Cyclone montha: బంగాళాఖాతం అల్లకల్లోలం..తీవ్ర తుఫాన్‌ గా దూసుకొస్తున్న మొంథా!..ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌పై మొంథా తుఫాన్ కన్నెర్ర చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ పెను తుఫాన్, కోస్తాంధ్ర తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. రాబోయే 48 గంటలు అత్యంత కీలకమని, ప్రజలు అలర్ట్ గా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ విపత్తును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది.

చెన్నైకి 640 కి.మీ..వైజాగ్ కు 740 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైన ఈ తీవ్ర వాయుగుండం గంటగంటకు బలపడుతోంది. సోమవారానికి తుఫాన్‌ గా, మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫాన్‌ గా మారి అదే రోజు రాత్రి కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు కుండపోత వర్షాలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Weather Update Cyclone Montha s Fury Red Alert for Andhra Pradesh as Storm Nears Coast

ముఖ్యంగా మంగళ, బుధవారాల్లో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు విధ్వంసం సృష్టించవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. తీరం దాటాక కూడా సుమారు 12 గంటల పాటు దీని ప్రభావం కొనసాగనుంది.

అప్రమత్తమైన ప్రభుత్వం, సహాయక బృందాలు సిద్ధం
తుఫాన్ హెచ్చరికల క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేశారు. ప్రజలకు ఎప్పటికప్పుడు SMS, వాట్సప్‌ ల ద్వారా సమాచారం అందించాలని, కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు. సహాయక చర్యల కోసం SDRF, NDRF బృందాలను కీలక జిల్లాల్లో మోహరించారు. తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు ప్రారంభమయ్యాయి. చెట్లు కూలినా, విద్యుత్ స్తంభాలు పడిపోయినా వెంటనే తొలగించేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయి.

జిల్లాలకు తీవ్ర హెచ్చరికలు

తుఫాన్ తీవ్రత దృష్ట్యా ఇవాళ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి సహా 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మంగళవారం నాటికి ఈ సంఖ్య 14 జిల్లాలకు పెరగనుంది. ముఖ్యంగా కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడనున్నాయి.

సముద్రం అల్లకల్లోలంగా మారడంతో మత్స్యకారులు గురువారం వరకు వేటకు వెళ్లొద్దని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం సహా పలు ప్రధాన పోర్టుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, ప్రభుత్వం జారీ చేసే సూచనలను పాటిస్తూ సురక్షితంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Story first published: Monday, October 27, 2025, 6:47 [IST]
Desktop Bottom Promotion