2025 దసరా ఎప్పుడు? శుభ ఘడియలు, పూజా విధానం, చేయాల్సిన ముఖ్య పనులు

హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో దసరా ముఖ్యమైనది. దీనిని విజయదశమి అని కూడా పిలుస్తారు.దేశంలోని మిగతా రాష్ట్రాలతో పాటు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలంగాణలో పెద్ద ఎత్తున దసరా పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా పండుగ ఎప్పుడు రాబోతుంది? నవరాత్రి వేడుకలు ఎలా జరుపుకోవాలి? పూజా విధానం వంటి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.

2025 దసరా పండుగ ముఖ్య తేదీలు

ఈ ఏడాది దేవీ శరన్నవరాత్రులు ఎంతో శుభప్రదమైన రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ముఖ్యమైన తేదీలను ఇప్పుడు చూద్దాం.

శరన్నవరాత్రులు ప్రారంభం: 22 సెప్టెంబర్ 2025, సోమవారం.
నవరాత్రి చివరి రోజు (మహానవమి/దుర్గాష్టమి): 30 సెప్టెంబర్ 2025, మంగళవారం.
విజయదశమి (దసరా): 2 అక్టోబర్ 2025, గురువారం.

Dussehra celebrations 2025 navratri pooja vidhi and everything you need to know about the festival

నవరాత్రి పూజా విధానం, ప్రాముఖ్యత

దసరా పండుగలో మొదటి తొమ్మిది రోజులను నవరాత్రులు అంటారు. ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవి తొమ్మిది రూపాలను (శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి) అలంకరించి పూజిస్తారు.

నవరాత్రుల మొదటి రోజున పవిత్రమైన మట్టితో వేదికను ఏర్పాటు చేసి దానిపై కలశాన్ని స్థాపించి అమ్మవారిని ఆవాహన చేస్తారు. దీనినే ఘటస్థాపన అంటారు.

రోజువారీ పూజ: ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి, అమ్మవారికి పసుపు, కుంకుమ, పువ్వులు, పండ్లు,ఆ రోజు అలంకారానికి తగిన ప్రత్యేక నైవేద్యాలు సమర్పించాలి.

పారాయణం: ఈ తొమ్మిది రోజులు లలితా సహస్రనామం, దుర్గా సప్తశతి, దేవీ భాగవతం వంటి స్తోత్రాలను పఠించడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోయి, పాజిటివ్ ఎనర్జీ వెల్లివిరుస్తుంది.

ఉపవాసం: చాలా మంది భక్తులు నవరాత్రులలో ఉపవాస దీక్షను పాటిస్తారు. ఇది శారీరక, మానసిక శుద్ధికి సహాయపడుతుంది.

విజయదశమి..విజయానికి సంకేతం

పదవ రోజును విజయదశమి అంటారు. ఈ రోజుకు రెండు ముఖ్యమైన కథలు ప్రామాణికంగా ఉన్నాయి. ఒకటి..శ్రీరాముడు రావణాసురుడిని సంహరించి విజయం సాధించిన రోజు. మరొకటి..దుర్గాదేవి మహిషాసురుడిని వధించి లోకాలను కాపాడిన రోజు. అందుకే ఈ రోజును విజయానికి సంకేతంగా భావిస్తారు.

దసరా రోజు చేయాల్సిన ముఖ్యమైన పనులు

ఆయుధ పూజ: రైతులు తమ వ్యవసాయ పనిముట్లకు, కార్మికులు తమ యంత్రాలకు, విద్యార్థులు తమ పుస్తకాలకు పూజ చేసి, తమ వృత్తిలో విజయం చేకూరాలని ప్రార్థిస్తారు.

శమీ పూజ (జమ్మి చెట్టు పూజ): సాయంత్రం వేళలో జమ్మి చెట్టుకు పూజ చేసి దాని ఆకులను బంగారం (బంగారు పత్రి)గా భావించి పెద్దలకిచ్చి వారి ఆశీస్సులు తీసుకుంటారు. ఇది ఐక్యతకు, గౌరవానికి చిహ్నం. తెలంగాణలో ఇది కన్నులపండువగా ఉంటుంది.

కొత్త పనుల ప్రారంభం: విజయదశమి రోజు ఏ కొత్త పని ప్రారంభించినా విజయం తథ్యమని ప్రజలు బలంగా నమ్ముతారు.

Story first published: Wednesday, September 17, 2025, 13:05 [IST]
Desktop Bottom Promotion