ఒక్క కాఫీ బ్రేక్‌ లో ముగిసిన యుద్ధం..ఎవరు గెలిచారో తెలుసా?

యుద్ధం.. ఈ మాట వినగానే మన కళ్ల ముందు మెదిలేది సంవత్సరాల తరబడి సాగే భీకర పోరాటాలు, అంతులేని రక్తపాతం, అపారమైన విధ్వంసం. చరిత్ర పుటలను తిరగేస్తే ఇలాంటి సుదీర్ఘ సంగ్రామాలు ఎన్నో కనిపిస్తాయి. మన కళ్ల ముందు గత మూడేళ్లుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కూడా ఇదే కోవలోకి వస్తుంది. అయితే ఓ కప్పు కాఫీ తాగేంత సమయంలోనే మొదలై, ముగిసిపోయిన యుద్ధం గురించి మీకు తెలుసా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం. మానవ చరిత్రలోనే ఈ యుద్ధం కేవలం 38 నిమిషాల్లోనే ముగిసిపోయింది. అదే ఆంగ్లో-జాంజిబార్ యుద్ధం.

యుద్ధానికి దారితీసిన నేపథ్యం
19వ శతాబ్దం చివరిలో తూర్పు ఆఫ్రికా తీరంలో హిందూ మహాసముద్రంలో ఓ మెరిసే రత్నంలాంటిది జాంజిబార్ ద్వీపసమూహం.. సుగంధ ద్రవ్యాలు, దంతం వ్యాపారానికి ఒక కీలక కేంద్రంగా ఉండేది. దాని వ్యూహాత్మక ప్రాముఖ్యతను గ్రహించిన బ్రిటీష్ సామ్రాజ్యం, 1890లో జాంజిబార్‌ ను తమ రక్షిత ప్రాంతంగా ప్రకటించుకుంది. అంటే పేరుకు సుల్తాన్ పరిపాలన ఉన్నా, అసలు అధికారం మొత్తం బ్రిటిష్ వారి చేతుల్లోనే ఉండేది.

The 38 Minute War The Shortest Conflict in Human History

1896 ఆగస్టు 25న బ్రిటీష్ వారికి అనుకూలుడైన సుల్తాన్ హమద్ బిన్ తువైని ఆకస్మికంగా మరణించాడు. బ్రిటీష్ వారు తమకు నచ్చిన వ్యక్తిని తదుపరి సుల్తాన్‌ గా నియమించాలని భావిస్తుండగా, ఊహించని పరిణామం జరిగింది. సుల్తాన్ బంధువైన ఖలీద్ బిన్ బర్కాష్ బ్రిటీష్ వారి అనుమతి లేకుండా తనను తాను కొత్త సుల్తాన్‌ గా ప్రకటించుకుని, రాజభవనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇది అప్పటి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బ్రిటీష్ సామ్రాజ్యానికి నేరుగా విసిరిన సవాలు.

38 నిమిషాల భీకర పోరాటం
బ్రిటీష్ వారు ఖలీద్ చర్యను తీవ్రంగా పరిగణించారు. వెంటనే తమ నౌకలను జాంజిబార్ తీరానికి మోహరించి ఆగస్టు 27, ఉదయం 9 గంటల లోపు లొంగిపోవాలని,రాజభవనాన్ని ఖాళీ చేయాలని ఖలీద్‌ కు అల్టిమేటం జారీ చేశారు. తన 2800 మంది సైనికులు, సుల్తాన్‌ కు చెందిన ఏకైక యుద్ధనౌక HHS గ్లాస్గోపై నమ్మకంతో ఖలీద్ ఆ హెచ్చరికను పెడచెవిన పెట్టాడు. సరిగ్గా ఉదయం 9:02 గంటలకు బ్రిటీష్ నౌకల ఫిరంగులు గర్జించడం మొదలుపెట్టాయి. అత్యంత ఆధునిక ఆయుధాలతో విరుచుకుపడిన బ్రిటీష్ రాయల్ నేవీ ధాటికి సుల్తాన్ రాజభవనం పేకమేడలా కూలిపోవడం ప్రారంభించింది.

Take a Poll

నిమిషాల వ్యవధిలోనే భవనంపై పొగలు కమ్ముకున్నాయి. జాంజిబార్ నౌక HHS గ్లాస్గో బ్రిటీష్ నౌకలపై దాడికి ప్రయత్నించగా, దానిని క్షణాల్లోనే ముంచివేశారు. ఖలీద్ సైన్యం చెల్లాచెదురైంది. రాజభవనం శిథిలాల కింద 500 మందికి పైగా జాంజిబార్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
ఉదయం 9:40 గంటలకు రాజభవనంపై ఎగురుతున్న జెండాను దించివేయడంతో యుద్ధం అధికారికంగా ముగిసింది. ఖలీద్ ప్రాణభయంతో జర్మన్ దౌత్య కార్యాలయంలో ఆశ్రయం పొందాడు. కేవలం 38 నిమిషాల్లో బ్రిటీష్ వారు సంపూర్ణ విజయం సాధించారు. వెంటనే వారు తమకు అనుకూలుడైన కొత్త సుల్తాన్‌ ను గద్దెనెక్కించి, జాంజిబార్‌ పై తమ పట్టును మరింత బిగించారు.

ఈ ఆంగ్లో-జాంజిబార్ యుద్ధం దాని సైనిక వ్యూహాల వల్ల గానీ, కలిగించిన విధ్వంసం వల్ల గానీ చరిత్రలో నిలిచిపోలేదు. కేవలం అరగంటలోపే ఒక దేశ భవిష్యత్తును మార్చేసిన, ప్రపంచంలోనే అతి తక్కువ సమయంలో ముగిసిన యుద్ధంగా ఇది చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయింది.

Desktop Bottom Promotion