షుగర్ రోగులలో రక్తపోటు నియంత్రణ అవసరమా?

By B N Sharma

Controlling Blood Pressure in Diabetics
మధ్యవయసులో వున్న పెద్దలు టైప్ 2 డయాబెటీస్, రక్తపోటు రెండూ కలిగి వుంటే ముందుగా వారు రక్తపోటు మందులు వాడకుండా సహజ ఆహారాల ద్వారా ఎలా నియంత్రించుకోవాలనేది తెలుసుకోవాలి. అయితే, సహజ ఆహారాల ద్వారా తగ్గాలంటూ అధిక కాలం రక్తపోటుతో కూడా బాధపడరాదని ఒక తాజా స్టడీ సూచిస్తోంది. డయాబెటీస్ రోగులు తమ రక్తపోటును నియంత్రించటంలో ఒక సంవత్సరంపాటు ఆలస్యం చేస్తే వారి జీవితకాలం రెండు రోజులపాటు తగ్గిపోతుందని చికాగో యూనివర్శిటీ రీసెర్చర్లు జనరల్ ఇంటర్నల్ మెడిసిన్ అనే జర్నల్ లో ప్రచురించారు.

డయాబెటిక్ రోగులలో రక్తపోటు గుండెజబ్బులు తెస్తుందని, కరోనరీ ఆర్టరీ వ్యాధులు, కిడ్నీ విఫలత, చూపు మందగించటం, అవయవాలు తొలగింపు మొదలగు సమస్యలను కూడా తెస్తుందని అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ మరియు నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంస్ధలు హెచ్చరిస్తున్నాయి. డయాబెటిక్ రోగులు వారి రక్తపోటును 130/80 ఎంఎం హెచ్జి వుండేలా మెయిన్టెయిన్ చేయాలని సూచిస్తున్నాయి. వీరు రక్తపోటుకై మందులు, డయాబెటీస్ మందులతో కూడా కలిపి వాడే కంటే కూడా వ్యాయామం, ఆహార నియంత్రణలద్వారా వాటిని నియంత్రించాలని అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ తెలిపింది.

అధిక రక్తపోటు సాధారణంగా పెద్ద వయసువారికి వుండటం సహజం. కానీ ఇప్పుడిది వయసుతో నిమిత్తం లేకుండా యువతలోనూ వస్తోంది. రక్తపోటు ఎందువలన వస్తుంది? దానికి కారణాలు ఏమిటి? పరిస్థితుల ప్రభావం ఏ విధంగా వుంటుంది? దీనిని నివారించేందుకు మార్గాలేమైనా వున్నాయా? అని ప్రశ్నించుకుంటే సమాధానం లేకపోలేదు. ముఖ్యంగా 15 సంవత్సరాలుగల పిల్లల విషయానికి వస్తే వారికి ఉదయం 8 గంటల నుంచి స్కూల్, కాలేజ్, సంగీతం, కంప్యూటర్ క్లాసులు ఇలా ఏ మాత్రం విశ్రాంతి లేకుండా వుంటున్నారు. ఇక ఉద్యోగాలు చేస్తున్నవారి సంగతి సరేసరి. ఇంట్లో బరువు బాధ్యతలు, ఆఫీసుల్లో ఒత్తిడులు- ఇవన్నీ కలిపి ఆరోగ్యాన్ని పాడుచేస్తాయనటంలో సందేహం లేదు. వీటన్నింటికీ తోడు సరియైన సమయంలో భోజనం చేయక చిరుతిండికి అలవాటుపడతారు.

మానసిక ఒత్తిడి అనేది దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. ఆహారం విషయానికి వస్తే కొంతమంది సమయానికి భోజనం చేయకుండా అందుబాటులో వున్నవన్నీ తింటూ వుంటారు. అధిక రక్తపోటుతోపాటుగా కొంతమందికి డయాబెటీస్ హైకొలెస్ట్రాల్ వంటివి రావడం జరుగుతుందని, 40 శాతం వరకూ రక్తపోటు ద్వారా డయాబెటీస్ కూడా వస్తున్నట్టు, ఒక్కోసారి ఇవి మెదడుకు సంబంధించి బ్రెయిన్ స్ట్రోక్‌గా కూడా మారి ప్రాణహాని కలుగవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

కేవలం 10 శాతం రక్తపోటు మూత్రపిండాల సమస్యతో బాధపడేవారికి వచ్చే అవకాశం వుందని మిగిలిన 90శాతం మందికి మాత్రం వారి జీవన విధానాల మార్పులవల్ల సంక్రమించవచ్చని వైద్య పరిశోధకులు చెపుతున్నారు. రక్తపోటు నివారణకు సంబంధించి ఒక విధంగా మందులను కూడా తీసుకుంటారు కాని వీటివలన ఇతర నష్టాలు వుండటంవల్ల అంతగా వాడటం లేదు. కనుక రక్తపోటు రాకుండా ముందే జాగ్రత్తపడితే మంచిది. దీని నివారణకై కొన్ని ఆహార నియమాలు పాటించాలి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Saturday, July 21, 2012, 15:03 [IST]
Desktop Bottom Promotion