సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో ఘోర ప్రమాదం..భక్తులు మృతి!

ప్రముఖ పుణ్యక్షేత్రమై సింహాద్రి అప్పన్న ఆలయంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులపై గోడ కూలింది. ఇవాళ అప్పన్న ఆలయంలో చందనోత్సవం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ(సింహాద్రి అప్పన టెంపుల్) ఆలయానికి వెళ్లారు. స్వామివారి నిజరూప దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

మంగళవారం రాత్రి సింహాచలంలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం దెబ్బకు సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర రూ.300 టిక్కెట్ క్యూలైన్ పై ఒక సిమెంట్ గోడ కూలిపోయింది. ఈ ఘటనలో 8 మంది భక్తులు మృతి చెందినట్లు సమాచారం. వెంటనే అధికారులు,పోలీసులు రంగంలోకి దిగారు.

Tragedy at simhachalam chandanostavam devotees died due to wall collapse

గోడ కూలిపోవడంతో భక్తుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదస్థలానికి ఎన్టీఆర్ఎఫ్,ఎస్టీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించాయి. శిథిలాల కింద చిక్కుకుపోయిన 6 మృతదేహాలను వెలికి తీయగా..శిథిలాల కిందనే మరో రెండు మృతదేహాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో మరికొందరు భక్తులు కూడా గాయపడగా వారిని హాస్పిటల్ కు తరలించారు. మృతదేహాలకు విశాఖ కేజీహెచ్ కు తరలించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా,మృతుల్లో ముగ్గురు మహిళలు,5గురు పురుషులు ఉన్నారని సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

నిజరూప దర్శనం

లక్ష్మీనృసింహ స్వామిని దర్శించుకునేందుకు ఇప్పటికే భారీ ఎత్తును సింహగిరికి భక్తులు పోటెత్తారు. వేకువజామున ఒంటిగంటకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపాక స్వామివారి దేహంపై ఉన్న చందనాన్ని వెండి బొరిగెలతో అత్యంత సున్నితంగా వేరుచేశారు. నిజరూపంలోకి వచ్చిన స్వామికి అభిషేకాలు నిర్వహించారు.

Desktop Bottom Promotion