Just In
లేటు వయసులో లేటెస్ట్ రికార్డు సృష్టించిన 74 ఏళ్ల బామ..
మంగాయమ్మ, రాజారావు తమకు పండంటి బిడ్డ కోసం తిరగని ఆసుప్రతి లేదు. మొక్కని దేవుడంటి లేడు. ఇంతవరకూ వేచి చూసిన వారి కల నేటికి నెరవేరింది.
తల్లి కావాలనే కోరిక ప్రతి మహిళకు ఉంటుంది. తొమ్మిది నెలలు కడుపులో తన బిడ్డను మోసి ఆ బిడ్డను ప్రసవించిన తర్వాత మరో జన్మలాంటి ఆ బిడ్డను చూసి ప్రతి తల్లి మురిసిపోతుంది. అంతవరకు తాను పడిన బాధపడినంతా మరచిపోతుంది. అంతవరకు పురిటినొప్పులను పంటి బిగువన భరిస్తుంది. అది తల్లి యొక్క గొప్పతనం. ఆ అదృష్టం కోసం ప్రతి ఒక్క మహిళ ఎంతగానో ఎదురుచూస్తుంది.
ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో లేటు వయస్సలో డెలివరీ అయిన వారిలో తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామానికి చెందిన మంగాయమ్మ రికార్డు సృష్టించింది. ఆమెకు వివాహం జరిగి 57 ఏళ్లు గడిచినా అమ్మ అనిపించుకోవాలనే ఆమె కోరిక 74 ఏళ్ల వయసులో తీరింది. షష్టిపూర్తి దాటి 14 ఏళ్లు గడిచాక కృత్రిమ గర్భధారణ ద్వారా తల్లి అయ్యే అదృష్టాన్ని దక్కించుకుంది. అంతేకాదు ఒకేసారి ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. 78 ఏళ్ల వయసులో తన భర్తను తండ్రిగా మార్చింది.
ఈ విశేషమైన సంఘటనకు గుంటూరు జిల్లా వేదికైంది. ఆ జిల్లాలోని కొత్తపేట అహల్య ఆసుప్రతిలో ఆమె పండంటి బిడ్డలకు జన్మనిచ్చింది. అంతకుముందు ఆసుప్రతిలోనే ఆమెకు సీమంతం నిర్వహించారు. అనంతరం వైద్యుల సమక్షంలో సురక్షితమైన ప్రసవం జరిగింది. అంతే అందరిలో ఆనందం వెల్లివిరిసింది.
అంతకుముందు మంగాయమ్మ, రాజారావు తమకు పండంటి బిడ్డ కోసం తిరగని ఆసుప్రతి లేదు. మొక్కని దేవుడంటి లేడు. ఇంతవరకూ వేచి చూసిన వారి కల నేటికి నెరవేరింది. ఐవిఎఫ్ విధానం ద్వారా ఆమె తల్లి అయినట్లు డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ రావు ప్రకటించారు. ఎన్నో అవమానాల తర్వాత తమ మొరను దేవుడు ఆలకించాడని వారు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆ దంపతులు మాట్లాడారు.. '' ఐవీఎఫ్ విధానం అనేదే మాకు తెలియదు. మా చుట్టుపక్కల వారు మేము పిల్లల కోసం పడే తపనను చూసి మాకు ఐవీఎఫ్ విధానం గురించి తెలిపారు. ఐవీఎఫ్ విధానం గురించి మాకు చెప్పినప్పుడు మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం. కాని ఫలితం రాలేదు. ఇదొక్కటి ప్రయత్నించి చూద్దాం అనుకున్నాం. ఇందుకు రాజారావు ఒప్పుకోవడంతో ఈ టెక్నాలజీ ద్వారా డెలివరీ సుఖంగా అయ్యింది.
అనంతరం మంగాయమ్మ మాట్లాడుతూ ''దానికంటే ముందు గత సంవత్సరం నవంబర్ లో డాక్టర్ సంప్రదించాను. నాకు ఈ వయసులో పిల్లలు కావాలనే కోరిక ఉందని చెప్పగానే ఆ డాక్టర్ ఆశ్చర్యపోయారు. కానీ తర్వాత ఆ డాక్టర్ దీన్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నారు. నవంబర్ నుండి ట్రీట్ మెంట్ మొదలు పెట్టారు. ఈ ఏడాది జనవరికి తొలి దశ పూర్తయింది. అదే సమయంలో గైనకాలజిస్టు కార్డియాలజిస్టు సలహాలను కూడా పాటించమని డాక్టర్లు చెప్పారు. చివరికి సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సం రోజున నాకు ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు'' అని సంతోషంగా చెప్పారు.