పాదాల పగుళ్లుకు సలభమైన...చక్కటి చిట్కాలు..!

Easy Care For Cracked Heels....!
మీ పాదాల గురించి మీకెంత తెలుసు? మనం నేల మీద నుంచోడానికి, నడవడానికి సహకరించే పాదాలు ఎప్పుడూ మన భారాన్ని మోస్తూ ఉంటాయి. అంటే ఎక్కువగా వత్తిడికి గురవుతూ ఉంటాయి. పాదాలతో పాటు అర చేతులు కూడా రకరకాల పనులలో సహకరిస్తూ ఉంటాయి. అందువల్ల పాదాల చర్మం, అరచేయి చర్మం మందంగా ఉంటాయి. పాదాలు దేహ సౌందర్యానికి ప్రధాన అంగాలు. ఈ విషయం తెలియక చాలామంది వీటిపట్ల నిర్లక్ష్యం వహిస్తుంటారు. దేహపరిశుభ్రతలో మనకెంత శ్రద్ధ ఉందో పాదాలను చూసి చెప్పేయవచ్చు. పాదాల విషయంలో నిర్లక్ష్యం వహించడం వల్ల పగుళ్లు ఏర్పడడం, ఎర్రగా కమలడం, అందవిహీనంగా తయారవడం జరుగుతుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ వాటిని శుభ్రంగా ఉంచుకోవడం ప్రథమంగా పాటించాల్సిన అంశం. స్త్రీలు ఎక్కువగా ఇంటి పనుల్లో నిమగ్నమై పాదాల ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోరు. దాంతో వారి పాదాలు ఎక్కువగా పగుళ్లిస్తుంటాయి. నిత్యం కొంత సమయం కేటాయిస్తే చాలు మీ పాదాల పగుళ్లను తీసివేయడమే కాకుండా వాటి అందాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు. ఇందుకు ఇంట్లోనే ఆచరించదగిన చక్కని పద్ధతులున్నాయి.

1. గోరువెచ్చని నీరు తీసుకొని అందులో నిమ్మరసం కొన్ని చుక్కలు చేర్చి మీ పాదాలను 5-10నిమిషాలపాటు అందులో ముంచాలి(పాదాలు పూర్తిగా మునిగేటట్లు చేయాలి). తర్వాత పొడి వస్త్రంతో శుభ్రంగా తుడిచి ఆపై మాయిశ్చరైజర్ రాసి తర్వాత నిద్రకు ఉపక్రమించాలి.
2. గోరువెచ్చని నీటిలో తేలికపాటి షాంపూను కొన్ని చుక్కలను వేసి, అందులో మీ పాదాలను కొద్దిసేపు నానే విధంగా చూసుకోవాలి. తర్వాత ప్యూమిస్ స్టోన్ (సున్నితమైనటువంటి రాయి)తో రుద్ది శుభ్రపరుచుకొంటే చర్మం మీద ఉండే పొడిబారిన, రఫ్ గా ఉన్న కణాలు తొలగిపోయి పాదాలను సున్నితంగా, నునుపుగా మారుతాయి. షాంపూతో శుభ్రం చేసుకొన్న తర్వాత పాదాలకు మాయిశ్చరైజర్ లేదా నూనెను రాయడం మర్చిపోకండి.
3. ప్రతిరోజూ స్నానం చేసినప్పుడు ప్యూమిస్ స్టోన్ తో కాలి మడమలను రుద్దితే పగుళ్లు సులభంగా పోగొట్టవచ్చు.
4. పాదాల పగుళ్లకు పొడి చర్మం కూడా ఒక ప్రధాన కారణమే. కాబట్టి పాదాల చర్మం ఎప్పుడూ తడిగా ఉండేట్లు చూసుకోవాలి. అందుకోసం ప్రతి రోజూ నిద్రకు ఉపక్రమించే ముందు తప్పనిసరిగా మాయిశ్చరైజలర్ రాయాలి.
5. పాదాల పగుళ్లకు తేనె కూడా బాగా పనిచేస్తుంది. కొదిగా గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల తేనె, మరికొన్ని చుక్కల నిమ్మరసం కలిపి అందులో పాదాలను 10-15నిమిషాల పాటు నాననిచ్చి తర్వాత మంచినీళ్లతో శుభ్రం చేసుకోవాలి. తర్వాత పొడి వస్త్రంతో శుభ్రం చేసి మాయిశ్చరైజర్ లేదా ఆలివ్ ఆయిల్ రాయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే పాదాల పగుళ్లు పోయి కోమలమౌనటువంటి పాదాలు మీ సొంతం అవుతాయి.
6. గోరువెచ్చని నీళ్లలో బేకింగ్ సోడా రెంచు చెంచాలు వేసి అందులో పాదాలు నాన్చి శుభ్రం చేస్తే మృతకణాలు తొలగిపోయి. పాదాలు సున్నితంగా తయారవుతాయి. ఇది ఒకరకంగా సహజసిద్దమైనటువంటి ఔషదంలా పనిచేసి కాలుకి ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే పాదాలు మృదువుగా తయారవుతాయి.

Story first published: Friday, May 25, 2012, 16:53 [IST]
Desktop Bottom Promotion