పాలు-కుంకుమ పువ్వు ఫేస్ ప్యాక్ తో చర్మం నిగనిగ..!

Milk and Saffron Face Pack for Glowing Skin...!
సుగంధ ద్రవ్వాల్లో కుంకుమ పువ్వు ప్రత్యేకతే వేరు. కుంకుమ పువ్వును ఇంగ్లీషులో శాఫ్రాన్‌ ఫ్రాన్‌ అంటారు. ఇది జాఫరాన్‌ అనే అరబిక్‌ పదం నుంచి వచ్చింది. అరబిక్‌లో జాఫరిన్‌ అంటే పసుపు అని అర్థం. కుంకుమ పువ్వు అందించే మొక్కలను ప్రత్యేకంగా పెంచుతారు. పువ్వు మధ్య ఉండే రేణువులను తీసి కుంకుమ పువ్వు తయారు చేస్తారు. ఒక కిలో కుంకుమపువ్వు తయారు చేయాలంటే కనీసం రెండులక్షల పూలు అవసరమవుతాయి. అందుకే వీటి ధర చాలా అధికంగా ఉంటుంది. కుంకుమ పువ్వు రుచికి కొద్దిగా చేదుగా, తియ్యగా వుంటుంది. ఇది పదార్థాలకు అదనపు రుచి, రంగునివ్వడమే కాదు. మేని మెరుపునీ ద్విగుణీకతం చేస్తుంది.

కుంకుమపువ్వు సౌందర్యానికి, ఆరోగ్యానికీ కూడా ఉపయోగిస్తుంది. కుంకుమపువ్వు చర్మపు వర్చస్సును, కాంతిని పెంచుతుంది. చర్మానికి మంచి రంగును కలిగించి, చర్మపు సౌందర్యానికి తోడ్పడుతుంది. కుంకుమ పువ్వు రంగు పదార్ధంగాను, సువాసనకారిగాను అనేక తినుబండారాలు, తాంబూలంలోనూ వాడతారు. గర్భిణీ స్త్రీలు ప్రతిదినం కొద్దిగా కుంకుమ పువ్వును,పటిక పంచదార కలిపిన ఆవుపాలతో తీసుకుంటే పుట్టబోయే పిల్లలు మంచి తేజస్సుతో పుడతారని చాలా మంది భావన.

చెంచా గంధం పొడిలో రెండు మూడే కుంకుమ పువ్వు రేకలు, కాసిన్ని పాలు, చేర్చి ముఖానికి పూత వేయాలి. అరగంటయ్యాక చల్లని నీటితో కడిగేసుకోవాలి. తరచూ ఇలా చేస్తే చర్మం మెరిసిపోతుంది. మొటిమల తాలూకు మచ్చలతో బాధపడేవారు రెండు రేకలను నలిపి ఆ పొడిలో చెంచా తేనె కలిపి పక్కన పెట్టాలి. కొద్దిసేపయ్యాక దానిలో రెండు చెంచాల పెరుగును చేర్చి ముఖానికి రాసుకొని అరగంట తర్వాత కడిగేస్తే క్రమంగా మచ్చలు మాయమవుతాయి.

పాలల్లో కుంకుమ పువ్వుని నానబెట్టి అరగంట తర్వాత ముఖం, మెడ, చేతులకు రాసుకోవాలి. చర్మం తడారిపోయాక గోరువెచ్చని నీళ్లతో శుభ్రపరుచుకోవాలి. వారంలో రెండు మూడు సార్లు ఇలా చేయడం వల్ల మేని కళ మెరుగవుతుంది. కుంకుమ పువ్వు గంధంలా తయారుచేసి మొహానికి రాస్తే మొటిమలు తగ్గి, చర్మం సున్నితంగా ఆకర్షణీయంగా తయారవుతుంది.

అలానే పాలమీగడలో రెండు రేకలు, చిటికెడు పసుపు వేసి ముఖానికి పట్టించి చల్లటినీళ్లతో కడిగేసుకొంటే మృత చర్మం తొలగిపోతుంది. ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన చర్మతత్వం. ఏ రకమైన చర్మతత్వానికైనా కానీ తగిన పోషణ అందించి కాంతిమంతంగా చేయడానికి కుంకుమ పువ్వు తోడ్పడుతుంది. ముంుద రోజు రాత్రి మూడు రేకల్ని నీటిలో నానబెట్టుకోవాలి. మరుసటి రోజుకి ఆ నీళ్లు రంగు మారతాయి. అందులో చెంచా చొప్పున పాలు, పంచదార, రెండు చుక్కల ఆలివ్ నూనె కలుపుకొని ఒంటికి రాసుకోవాలి. అరగంటయ్యాక సబ్బుతో రుద్దకుండా చన్నీటితో స్నానం చేస్తే చర్మం తాజాగా కనిపిస్తూ వన్నెలీనుతుంది.

Story first published: Saturday, June 30, 2012, 12:55 [IST]
Desktop Bottom Promotion