సగ్గుబియ్యంతో అద్భుతమైన రసగుల్లా..స్వీట్ షాప్ రుచి ఇంట్లోనే..ఎలా చేసుకోవాలంటే

Posted By:

పండగలొచ్చినా, ఇంట్లో చిన్న పార్టీ ఉన్నా లేదా సాయంత్రం వేళ మనసుకు నచ్చిన తీపి తినాలనిపించినా.. మనలో చాలామంది వెంటనే స్వీట్ షాప్ వైపు పరుగులు తీస్తాం. కానీ ప్రతిసారీ బయట కొనడం ఎందుకు? అందరూ ఇష్టపడే రసగుల్లాను, అదీ మన వంటింట్లో దొరికే సగ్గుబియ్యంతోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? కేవలం అర కప్పు సగ్గుబియ్యం, ముప్పావు లీటరు పాలతో చేసే ఈ వెరైటీ రసగుల్లా రుచి అమోఘం.

దీనిని ఒక్కసారి చేసి మీ ఇంట్లో వాళ్లకు రుచి చూపిస్తే చాలు మళ్లీ మళ్లీ కావాలని అడగడం ఖాయం. నోట్లో వేసుకోగానే మృదువుగా, పాల రుచితో కరిగిపోయే ఈ స్వీట్, మీ ఇంటిల్లిపాది మనసు దోచుకుంటుంది. ఇక పండగ రోజుల్లో అయితే ఇంటికి వచ్చిన అతిథులు ఈ రసగుల్లాను తిని, మీ చేతి వంటను మెచ్చుకోకుండా ఉండలేరు. ఈ కొత్త రకం బియ్యం రసగుల్లా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

A Must Try Dessert Unique Sabudana Rasgulla Recipe in Telugu

కావలసిన పదార్థాలు
సగ్గు బియ్యం- అర కప్పు
మొక్కజొన్న పిండి- పావు కప్పు
పాల పొడి - అర కప్పు
నీళ్లు- అవసరమైనంత
చిక్కటి పాలు- ముప్పావు లీటరు
పాల పొడి- అర కప్పు
చక్కెర- ముప్పావు కప్పు
యాలకులు- 2
కుంకుమపువ్వు - చిటికెడు
బాదం,పిస్తా- అలంకరణ కోసం

Take a Poll

తయారీ విధానం

-ముందుగా సగ్గుబియ్యాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడగాలి. ఆ తర్వాత బియ్యం పూర్తిగా మునిగేలా నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టాలి.

-నానిన తర్వాత బియ్యంలోని నీటిని పూర్తిగా వంపేసి, వాటిని ఒక మిక్సీ జార్‌ లోకి తీసుకోండి. దీనికి మొక్కజొన్న పిండి, పాల పొడి కూడా జత చేసి అవసరమైతే కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ ఎక్కడా బరక లేకుండా మెత్తని పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి.

-ఈ పిండి ముద్దను ఒక గిన్నెలోకి తీసుకుని చేతులకు కొద్దిగా నూనె లేదా నెయ్యి రాసుకుని, ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా ఎక్కడా పగుళ్లు లేకుండా నున్నగా చుట్టుకుని ఒక పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు స్టవ్‌ పై వెడల్పాటి, అడుగు మందంగా ఉన్న పాత్రను పెట్టి అందులో పాలు పోసి మరిగించాలి.

-పాలు మరగడం మొదలవగానే మంటను తగ్గించి, పాల పొడిని వేసి ఉండలు కట్టకుండా గరిటెతో బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల రసం చిక్కగా, రుచిగా వస్తుంది.

-పాలు బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న సగ్గుబియ్యం ఉండలను ఒక్కొక్కటిగా నెమ్మదిగా పాలలో వేయాలి.

-ఉండలు పాలలో వేయగానే గరిటె పెట్టకూడదు. అలా చేస్తే అవి విరిగిపోయే ప్రమాదం ఉంది. 7-8 నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడికించాలి. అవి ఉడికి వాటంతట అవే పైకి తేలే వరకు ఓపిక పట్టాలి.

-ఉండలు పైకి తేలడం మొదలయ్యాక నెమ్మదిగా ఒకసారి గరిటెతో కదిపి ఇప్పుడు చక్కెర, దంచిన యాలకుల పొడి వేసి బాగా కలపాలి. మంటను పెద్దది చేసి,మరో 5 నిమిషాల పాటు పాలను మరిగించాలి.

-చివరగా సువాసన కోసం కుంకుమపువ్వు వేసి కలిపి, పైన సన్నగా తరిగిన బాదం, పిస్తా పలుకులతో అలంకరించుకుంటే సగ్గుబియ్యం రసగుల్లా రెడీ. దీనిని వేడిగా తిన్నా లేదా ఫ్రిజ్‌ లో పెట్టి చల్లగా సర్వ్ చేసుకున్నా అద్భుతంగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Tuesday, September 23, 2025, 10:34 [IST]
Desktop Bottom Promotion