మహిళలకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఏ వయస్సులో ఎక్కువ ఉంటుందో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా చాలామంది గుండెపోటుతో మరణిస్తున్నారు. కొంతమంది అయితే మొదటిసారి గుండెపోటు రావడంతోనే చనిపోతున్నారు. ధమనుల్లో కొవ్వు పేరుకుపోయి గుండెకు రక్తప్రవాహం తగ్గిపోయి గుండెపోటు వస్తుంది. అయితే ఈ పరిస్థితిని పూర్తిగా నయం చేయలేకపోయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యల ద్వారా నియంత్రించవచ్చు. అయితే గుండెపోటు గురించి తాజాగా ఓ షాకింగ్ విషయం బయటికొచ్చింది. మెనోపాజ్ తర్వాత మహిళలకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట.

సాధారణంగా లైఫ్ స్టైల్ లో మార్పులు, స్మోకింగ్, ఆహారం విషయంలో అశ్రద్ద వంటి కారణాలు గుండె పోటు ముప్పుని పెంచుతాయని మనందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రమాద కారకాలు మగవాళ్ల కంటే ఆడవాళ్ల గుండె ఆరోగ్యంపైనే మరింత తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఓ అధ్యయనంలో తేలింది. చికాగోలో జరిగిన అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ వార్షిక సమావేశంలో బయటపెట్టిన కొత్త పరిశోధనలు షాకింగ్ ఫలితాలను బయటపెట్టాయి.

Heart health gender divide in heart attacks menopause changes everything

దాదాపు 11 ఏళ్ల పాటు.. 1 లక్షా 75వేల మంది పెద్దలపై పరిశోధకులు అధ్యయనం చేశారు..ఇందులో 60శాతం మంది మహిళలే ఉన్నారు. అధ్యయనం ప్రారంభం అయ్యే సమాయానికి ఎవ్వరికీ ఏ విధమైన గుండె జబ్బులు లేవు. పరిశోధకులు వారి బాడీ మాస్ ఇండెక్స్ (BMI), రక్తపోటు, స్మోకింగ్ అలవాటు, ఫుడ్, శారీరక శ్రమ, నిద్ర, రక్తంలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్ స్థాయిలు వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. పురుషులతో పోలిస్తే మహిళలు సరైన స్థాయిలో ఆహారం తీసుకునే విషయంలోనూ, రక్తంలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్, రక్తపోటు అదుపులో ఉంచుకునే విషయంలోనూ ముందున్నారు. కానీ శారీరక శ్రమ చేసే విషయంలో మాత్రం కొంచెం వెనుకబడ్డారు. అంటే మహిళలు కొన్ని గుండె సంబంధిత ప్రమాద కారకాలను నియంత్రణలో ఉంచుకున్నప్పటికీ, తగినంత వ్యాయామం చేయకపోవడం వారిని ప్రమాదంలోకి నెట్టేస్తోంది. మంచి ఆరోగ్య కొలమానాలు ఉన్నప్పటికీ ఎక్కువ ప్రమాద కారకాలు ఉన్న మహిళలు, అలాంటి ప్రమాద కారకాలే ఉన్న పురుషులతో పోలిస్తే గుండె సంబంధిత తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం గణనీయంగా ఎక్కువగా ఎదుర్కొంటున్నారని తేలింది.

డయాబెటిస్, రక్తపోటు వంటి కొన్ని ప్రమాద కారకాల వల్ల మహిళలు పురుషుల కంటే ఎక్కువ ప్రతికూల ప్రభావాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. దీనివల్ల వారిలో మరణాల రేటు పెరగడానికి, గుండె ఆరోగ్యం క్షీణించడానికి దారితీస్తుంది. అంతేకాకుండా రుతువిరతి అంటే పీరియడ్స్ ముగిసే సమయంలో, గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలు, మానసిక ఒత్తిళ్లు కూడా మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. రుతువిరతి తర్వాత అంటే సుమారు 55 సంవత్సరాల వయస్సులో మహిళలకు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చికాగో హార్ట్ అండ్ వాస్కులర్ స్పెషలిస్ట్‌లలో కార్డియాలజిస్ట్ డాక్టర్ రోహిత్ అన్నారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Wednesday, April 9, 2025, 21:19 [IST]
Desktop Bottom Promotion