Suella Braverman: బ్రిటీష్ అమ్మాయిలపై వేధింపులు.. పాకిస్థానీయుల పనేనన్న యూకే హోంమంత్రి

బ్రిటీష్ అమ్మాయిలను టార్గెట్ చేస్తూ అక్కడ గ్రూమింగ్ గ్యాంగులు పెచ్చుమీరుతున్నాయని, వాటిని అణచివేస్తామని ఎన్నికల సందర్భంగా ప్రధాని రిషి సునాక్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ గ్రూమింగ్ గ్యాంగులపై యూకే హోంమంత్రి, భారత సంతతి మహిళ సుయెల్లా బ్రేవర్మన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

UK Home Secretary Says Pakistani Grooming Gangs Abusing White English Girls Know About In Telugu

'వారే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు':

ఇంగ్లీష్ వైట్ అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న 'గ్రూమింగ్ గ్యాంగు'లపై చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడిస్తూ యూకే మంత్రి సుయెల్లే బ్రేవర్మన్ పాకిస్థానీయులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ సంతతికి చెందిన వారు బ్రిటీష్ అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూకేలో అమ్మాయిలపై అత్యాచారాలు, వేధింపులు, డ్రగ్స్ కు బానిస చేస్తున్న వారిలో ఎక్కువగా పాక్ సంతతికి చెందిన వారే ఉన్నారని తెలిపారు.

ఇలాంటి నేరస్థులను గుర్తించి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని సుయెల్లా బ్రేవర్మన్ చెప్పుకొచ్చారు. యూకేలో గ్రూమింగ్ గ్యాంగ్ లు బలవంతంగా, భయపెట్టి పిల్లలను లైంగికంగా వేధిస్తున్నాయని, అలాంటి ముఠాలు దేశానికి మచ్చ అని సుయెల్లా బ్రేవర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సుయెల్లా బ్రేవర్మన్ వ్యాఖ్యలపై దుమారం:

నేషనల్ సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు చిల్డ్రన్(NSPCC) సుయెల్లా బ్రేవర్మన్ వ్యాఖ్యలను ఖండించింది. లైంగిక నేరగాళ్లు కేవలం ఒకే ప్రాంతం నుండి, ఒకే బ్యాగ్రౌండ్ నుండి రారని తెలిపింది. పిల్లలపై వేధింపులను పరిష్కరించేటప్పుడు కేవలం ఒక జాతిని ఉద్దేశిస్తూ విమర్శలు చేయడం మంచిది కాదని హితవు పలికింది. యూకే హోంమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూనే పైవిధంగా స్పందించింది.

సుయెల్లా బ్రేవర్మన్ వ్యాఖ్యలను ఖండించిన పాక్:

పాకిస్థానీయులపై యూకే హోంమంత్రి చేసిన వ్యాఖ్యలను పాకిస్థాన్ తీవ్రంగా ఖండించింది. సుయెల్లా బ్రేవర్మన్ వ్యాఖ్యలు వివక్షతో కూడుకున్నవని విమర్శించింది. కొందరు వ్యక్తుల నేర ప్రవర్తనను మొత్తం సమాజానికి వర్తింపజేసి తప్పుగా ముద్రవేశారని పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ తెలిపారు.

గతంలో భారత్‌పై సుయెల్లా వివాదాస్పద వ్యాఖ్యలు:

వీసా కాలపరిమితి ముగిసినా చాలా మంది భారతీయులు బ్రిటన్ లోనే ఉండిపోతున్నారంటూ సుయెల్లా బ్రేవర్మన్ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీసా కాలపరిమితి మించి బ్రిటన్ లో ఉంటున్న వారిలో భారతీయులే అత్యధికులను అన్నారు. భారత్‌తో ఓపెన్ బోర్డర్ మైగ్రేషన్ పాలసీపై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె.. ఆ ఒప్పందం వల్ల పెద్దగా ప్రయోజనం లేదని విమర్శించారు.

సుయెల్లా బ్రేవర్మన్ చేసిన ఈ వ్యాఖ్యలపై భారత్ తీవ్రస్థాయిలో స్పందించింది. మొబిలిటీ, మైగ్రేషన్ కు సంబంధించిన విషయాలపై ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయని, అలాంటి సమయంలో సుయెల్లా వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని భారత్ కౌంటర్ ఇవ్వడంతో బ్రిటన్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. భారత్ స్పందనతో బ్రిటన్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

వివాదాల చుట్టూనే సుయెల్లా బ్రేవర్మన్:

సుయెల్లా బ్రేవర్మన్ వివాదాల్లో చిక్కుకోవడం ఇదేం కొత్త కాదు. గతంలోనూ చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. బ్రిటన్ దక్షిణ తీరంలో శరణార్థుల తాకిడిని ఆమె.. వలసదారుల దండయాత్రగా అభివర్ణించడం దుమారం రేపింది.

అంతకుముందు బోరిస్ జాన్సన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన వారిలో బ్రేవర్మన్ కూడా ఉన్నారు. చివరికి బోరిస్ దిగిపోయిన తర్వాత లిజ్ ట్రస్ విజయం సాధించారు. లిజ్ ట్రస్ ప్రభుత్వంలోనూ సుయెల్లా బ్రేవర్మన్ హోంశాఖ మంత్రిగా పని చేశారు.

లిజ్ ట్రస్ మంత్రివర్గంలో ఉంటూనే ఆమెపైనా విమర్శలు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, పలు వృత్తిపరమైన తప్పిదాలు చేయడం, నిబంధనలను ఉల్లంఘించడంతో సుయెల్లా తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. నూతన ప్రధాని రిషి సునాక్ తిరిగి ఆమెను మంత్రిగా తీసుకోవడంపై కూడా ప్రతిపక్షాల నుండే కాకుండా సొంత పార్టీ నాయకుల నుండి వ్యతిరేకత వచ్చింది. సుయెల్లా తన తప్పిదాలను అంగీకరించిందని పేర్కొంటూ రిషి సునాక్ ఆమెను తిరిగి హోంమంత్రిగా తీసుకున్నారు.

Story first published: Wednesday, April 5, 2023, 19:40 [IST]
Desktop Bottom Promotion