ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించిన ఈ ఆశక్తికర విషయాలు మీకు తెలుసా?

ఛత్రపతి శివాజీ మహారాజ్.. ఈ పేరు వినగానే ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగుతుంది. మరాఠా వీధుల నుంచి దేశంలోని నలుమూలల వరకు ఆయన పేరు ఒక ప్రభంజనంలా వినిపిస్తుంది. కేవలం కత్తి పట్టి యుద్ధం చేయడమే కాదు అంతకు మించిన వ్యూహం, పాలనా దక్షతతో మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ధీరుడు ఆయన.

నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా వాయువుల వెనుక, ఆనాడు ఆయన వేసిన హిందవీ స్వరాజ్య పునాదులు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఏటా ఫిబ్రవరి 19న మనం జరుపుకునే శివాజీ జయంతి కేవలం ఒక రాజు పుట్టినరోజు వేడుక మాత్రమే కాదు, అది ఆత్మగౌరవానికి, పోరాట పటిమకు ప్రతీక.

Chhatrapati Shivaji Maharaj Jayanti 2026 Intresting Facts About Shivaji Maharaj

శివనేరి కోటలో ఉదయించిన సూర్యుడు
క్రీ.శ. 1630 ఫిబ్రవరి 19న పూణే జిల్లాలోని శివనేరి కోటలో మరాఠా సామ్రాజ్యానికి ఆశాజ్యోతి వెలిగింది. తండ్రి షాహాజీ భోంస్లే, తల్లి వీరనారి జీజాబాయి. తల్లి ఒడిలోనే రామాయణ, భారత గాథలను వింటూ, ధర్మాన్ని రక్షించడం క్షత్రియ ధర్మమని నేర్చుకుంటూ పెరిగారు శివాజీ.

పరాయి పాలనలో మగ్గిపోతున్న ప్రజలను చూసి ఆయన రక్తం మరిగిపోయేది. ఆ ఆవేదనే ఆయనను ఒక సామాన్య బాలుడి నుండి మహా సామ్రాజ్య అధినేతగా మార్చింది.

యుక్తవయసులోనే అద్భుత విజయాలు
శివాజీ మహారాజ్ అంటేనే అలుపెరుగని పోరాటం. ఆయన కేవలం ఒక సభికుడి కుమారుడిగా మిగిలిపోలేదు. తన ఆలోచనలకు పదును పెట్టి, స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా అడుగులు వేశారు. 1645లో, అంటే కేవలం 15 ఏళ్ల వయసులోనే టోర్నా కోటను జయించి తన జైత్రయాత్రను ప్రారంభించారు.

ఆ వయసులో అంతటి సాహసం చేయడం ఎవరి ఊహకూ అందని విషయం. బీజాపూర్ సుల్తాన్ ఆదిల్‌ షా నుండి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు వరకు అందరూ శివాజీ వ్యూహాలకు తలలు పట్టుకునేవారు. క్రూరమైన మొఘలులను ఎదుర్కోవడానికి మరాఠా యోధులను ఏకం చేసి, బలమైన సైన్యాన్ని నిర్మించిన ఘనత ఆయనదే.

గెరిల్లా యుద్ధ తంత్రం, నౌకాదళం
శివాజీ మహారాజ్ గొప్పతనం ఆయన యుద్ధ నీతిలో ఉంది. కొండలు, కోనలు అటవీ ప్రాంతాలే ఆయుధంగా మలుచుకుని గెరిల్లా యుద్ధ తంత్రంతో శత్రువులను ముప్పతిప్పలు పెట్టారు. భారీ సైన్యం ఉన్నా సరే శివాజీ ముందు మోకరిల్లాల్సిందే.

అంతటితో ఆగకుండా సముద్ర మార్గం ద్వారా వచ్చే ముప్పును ముందే పసిగట్టిన దార్శనికుడు ఆయన. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పటిష్టమైన మరాఠా నౌకాదళాన్ని ఏర్పాటు చేసి నేటికీ ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ (భారత నౌకాదళ పితామహుడు)గా కీర్తింపబడుతున్నారు.

Chhatrapati Shivaji Maharaj Jayanti 2026 Intresting Facts About Shivaji Maharaj

భాష, సంస్కృతిపై మమకారం
శివాజీ కేవలం కత్తి పట్టడమే కాదు కలం పవర్ కూడా తెలిసినవారు. అప్పటి వరకు అధికారిక కార్యకలాపాల్లో ఉన్న పర్షియన్ భాషను పక్కన పెట్టి మరాఠీ, సంస్కృత భాషలను అధికారిక భాషలుగా మార్చారు. పరిపాలనలో ఎన్నో సంస్కరణలు తెచ్చారు.

స్త్రీలను గౌరవించడం, అన్ని మతాలను సమానంగా చూడటం, రైతుల సంక్షేమం కోసం పాటుపడటం ఆయన పాలనలోని గొప్పతనం. అందుకే ఆయన ప్రజల గుండెల్లో ఛత్రపతిగా నిలిచిపోయారు.

శివాజీ జయంతి - స్ఫూర్తి దినోత్సవం
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 19న శివాజీ జయంతిని మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున భారీ ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. శివాజీ జీవిత చరిత్రను, ఆయన సాహసాలను వర్ణించే నాటకాలను ప్రదర్శిస్తారు. యువతలో దేశభక్తిని, ధైర్యాన్ని నింపడానికి ఈ రోజు ఒక వేదికగా నిలుస్తుంది.

రాయ్‌ గఢ్ కోటలో జరిగే ఉత్సవాలు చూసి తీరాల్సిందే. ఏప్రిల్ 3, 1680న రాయ్‌ గఢ్ కోటలో శివాజీ మహారాజ్ తుదిశ్వాస విడిచారు. కానీ ఆయన రగిలించిన స్వరాజ్య కాంక్ష, ధైర్యం, త్యాగం భారతీయుల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి.

Story first published: Thursday, February 19, 2026, 12:03 [IST]
Desktop Bottom Promotion