Montha Cyclone: అల్లకల్లోలంగా బంగాళాఖాతం..వర్షాలు స్టార్ట్..43 రైళ్లు రద్దు..పూర్తి వివరాలు చూడండి

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాను అక్టోబర్ 28 సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం, కాకినాడ మధ్య తీరాన్ని తాకనుందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ తుఫాను మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది, దీని వలన గంటకు 110 కి.మీ వేగంతోపెనుగాలులు గాలులు వీస్తాయన్నారు. ఆంధ్ర, దక్షిణ ఒడిశా అంతటా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఇప్పటికే తుఫాన్ ప్రభావంతో కోస్తా జిల్లాలు గజగజ వణికిపోతున్నాయి. ఆకాశం మేఘావృతమై, సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు తీర ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి రానున్న 24 గంటలు అత్యంత కీలకమని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

Weather Update Cyclone Montha Effect Heavy Rains 43 Trains Cancelled Officials Issue Grave Warning to Public

యుద్ధప్రాతిపదికన ప్రభుత్వ చర్యలు
తుఫాను ముప్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేసింది. హోంమంత్రి అనిత ప్రభావిత జిల్లాలైన అనకాపల్లి, కాకినాడ, కోనసీమ కలెక్టర్లు, ఎస్పీలతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లాపై తుఫాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున, అక్కడ 6 మండలాల్లో ప్రత్యేక దృష్టి సారించి, అత్యధికంగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ముందుగానే ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు సిద్ధం చేసుకోవాలని, రహదారులపై చెట్లు కూలితే తక్షణమే తొలగించేందుకు జేసీబీలు, జనరేటర్లను సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు. నగరాల్లోని భారీ హోర్డింగులను తొలగించాలని, అత్యవసర వైద్య సేవలకు అంబులెన్సులను అందుబాటులో ఉంచాలని, డెలివరీకి దగ్గరలో ఉన్న గర్భిణుల సమాచారాన్ని సేకరించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్రజలకు తీవ్ర హెచ్చరికలు
వాతావరణం కాస్త ప్రశాంతంగా ఉందని అశ్రద్ధ వద్దు.. ఇది పెను తుఫానుకు ముందు ఉండే నిశ్శబ్దం.. ఎవరూ బయటకు రావద్దు అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. నెల్లూరు జిల్లాలోని 9 మండలాల్లో 42 గ్రామాలకు హై అలర్ట్ ప్రకటించారు. పశ్చిమ గోదావరిలో 16 తుఫాన్ షెల్టర్లు, భీమవరం, తాడేపల్లిగూడెంలో పునరావాస కేంద్రాలు సిద్ధమయ్యాయి. మచిలీపట్నం తీరానికి NDRF బృందాలు చేరుకున్నాయి. ప్రభావిత జిల్లాల్లో మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

రవాణా వ్యవస్థపై ప్రభావం
తుఫాను కారణంగా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ విశాఖ మీదుగా వెళ్లే 43 రైళ్లను అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులు తమ రైలు స్టేటస్‌ను నిర్ధారించుకున్నాకే ప్రయాణాలు పెట్టుకోవాలని సూచించింది. బుధవారం వరకు తుఫాను ముప్పు కొనసాగనుండటంతో, ప్రజలు అధికారిక హెచ్చరికలను పాటిస్తూ, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Desktop Bottom Promotion