నిత్యానంద స్వామి మరణంపై..కైలాస దేశం నుంచి సంచలన ప్రకటన విడుదల

భారత్ వదిలి పారిపోయిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి మరణించినట్లు జరుగుతున్న ప్రచారంపై నిత్యానంద తన సొంత దేశంగా ప్రకటించుకున్న కైలాస దేశం నుంచి క్లారిటీ వచ్చింది. నిత్యానంద మరణించాడని ఆయన సోదరి కుమారుడు సుందరేశ్వర్ ఓ వీడియో రిలీజ్ చేశాడంటూ తమిళ మీడియాలో మంగళవారం పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అటు సోషల్ మీడియాలో కూడా నిత్యానంద స్వామి చనిపోయినట్లు పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. అయితే దీనిపై తాజాగా నిత్యానందస్వామి ప్రతినిధుల నుంచి క్లారిటీ వచ్చేసింది.

హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి నిత్యానంద తన ప్రాణాలను త్యాగం చేసినట్టు చెబుతున్నట్టు కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే నిత్యానంద చనిపోయాడని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన ప్రకటించుకున్న కైలాస దేశం ఓ ప్రకటన విడుదల చేసింది. నిత్యానంద స్వామి చాలా యాక్టివ్ గా, సేఫ్ గా ఉన్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది. నిత్యానంద స్వామి జీవ సమాధి అయ్యి చనిపోయారని ఆయన మేనల్లుడు చెప్పినదాంట్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చేశారు. దురుద్దేశపూరితంగానే కొంద‌రు ఇలాంటి ప్రచారం చేస్తున్నార‌ని త‌న‌ ప్రకటనలో తెలిపింది.

Kailasa issues statement denying nithyananda swamy death

నిత్యానంద స్వామి బతికే ఉన్నాడని చెప్పేందుకు రుజువుగా మార్చి 30న ఆయ‌న ఉగాది వేడుకల్లో పాల్గొన్న ప్రత్యక్ష ప్రసార లింక్‌ను త‌న‌ ప్రకటనకు కైలాస దేశం జత చేసింది. దీంతో చనిపోయాడనుకుని శోకసంద్రంలో మునిగిపోయిన నిత్యానంద భక్తులకు తాజా ప్రకటన ఊరట కలిగించింది.

అయితే నిత్యానంద ఆరోగ్యంగానే బ్రతికి ఉన్నాడని చెబుతున్న ఆ ప్రకటనలో ప్రస్తుతం నిత్యానంద ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అనే వివరాలను మాత్రం చెప్పలేదు. ఏది ఏమైనప్పటికీ నిత్యానంద మరణ వార్త కేవలం పుకారు మాత్రమేనని తాజా పరిణామాలతో సృష్టమవుతోంది.

కిడ్నాప్, అత్యాచారం వంటి పలు ఆరోపణలు ఎదుర్కొంటూ 2019లో నిత్యానంద స్వామి దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. తర్వాత కొద్దిరోజులకే ఆయన తనకంటూ ఓ సొంతదేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించాడు. సౌత్ అమెరికాలోని ఈక్వెడార్ దేశం సమీపంలో ఓ ఐలాండ్ ని కొనుగలు చేసిన నిత్యానంద దానికి 'యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస' అని పేరు పెట్టారు. హిందువుల కోసం ఈ దేశం ఏర్పాటు చేశానని, ప్రత్యేక కరెన్సీ, పాస్‌పోర్ట్, జెండాను సృష్టించానని ప్రకటించాడు. తమిళనాడు ప్రజలు వచ్చి వ్యాపారం ప్రారంభించాలని నిత్యానంద ఆహ్వానించారు. ఐక్యరాజ్యసమితి ఇప్పటివరకు కైలాసను దేశంగా గుర్తించలేదు.

Story first published: Wednesday, April 2, 2025, 11:53 [IST]
Desktop Bottom Promotion