Balagam Mogilaiah: షాకింగ్..బలగం నటుడు మొగిలయ్య కన్నుమూత

తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తీసిన బలగం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో పాత్రలు నటిస్తున్నట్లు కాకుండా జీవిస్తున్నట్లు ఉండటంతో అందరూ ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు. సినిమా వచ్చి ఏడాదైనా ఈ మూవీలోని పాత్రలు ఇంకా మనకళ్ల ముందే ఉన్నట్లు అనిపిస్తుంటాయి. అంతలా ఈ సినిమా కనెక్ట్ అయింది పబ్లిక్ కి. అయితే బలగం సినిమాలో తన గాత్రంతో ప్రేక్షకులను కంటతడి పెట్టించిన మొగిలయ్య(balagam mogilaiah) కన్నుమూశారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నమొగిలయ్య గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు.

రెండు కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోవడంతో మొగిలయ్య అనారోగ్యానికి గురయ్యారు. వారానికి రెండు సార్లు డయాలసిస్ చేస్తున్న క్రమంలో ఆయనకు గుండె సంబంధిత సమస్యలు తలెత్తినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం వరంగల్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో మొగిలయ్యని చేర్పించారు కుటుంబసభ్యులు. హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఆరోగ్యం విషమించడంతో మొగిలయ్య గురువారం వేకువజామున మరణించారు.

balagam movie actor mogilaiah died

మొగిలయ్య వైద్య ఖర్చులు బలగం సినిమా డైరెక్టర్ వేణు,చిత్ర యూనిట్ తో పాటు ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం అందించింది. మెగాస్టార్ చిరంజీవి సైతం ఆయనకు ఆర్థిక సాయం చేశారు. మొగిలయ్య మరణం పట్ల బలగం సినిమా డైరెక్టర్ వేణు, నటీనటులు,టాలీవుడ్ ప్రముఖలు సంతాపం ప్రకటించారు.

బలగం సినిమా మెుత్తం ఒకెత్తయితే.. క్లైమాక్స్‌లో మానవ సంబంధాల విలువను వివరిస్తూ మొగిలయ్య దంపతులు పాడే పాట మరో ఎత్తు. 'తోడుగా మా తోడుండి.. నీడగా మాతో నడిచి.. నువ్వెక్కాడెల్లినావు కొమురయ్యా' అంటూ మొగిలయ్య దంపతులు పాడే పాట మూవీ చూసిన ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తుంది.

Desktop Bottom Promotion