రోజుకు ఎన్ని పండ్లు తినాలి? డాక్టర్ చెబుతున్న చేదు నిజాలివే!

రోజుకో ఆపిల్ తింటే డాక్టర్‌తో పనుండదు అనేది మనం చిన్నప్పటి నుండి వింటున్న నానుడి. పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలుసు. కానీ, కేవలం రోజుకు ఒక ఆపిల్ మాత్రమే తింటే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుందా? అంటే కాదు అంటున్నారు హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్ కు చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్. ఆరోగ్యకరమైన జీవక్రియను కాపాడుకోవాలంటే మనం తీసుకునే పండ్ల మోతాదు ఇంకా ఎక్కువగా ఉండాలని ఆయన స్పష్టం చేస్తున్నారు.

An Apple a Day Is Not Enough Hyderabad Neurologist Reveals How Many Fruits You Actually Need

ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఎక్స్ వేదికగా డాక్టర్ సుధీర్ కుమార్ స్పందిస్తూ.. పండ్ల వినియోగం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. చాలామంది పండ్లను కేవలం ఒక ఆప్షనల్ స్నాక్ లాగా మాత్రమే చూస్తారు. కానీ మెడికల్ సైన్స్ ప్రకారం పండ్లు ఒక ముఖ్యమైన ఔషధం లాంటివి. మీ ఆరోగ్యాన్ని అత్యున్నత స్థాయిలో ఉంచుకోవాలనుకుంటే, పండ్లను ఎంత మోతాదులో తినాలో కచ్చితంగా తెలుసుకోవాలి అని ఆయన అన్నారు.

రోజుకు ఎన్ని పండ్లు తినడం సరైనది?
డాక్టర్ సుధీర్ కుమార్ ప్రకారం, ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతిరోజూ రెండు నుండి మూడు సర్వింగ్స్ పండ్లు తీసుకోవడం అత్యుత్తమం. ఒక సర్వింగ్ అంటే.. మీడియం సైజ్ లో ఉండే ఒక ఆపిల్, లేదా ఒక అరటిపండు, లేదా అరకప్పు బెర్రీలు అని అర్థం. ఈ లెక్కన రోజుకు కనీసం రెండు లేదా మూడు పండ్లను మన డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

అయితే పండ్లు మంచివి కదా అని పరిమితికి మించి తినకూడదు. రోజుకు గరిష్టంగా నాలుగు నుండి ఐదు సర్వింగ్స్ వరకు మాత్రమే పండ్లను తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ పండ్లు తినడం వల్ల అదనపు ఆరోగ్య ప్రయోజనాలు పెద్దగా ఉండవని డాక్టర్ కుమార్ వివరిస్తున్నారు. ఆ తర్వాత పండ్లకు బదులుగా, మన ఆహారంలో మరిన్ని కూరగాయలను చేర్చుకోవడం ఎంతో ఉత్తమమైన మార్గం.

రోజువారీ ఆహారంలో పండ్లను చేర్చుకోవడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు

చెడు కొలెస్ట్రాల్‌కు చెక్: పండ్లలో ఉండే పీచు పదార్థం (ఫైబర్) మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుంది.

బీపీ నియంత్రణ: పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచడానికి అద్భుతంగా సహాయపడుతుంది.

గుండెకు రక్షక కవచం: పండ్లలో ఉండే ఫ్లేవనాయిడ్లు అనే యాంటీ ఆక్సిడెంట్లు.. పక్షవాతం (స్ట్రోక్), గుండె సంబంధిత వ్యాధుల ముప్పును 10-15 శాతం వరకు తగ్గిస్తాయి.

An Apple a Day Is Not Enough Hyderabad Neurologist Reveals How Many Fruits You Actually Need

పండ్లు తినకపోతే పొంచి ఉన్న ముప్పు ఇదే
కేవలం పండ్ల ప్రయోజనాలనే కాకుండా, వాటిని తినకపోవడం వల్ల వచ్చే నష్టాలను కూడా డాక్టర్ కుమార్ నొక్కి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మనుషుల మరణాలకు దారితీస్తున్న ప్రధాన ఆహార లోపాలలో.. పండ్లను తక్కువగా తీసుకోవడం కూడా ఒక ముఖ్య కారణం అని ఆయన హెచ్చరించారు. పండ్లు తినకపోవడం వల్ల దీర్ఘకాలిక వాపు, పేగుల ఆరోగ్యం దెబ్బతినడం, టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తీవ్రంగా పెరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

షుగర్ అపోహలు - వాస్తవాలు

చాలామంది మధుమేహం వస్తుందనే భయంతో తీపిగా ఉండే పండ్లకు దూరంగా ఉంటారు. కానీ డాక్టర్ కుమార్ ఈ అపోహను కొట్టిపారేశారు. బేకరీ స్నాక్స్ లేదా ప్రాసెస్ చేసిన ఆహారంలో ఉండే కృత్రిమ చక్కెరకు, పండ్లలో సహజంగా లభించే చక్కెరకు చాలా తేడా ఉంటుంది. పండ్లలోని చక్కెరకు ఫైబర్ తోడై ఉంటుంది. ఈ ఫైబర్.. ఫ్రక్టోజ్ శరీరంలోకి వేగంగా శోషించుకోబడకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల రక్తంలో ఇన్సులిన్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు. కాబట్టి మీకు ప్రత్యేకమైన వైద్యపరమైన సమస్యలు ఏమీ లేకపోతే, పండ్లలోని సహజ చక్కెర మీకు మంచి మిత్రుడే కానీ, శత్రువు ఎంతమాత్రం కాదు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Monday, June 29, 2026, 14:17 [IST]
Desktop Bottom Promotion