ప్రతి మహిళ ఏడాదికోసారి ఖచ్చితంగా చేయించుకోవాల్సిన పరీక్షలు ఇవే.. లేదంటే.?

మహిళల ఆరోగ్యం ఒక్కో దశలో వివిధ మార్పులకు లోనవుతుంది. రుతుస్రావం, గర్భం దాల్చడం, వృద్ధాప్యం ఇలా ప్రతి దశలోనూ శారీరకంగా, మానసికంగా కొన్ని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ఏడాదికోసారైనా మహిళలు తప్పకుండా కొన్ని పరీక్షలు చేయించుకోవాలని గైనకాలజిస్టు నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

Every woman should definitely undergo these medical tests once a year

మహిళల్లో హార్మోన్ల మార్పులు, పోషకాహార అవసరాల కారణంగా కొన్ని సమస్యల లక్షణాలు ఆరంభంలో కనిపించవు. ఈ క్రమంలో వ్యాధి నిర్ధారణ ఆలస్యమై వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అందుకే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు, నిర్దిష్ట వ్యవధిలో రక్త పరీక్షలు ప్రయోజనకరంగా ఉంటుందని గైనకాలజిస్ట్‌ నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో సీబీసీ(సమగ్ర రక్త పరీక్ష), బ్లడ్ షుగర్ టెస్ట్‌, లిపిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ ప్రొఫైల్, విటమిన్ డి, విటమిన్ బి12 వంటి ప్రాథమిక పరీక్షలు తప్పనిసరి.

సీబీసీ టెస్ట్‌ ద్వారా రక్త హీనతతో పాటు సంబంధిత సమస్యలను గుర్తిస్తుంది. షుగర్‌ టెస్ట్‌తో మధుమేహం స్థాయిలను నిర్ధారించుకోవచ్చు. ఇక లిపిడ్‌ ప్రొఫైల్‌ టెస్ట్‌ గుండె జబ్బుల ప్రమాదాన్ని అంచనా వేస్తుంది. థైరాయిడ్‌, విటమిన్ పరీక్షలతో శరీరంలో సాధారణ సమస్యలను గుర్తించవచ్చు. ఇవన్నీ ప్రైమరీ టెస్టులు కాగా.. మహిళ వయసు, కుటుంబ ఆరోగ్య చరిత్ర దృష్టిలో ఉంచుకున్ని మరికొన్ని పరీక్షలను సిఫార్సు చేసే అవకాశం ఉంది.

మహిళల్లో ముఖ్యంగా ఇంటి పనులు, పిల్లల పెంపకం, వృత్తి బాధ్యతలు ఇలా మల్టీ టాస్కింగ్‌ కారణంగా పలు ప్రాబ్లమ్స్‌ వస్తాయి. ఎక్కువగా అలసట, నీరసం, తల తిరగడం, శరీర బరువులో అకస్మాత్తుగా హెచ్చుతగ్గులు, జుట్టు రాలిపోవడం, తరచుగా అనారోగ్యానికి గురి కావడం, నెలసరిలో తేడాలు వంటి సమస్యలు తలెత్తినప్పుడు రక్త పరీక్షలు చేయించుకోవడంలో ఆలస్యం చేయవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మరికొన్ని సందర్భాల్లో అధికంగా దాహం వేయడం, తరచుగా మూత్రానికి వెళ్లాల్సి రావడం, హార్ట్‌ బీట్‌లో హెచ్చుతగ్గులు, వంటి మార్పులను కూడా అనారోగ్యానికి సంకేతంగా పరిగణించాలి. ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ఖచ్చితంగా గైనకాలజిస్టును సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.

మెరుగైన ఆరోగ్యం కోసం ఇవి తప్పనిసరి

మహిళలు రోజువారీ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యంపై దృష్టి సారించాలి. క్రమం తప్పకుండా సమతుల్య ఆహారం తీసుకోవాలి. భోజనంలో పండ్లు, కూరగాయలు, ప్రొటీన్‌, అవసరమైన పోషకాలను చేర్చుకోవాలి. తగినంత నీరు, రోజూ ఉదయాన్నే వ్యాయామం చేయడం, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం, సరైన నిద్ర వేళలు పాటించడం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇవన్నీ పాటిస్తూనే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని గైనకాలజిస్టుల సలహా.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Friday, June 5, 2026, 17:56 [IST]
Desktop Bottom Promotion