దగ్గు సిరప్‌ లపై సంచలన హెచ్చరిక..పిల్లలకు తాపితే మరణం!

రాజస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పెద్దలకు వాడే దగ్గు సిరప్ తాగి 11మంచి చిన్నారులు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషాద సంఘటనలు దేశవ్యాప్తంగా తల్లిదండ్రులను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఇదే సమయంలో కేంద్రప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. డైరక్టరేట్ జనరల్ హెల్త్ సర్వీసెస్(DGHS)అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇకమీదట 2 సంవత్సరాల వయస్సు లోపు చిన్నారులకు ఎట్టి పరిస్ధితుల్లోనూ దగ్గు, జలుబు మందులు(కాంబినేషన్ డ్రగ్స్)ఇవ్వకూడదని DGHS సూచించింది.

అవి కలిపారా?
మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో చిన్నారుల మరణానికి ముందు తీవ్రమైన కిడ్నీ సమస్యలు,యూరిన్ ఆగిపోవడం వంటి లక్షణాలు కనిపించాయి. వీరందరూ దగ్గు,జలుబు కోసం సిరప్ వాడినట్లు గుర్తించడంతో అందులోని నాణ్యతపై సందేహాలు తలెత్తాయి. గతంలో గాంబియా,ఉజ్బెకిస్తాన్ దేశాల్లో చిన్నారుల మరణానికి కారణమైన డైథిలిన్ గ్లైకాల్(DEG),ఇథిలిన్ గ్లైకాల్(EG)వంటి ప్రమాదకర రసాయనాలు ఈ సిరప్ లలో కలిసి ఉండవచ్చేమోనన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

No Cough Syrup for Infants Govt s Strict New Guidelines for Pediatric Dosing

అయితే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వంటి ఉన్నతస్థాయి బృందాలు దగ్గు సిరప్ శాంపిల్స్ సేకరించి ఇప్పటిదాకా జరిపిన పరీక్షల్లో DEG, EG వంటి విష రసాయనాలు కలవలేదని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అయితే చిన్నారుల మరణాలకు ఖచ్చితమైన కారణాలను కనుగొనేందుకు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.

కేంద్రం జారీ చేసిన కొత్త గైడ్ లైన్స్ ఇవే

2 సంవత్సరాల లోపు పిల్లలకు: దగ్గు, జలుబు నివారణకు వాడే కాంబినేషన్ మందులను అస్సలు ఇవ్వకూడదు.

5 సంవత్సరాల లోపు పిల్లలకు: 5 ఏళ్ల లోపు పిల్లలకు కూడా ఈ మందులు ఇవ్వకూడని సూచిస్తున్నారు.

5 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఇవ్వాల్సి వస్తే రిజిస్టర్డ్ డాక్టర్ పర్యవేక్షణలో సరైన మోతాదులో అతి తక్కువ సమయం పాటు ఇవ్వాలని సూచించింది. తగినంత హైడ్రేషన్, విశ్రాంతి, సహాయక సంరక్షణ వంటి గృహ, ఔషదేతర చర్యలకు పిల్లల సంరక్షణలో ప్రాధాన్యత ఇవ్వాలని కొత్త గైడ్ లైన్స్ లో చెప్పారు. ఈ హెచ్చరికలను వీలైనంత ఎక్కువ మంది ప్రజలకు చేరేలా విస్తృత ప్రచారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది.

పేరెంట్స్ కు కీలక సూచనలు
డాక్టర్లు కూడా తల్లిదండ్రులకు పలు ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు. పిల్లలలో చాలావరకు దగ్గు, జలుబు అనేవి సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల వస్తాయి. ఇవి కొద్ది రోజుల్లో వాటంతట అవే తగ్గిపోతాయి. అనవసరంగా మందులు వాడటం వల్ల ప్రయోజనం కంటే ప్రమాదమే ఎక్కువగా ఉంటుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు జలుబు, దగ్గు వస్తే సొంతంగా మందుల షాపుకెళ్లి సిరప్‌ లు కొనవద్దుని సూచిస్తున్నారు.

ఇదే సమయంలో ఇంట్లో నిల్వ ఉంచిన పాత మందులను పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదని సూచించారు. లక్షణాలు మూడు రోజుల కంటే ఎక్కువగా ఉన్నా, బిడ్డకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నా, లేదా జ్వరం తీవ్రంగా ఉన్నా వెంటనే డాక్టర్ ని సంప్రదించాలని సూచిస్తున్నారు. పిల్లల ఆరోగ్యం విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ చేయకూడదని సూచించారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Saturday, October 4, 2025, 14:50 [IST]
Desktop Bottom Promotion