Union Budget 2026-27: పసుపు పచ్చని బ్లౌజ్, కాంచీపురం చీర..అదిరిన నిర్మలమ్మ బడ్జెట్ ఆహార్యం!

దేశవ్యాప్తంగా సామాన్యుడి నుండి పారిశ్రామికవేత్తల వరకు అందరి దృష్టి ఈరోజు(ఫిబ్రవరి 1,2026) పార్లమెంట్ వైపే ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్‌సభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ ను ప్రవేశపెట్టనున్నారు.

ఇది ఆమెకు వరుసగా తొమ్మిదవ బడ్జెట్ కావడం విశేషం. దీనితో ఆమె భారత ఆర్థిక చరిత్రలో అత్యధిక సార్లు వరుసగా బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డును మరింత పదిలం చేసుకుంటున్నారు.

Union Budget 2026 FM Nirmala Sitharaman Embraces Tamil Nadu Tradition in Kanchipuram Saree

ప్రభుత్వ ఆదాయ వ్యయాలు, పన్ను మినహాయింపులు, ఆర్థిక క్రమశిక్షణ వంటి అంశాలపై దేశం దృష్టి సారిస్తుంటే.. మరొక ఆసక్తికరమైన విషయం కూడా ప్రతిసారీ చర్చనీయాంశమవుతోంది. అదే..బడ్జెట్ రోజున ఆర్థిక మంత్రి ఎంపిక చేసుకునే చీర. ఈ సంవత్సరం కూడా నిర్మలా సీతారామన్ తన వస్త్రధారణ ద్వారా భారతీయ సంస్కృతికి పెద్దపీట వేశారు.

తమిళనాడు సొగసు - మెరూన్ కాంజీవరం
ఈ ఏడాది బడ్జెట్ ప్రసంగానికి సిద్ధమవుతూ నిర్మలా సీతారామన్ తమిళనాడు సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా అద్భుతమైన డీప్ మెరూన్ (ముదురు ఎరుపు) రంగు కాంజీవరం స్కిల్ చీరను ఎంచుకున్నారు. ఈ చీరపై ఉన్న సూక్ష్మమైన బంగారు వర్ణపు జరీ పనితనం హుందాతనాన్ని పెంచగా, దీనికి కాంట్రాస్ట్‌గా ధరించిన పసుపు రంగు బ్లౌజ్ ఆమె ఆహార్యానికి మరింత వన్నె తెచ్చింది.

తమిళనాడు చేనేత కార్మికుల నైపుణ్యానికి నిలువుటద్దంలా నిలిచే ఈ కాంజీవరం చీర ద్వారా దక్షిణాది చేతివృత్తుల గొప్పతనాన్ని ఆమె మరోసారి చాటిచెప్పారు.

వోకల్ ఫర్ లోకల్ కు ప్రచారకర్తగా
నిర్మలా సీతారామన్ బడ్జెట్ రోజున ధరించే చీరలు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే వోకల్ ఫర్ లోకల్ (స్థానిక ఉత్పత్తులకు మద్దతు) నినాదానికి ఒక నిశ్శబ్ద ప్రచారం. గత కొన్ని సంవత్సరాలుగా ఆమె దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత వస్త్రాలను ధరించి, ఆయా ప్రాంతీయ కళలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తున్నారు.

గత బడ్జెట్ సందర్భంలో
గత సంవత్సరం బడ్జెట్ సమయంలో ఆమె ధరించిన చీర కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. బీహార్‌ కు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారి దేవి స్వయంగా బహుమతిగా ఇచ్చిన, మధుబని చేపల ఎంబ్రాయిడరీతో కూడిన ఆఫ్ వైట్ చీరలో ఆమె మెరిశారు. ఎరుపు రంగు బ్లౌజ్‌ తో జత చేసిన ఆ చీర, బీహార్ జానపద కళా సంప్రదాయాన్ని దేశం నలుమూలలా తెలిసేలా చేసింది.

అంతకుముందు కూడా ఒడిశాకు చెందిన సంబల్‌పురి, తెలంగాణకు చెందిన పోచంపల్లి లేదా ఇక్కత్ వంటి వైవిధ్యమైన చేనేత చీరలను ధరించి ఆమె చేనేత రంగానికి అండగా నిలిచారు.

బ్రీఫ్‌ కేస్ నుండి బహీ ఖాతా వరకు
కేవలం చీరల ఎంపికలోనే కాదు, బడ్జెట్ పత్రాలను తీసుకువచ్చే విధానంలోనూ ఆమె భారతీయతను చొప్పించారు. బ్రిటీష్ కాలం నాటి బ్రీఫ్‌ కేస్ సంప్రదాయానికి స్వస్తి పలికి, ఎరుపు రంగు వస్త్రంలో చుట్టిన బహీ ఖాతా (ప్రస్తుతం డిజిటల్ ట్యాబ్) పట్టుకుని రావడం ద్వారా భారతీయ వ్యాపార సంప్రదాయాలను గౌరవించారు.

Story first published: Sunday, February 1, 2026, 10:36 [IST]
Desktop Bottom Promotion