నేపాల్ ప్రస్తుత పరిస్థితిని ముందే చెప్పిన జ్యోతిష్యుడు..భారతదేశం,బీజేపీ గురించి ఏం చెప్పాడంటే..

ప్రస్తుతం మన పొరుగు దేశం నేపాల్ రాజకీయ సంక్షోభంతో అట్టుడుకుతోంది. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు, ముఖ్యంగా యువతరం వీధుల్లోకి వచ్చి తీవ్ర నిరసనలు తెలుపుతోంది. పరిస్థితి చేయిదాటిపోవడంతో ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేసి దుబాయ్ కి పారిపోయినట్లు సమాచారం. ఇక, మాజీ ప్రధాని సహా ప్రస్తుత మంత్రులు, ఇతర నేతలపై కూడా ఆందోళనకారులు భౌతిక దాడులకు దిగుతున్నారు. నేతల ఇళ్లకు నిప్పుబెడుతున్నారు. ఈ తీవ్ర ఉద్రిక్తతల మధ్య గతంలో ఒక జ్యోతిష్కుడు చెప్పిన మాటలు సోషల్ మీడియాలో తుఫానులా వ్యాపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

నిజమవుతున్న 2023 నాటి జోస్యం
ప్రశాంత్ కిని అనే జ్యోతిష్కుడు డిసెంబర్ 2023లో ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. నేపాల్‌ లో ప్రజాస్వామ్యం అంతిమ దశకు చేరుకుందని..2025 నాటికి నేపాల్ లో తిరిగి రాచరికం వస్తుంది అని ఆయన అందులో స్పష్టంగా తెలిపారు. ఇప్పుడు, నేపాల్ వీధులు నిరసనలతో దద్దరిల్లుతుండటం, ప్రధాని రాజీనామా చేయడం, రాచరికాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తుండటంతో, ఈ పాత పోస్ట్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. కొందరు దీనిని కేవలం యాదృచ్ఛికం అని కొట్టిపారేస్తుంటే మరికొందరు ఇది భవిష్యత్తుకు సంకేతమని బలంగా నమ్ముతున్నారు.

Nepal Political Crisis Astrologer s 2023 Prophecy Comes True

అవినీతి, సోషల్ మీడియాపై నిషేధం వంటి ప్రభుత్వ నిర్ణయాలపై ఆగ్రహంతో ఉన్న యువతరం ఖాట్మండు సహా అనేక నగరాల్లో భారీ ప్రదర్శనలు నిర్వహిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసి, రాచరికాన్ని తిరిగి తీసుకురావాలన్న వారి డిమాండ్ ప్రశాంత్ కిని జోస్యానికి మరింత బలం చేకూరుస్తోంది.

గురు గోరఖ్‌ నాథ్ చారిత్రక ప్రవచనం
ఈ చర్చకు ఒక చారిత్రక, ఆధ్యాత్మిక కోణం కూడా ఉంది. 18వ శతాబ్దంలో గురు గోరఖ్‌ నాథ్ నేపాల్‌ ను ఏకీకృతం చేసిన రాజు పృథ్వీనారాయణ్ షాను ఆశీర్వదిస్తూ..షా రాజవంశం పదకొండు తరాల పాటు నేపాల్‌ ను పాలిస్తుందని ప్రవచించారు. 2008లో నేపాల్ గణతంత్ర రాజ్యంగా మారడంతో ఈ ప్రవచనం ముగిసిందని చాలామంది భావించారు. అయితే 2001లో జరిగిన రాజకుటుంబ హత్యల తర్వాత, కోమాలో ఉన్న దీపేంద్ర షాను రాజుగా ప్రకటించారు. అతడే పదకొండవ తరం అని, దీంతో గోరఖ్‌నాథ్ వాక్కు ఫలించిందని కొందరి వాదన. కానీ దీపేంద్ర పాలన పూర్తిస్థాయి పాలన కాదని, కాబట్టి షా వంశం నుంచి మరొక తరం పాలన మిగిలే ఉందని ఇంకొందరు వాదిస్తున్నారు. ఈ వాదన ప్రస్తుత రాచరిక పునరుద్ధరణ డిమాండ్‌ కు ఊతమిస్తోంది.

భారత్‌ పైనా సంచలన వ్యాఖ్యలు
నేపాల్ గురించి చెప్పిన జోస్యం నిజమవుతున్న సూచనలు కనిపిస్తుండటంతో ప్రశాంత్ కిని ఇప్పుడు భారతదేశం గురించి చేసిన అంచనా ప్రకంపనలు సృష్టిస్తోంది. తన తాజా పోస్ట్‌లో తర్వాతి వంతు భారతదేశానిదే. 2039 నాటికి బీజేపీ అధికారం కోల్పోతుందని.. ఆ తర్వాత మన దేశంలో ఎన్నికలు ఉండవు ప్రజాస్వామ్యం అంతమైపోతుంది అని ప్రశాంత్ కిని తన ఎక్స్ పోస్టులో తెలిపారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Story first published: Thursday, September 11, 2025, 6:05 [IST]
Desktop Bottom Promotion