సంవత్సరానికి 40 మంది మాత్రమే సందర్శించిన దేశం ఏదో తెలుసా..నార్త్ కొరియా దీనికన్నా బెటర్

ఈ భూమ్మీద ఉన్న ప్రతిదీ అద్బుతమే. అయితే ఇందులో కొన్ని ప్రదేశాలను సందర్శించడం మన మనసుకి ఎంతో సంతోషాన్నిస్తుంది. ప్రపంచంలోని అందమైన ప్రదేశాలను చుట్టిరావాలని ఎవరికి మాత్రం ఉండదు? కశ్మీర్ మంచు పర్వతాల దగ్గర నుంచి మాల్దీవుల సముద్ర తీరాల వరకు పర్యాటకులు ప్రతిచోటా కనిపిస్తారు. అయితే ఈ ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రం పర్యాటకుల రాకకు నోచుకోక, ఒంటరిగా మిగిలిపోయాయి.

రాజకీయ అస్థిరత, నిరంకుశ పాలన వంటి కారణాలతో కొన్ని దేశాలకు వెళ్లడానికి ప్రజలు భయపడతారు. ప్రపంచంలో అతి తక్కువ మంది సందర్శించే దేశం ఏదంటే మనలో చాలామందికి ఉత్తర కొరియానే గుర్తుకొస్తుంది. కానీ ప్రపంచంలో అతి తక్కువ మంది అడుగుపెట్టే దేశం మరొకటి ఉంది. దాని పేరు తువాలు. ఈ పేరు కూడా చాలామంది విని ఉండరు.

The World s Least Visited Country Unveiling the Hidden Gem of Tuvalu

ఎక్కడుంది ఈ దేశం?
పసిఫిక్ మహాసముద్రం నడిబొడ్డున ఆస్ట్రేలియా, హవాయి మధ్యలో దాగి ఉన్న తొమ్మిది చిన్న ద్వీపాల సమాహారమే ఈ తువాలు. పచ్చని ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న ఈ స్వర్గధామం, నీలి సంద్రపు కెరటాలు ముద్దాడే తెల్లని ఇసుక తిన్నెలు, రంగురంగుల పగడపు దిబ్బలు, అద్భుతమైన సముద్ర జీవరాశులతో ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తుంది.

ఇంత అందమైన దేశానికి ఎందుకు రావట్లేదు?
2021లో ఈ దేశాన్ని సందర్శించింది కేవలం 40 మంది పర్యాటకులే. గత కొన్ని సంవత్సరాలుగా ఏటా 200 మందికి మించి ఇక్కడికి రాలేదు. తువాలు అందమైనదే అయినా అక్కడికి చేరుకోవడమే ఒక పెద్ద సవాల్. ఫిజి నుండి వారానికి కొన్ని పరిమిత విమానాలు మాత్రమే ఇక్కడికి వస్తాయి. వేల కిలోమీటర్ల సముద్రంతో చుట్టుముట్టబడిన ఈ దేశానికి ప్రయాణం చాలా కష్టం, ఖర్చుతో కూడుకున్నది. ఒకవేళ కష్టపడి చేరుకున్నా, అక్కడ విలాసవంతమైన హోటళ్లు, రిసార్ట్‌ లు కనిపించవు. అతి సాధారణమైన వసతి గృహాలు మాత్రమే ఉంటాయి. దేశంలోని ప్రధాన ద్వీపమైన ఫనాఫుటిలో ఉన్నది ఒకే ఒక్క రహదారి. ఆశ్చర్యకరంగా ఆ రోడ్డుపై ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ కూడా ఉండదు. పర్యాటక రంగం అభివృద్ధి చెందకపోవడం, ప్రచారం లేకపోవడం వంటి కారణాల వల్ల తువాలు ప్రపంచ పర్యాటక పటంలో దాదాపు అదృశ్యమైపోయింది.

The World s Least Visited Country Unveiling the Hidden Gem of Tuvalu

ఒక పెను ముప్పు
తువాలు తన ఉనికికే పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. కేవలం 26 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ దేశం సముద్ర మట్టానికి సగటున 6.5 అడుగుల ఎత్తులో మాత్రమే ఉంది. వాతావరణ మార్పుల కారణంగా పెరుగుతున్న సముద్ర మట్టాలు ఈ దేశాన్ని కొద్దికొద్దిగా కబళిస్తున్నాయి. రాబోయే కొద్ది దశాబ్దాలలో ఈ దేశం పూర్తిగా సముద్రంలో కలిసిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తువాలు మాత్రమే కాదు మార్షల్ దీవులు, సోలమన్ దీవులు వంటి ఇతర పసిఫిక్ దేశాలు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. అత్యంత కఠినమైన నిబంధనలున్న ఉత్తర కొరియాకు కూడా దీనికంటే ఎక్కువ మంది పర్యాటకులు వెళ్తారంటే తువాలు ఎంత ఏకాంతంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Story first published: Monday, September 1, 2025, 9:00 [IST]
Desktop Bottom Promotion