ఆడపిల్లను అక్కున చేరుద్దాం....!

By B N Sharma

Menace of Female Foeticide!
మహిళకు గర్భవతి అవ్వటమనేది దేముడు ఇచ్చిన ఒక వరం. తల్లి అవుతున్నానంటే చాలు ఆమె ఎంతో సంతోషిస్తుంది. తన జన్మ ధన్యమైనట్లు భావిస్తుంది. యుక్త వయసు వచ్చిందంటే చాలు, ఆ వయసు నుండి తల్లి అయ్యేటంతవరకు తాను ఏదో ఒక దశలో తల్లి కావాలని మహిళ భావిస్తూ ఉంటుంది. కాని ఇప్పటికి కొన్ని కుటుంబాలలో ఆడ పిల్లకు తగిన న్యాయం చేకూరటం లేదు. ఆడ పిల్ల పుడుతోందంటే, వీరు ఎంతో బాధ పడతారు.

తన మహిళ కడుపులో ఉన్న బిడ్డ ఆడపిల్ల అని తెలిస్తేచాలు గర్భాన్ని సైతం విచ్ఛిన్నం చేయటానికి వెనుకాడరు. కాని తన పుటుకకు, పెంపకానికి, చివరకు తాను ఏ దశకు చేరాలన్నా ఒక ఆడదే తోడు అనే ప్రాధమిక అంశాన్ని కూడా గ్రహించని వారు నేటికి ఉన్నారు. మన దేశంలో ఆడ పిల్లలను గర్భంలోనే అంతమొందించటం చట్ట విరుద్ధంగా ప్రకటించారు. అసలు గర్భవతి అయినపుడు పుట్టేది ఆడా ? మగా? అని నిర్ణయించే వైద్య పరీక్షలను సైతం నిషేధించారు. మరి ఈ పరిస్ధితులలో చట్టపరంగా తగిన చర్యలు చేపట్టటమే కాక, సమాజపరంగా కూడా ప్రతి ఒక్కరు భ్రూణ హత్యలను అనాగరిక చర్యలుగా భావించి వాటిని నిరసించాలి.

తాజా సమాచారంగా, హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడా తన రాష్ట్రంలో ఆడపిల్లను పిండంగా ఉన్నపుడే గర్భంలోనే అంతమొందించటాన్ని ఒక హేయమైన చర్యగా ఖండించిన ఒక పంచాయతీ సంస్ధకు ఆ గ్రామాభివృధ్ధికిగాను కోటి రూపాయలను మంజూరు చేశారు. ఈ గ్రామం ఆ రాష్ట్రంలోని జింద్ జిల్లాలో బిబి పూర్ గా పిలువబడుతోంది.ఆ గ్రామంలోని ప్రజలు ప్రత్యేకించి మహిళలు ఆడ పిల్లలను భ్రూణ హత్య గావించటం చట్ట విరుద్ధమని, ఆ చర్య చాలా హీనమైనదని వారు ఖండించారు. ఈ గ్రామ ప్రజలు చేపట్టిన ఈ అంశం ఇతర ప్రాంతాల ప్రజలకు ఆదర్శమని, వీరి చర్య తమ రాష్ట్రంలోనే కాక, దేశంలోని ఇతర ప్రాంతాల వారికి కూడా ఆదర్శమని ముఖ్యమంత్రి హూడా వారిని అభినందించారు.

ఈ గ్రామ ఖాప్ మహా పంచాయతీలో మొట్ట మొదటి సారిగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీరి సమావేశం బిబిపూర్ గ్రామంలో జరిగింది. వారు అక్కడినుండే సమాజంలో చెడును తొలగించే ఈ అంశంపై ఉద్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మహాపంచాయతీ లో హర్యానా, రాజస్తాన్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల పంచాయతీలనుండి కూడా పెద్దలు పాల్గొని ఈ సామాజిక దురాచారాన్ని మట్టు బెట్టాలని తీర్మానించారు. మహిళా భ్రూణ హత్యల కారణంగా యువతుల సంఖ్య దేశంలో నానాటికి తగ్గిపోతోందని, ఈ దురాచారాన్ని రూపుమాపేందుకు చర్యలు సమర్ధవంతంగా చేపట్టాలని వారు తీర్మానించారు.

ఇతర ఖాప్ పంచాయతీలు ముందుకు వచ్చి ఈ రకమైన సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. హర్యానా రాష్ట్రం ఇప్పటికే ఈ మహిళా భ్రూణ హత్యల దురాచారం రూపుమాపటానికి వివిధ కార్యక్రమాలను ప్రారంభించిందని, వీటిని అమలు చేయటానికిగాను ప్రజలనుండి హృదయ పూర్వక మద్దతు అవసరమని, అపుడే, తాము ఆశించిన ఫలితాలు సమాజానికి అందుతాయని ముఖ్యమంత్రి హూడా ప్రజలకు వివరించారు. మహిళా భ్రూణ హత్యలను అరికట్టటంలో చర్యలు చేపట్టి తమ పంచాయతి సమాజంలో సవ్యమైన మార్పులు ఏ రకంగా తీసుకు రావచ్చనేది చూపుతూ ఆదర్శంగా ఉందని ఇతర సామాజిక సంస్ధలకు ఒక మంచి ఉదాహరణా నిలిచి వుందని ఆయన కొనియాడారు.

Desktop Bottom Promotion