చైనాలో పిల్లల స్కూల్ బ్యాగ్ లో ఏముంటదో తెలుసా..షాకింగ్ వీడియో చూడండి

ఒకప్పుడు స్కూల్ లైఫ్ వేరు..ఇప్పుడు స్కూల్ కంప్లీట్ ఢిఫరెంట్. ఇప్పుడున్నమాదిరి అప్పటి స్కూల్ బ్యాగ్స్ లో డజన్ల కొద్దీ పుస్తకాలు ఉండేటివి కావు. ఇప్పటి జనరేషన్ కి స్కూల్ జీవితం అంటే బరువైన పుస్తకాల బ్యాగ్ లు. క్లాస్ బుక్స్, నోట్ బుక్స్, హోంవర్క్ బుక్స్ తో నిండిన బ్యాగులను రోజూ మోసుకెళ్లడం పిల్లలకు పెద్ద ప్రహసనం. అయితే పిల్లలు బరువుతో కూడిన బ్యాగులను మోస్తున్నారన్న ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలు వారంలో ఒక రోజుని నో బ్యాగ్ డే గా ప్రకటించాయి. దీంతో వారంలో ఒక్కరోజుైనా ఆ బరువుల బ్యాగ్ ని మోస బాధ విద్యార్థులకు తప్పుతుంది.

అయితే మనదేశంలోనే విద్యార్థులకు ఇలాంటి పరిస్థితి ఉందా? లేక ప్రపంచమంతా స్టూడెంట్స్ పరిస్థితి ఇంతే ఉందా అని మీకెప్పుడైనా డౌట్ వచ్చిందా? వాస్తవానికి ప్రపంచమంతా ఇలాంటి పరిస్థితుల్లేవ్. చైనా దేశంలో నివసించే నిషీ శర్మ అనే ఓ భారతీయ మహిళ..చైనాలో స్కూల్ పిల్లల లైఫ్ ఎంత ఢిఫరెంట్ గా ఉంటుందో చూపిస్తూ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసినోళ్లంతా ఇదేంటీ అక్కడ ఇలా ఉంటదా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

No Books No Water Bottle Chinese School Bag Stuns Social Media Parents Amazed

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకి చెందిన నిషీ శర్మ ప్రస్తుతం చైనాలోని గ్వాంగ్ జౌలో స్థిరపడ్డారు. నిషీ శర్మ తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేసిన వీడియోలో..ఆమె తన కొడుకు యువాన్ స్కూల్ బ్యాగ్ తెరిచి చూపించారు. బ్యాగ్ కూడా మనదేశంలో పిల్లలు వాడేవిలా కాకుండా చాలా ఢిఫరెంట్ గా ఉంది. చూడగానే పిల్లలు దాన్ని తీసుకోవాలనిపించేలా ఆకర్షిస్తోంది బ్యాగ్. ఆ చిట్టిపొట్టి బ్యాగులో ఉన్నవి కేవలం రెండు జతల టీషర్టులు, ఒక ఇన్నర్, ఒక ప్యాంటు మాత్రమే. ఆ బ్యాగులో కనీసం ఒక్క పుస్తకం, వాటర్ బాటిల్ గానీ, లంచ్ బాక్స్ గానీ లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

అసలు విషయమేమిటంటే, నిషీ కొడుకు చదివే పాఠశాలలోనే పిల్లలకు అవసరమైన ఆహారం, నీరు, పుస్తకాలు, ఇతర స్టడీ మెటీరియల్స్ అన్నీ అందిస్తారట. తన కొడుకు ఉదయం 8 గంటలకు కు స్కూల్ కి వెళ్తే,సాయంత్రం 4 గంటలకు తిరిగి వస్తాడని నిషీ తెలిపారు. ఈ పూర్తి రోజు షెడ్యూల్‌ లో పిల్లల సమగ్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తారని, చదువుతో పాటు ఇతర కార్యకలాపాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారని సమాచారం.

ఈ వీడియో చూసిన చాలా మంది భారతీయ నెటిజన్లు, ముఖ్యంగా తల్లిదండ్రులు చైనాలోని ఈ విధానానికి ఫిదా అయిపోయారు. భారతదేశంలో పిల్లలు మోయాల్సిన పుస్తకాల బరువు తలుచుకుంటేనే బాధగా ఉంది.. ఒక బ్యాగ్ కూడా సరిపోదు. మీ బాబు నిజంగా అదృష్టవంతుడంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా..ఇండియాలో కేజీ పిల్లలు కూడా 5 కిలోల పుస్తకాలు మోస్తారు అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. కొందరు అసలు పిల్లలు ఎప్పుడు, ఏమి చదువుతారు? అని ఆసక్తిగా ప్రశ్నించారు. అయితే ఆ బ్యాగులో అంత ప్రత్యేకత ఏముందని కొందరు అడిగితే నిషీ శర్మ మరో వీడియోలో ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆ బ్యాగును తలపై పెట్టుకుంటే గాయాలు కాకుండా కాపాడుకోవచ్చట. ఇక ఫీజుల విషయానికొస్తే తన కొడుకు కిండర్ గార్టెన్ కోసం నెలకు సుమారు రూ. 35,000 చెల్లిస్తున్నట్లు నిషీ తెలిపారు.

మొత్తం మీద చైనాలోని ఈ పాఠశాల విధానం భారతీయ తల్లిదండ్రులకు ఒక కొత్త ఆలోచనను, ఆశ్చర్యాన్ని కలిగించిందనడంలో సందేహం లేదు. పిల్లల భుజాలపై భారం తగ్గించి చదువును ఆనందంగా మార్చే ఇలాంటి విధానాలు మన దేశంలో కూడా వస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Desktop Bottom Promotion