని అంటారు.

అక్కడ రథం అందుకే ఆగుతుంది:

ఆ ప్రాంతం సలబేగా నివాస ప్రాంతంగా మారింది. ఆ తర్వాత సలబేగా ఉంటూ శ్రీకృష్ణుడిని ఆరాధిస్తూ కాలం గడిపాడు. అక్కడే ఎన్నో రచనలు చేశాడు. పతితపావనస్తక అని పిలిచే 8 సంస్కృత శ్లోకాలతో సహా 150కి పైగా భక్తి పాటలు రచించాడు. సలబేగా మరణించిన తర్వాత అదే ప్రాంతంలో అతని సమాధి నిర్మించారు. దీంతో ఈ అమర భక్తుడికి నివాళిగా ఏటా జరిగే పూరీ రథయాత్ర సలబేగా సమాధి వద్దకు రాగానే కాసేపు ఆగడం ఆనవాయితీగా వస్తోంది.

Story first published: Wednesday, June 21, 2023, 14:01 [IST]
Desktop Bottom Promotion