ప్యాకెట్స్ లో అమ్మేదానికన్నా బెస్ట్ మటన్ మసాలా పౌడర్..వెజ్ కర్రీల్లో కూడా వాడొచ్చు..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే

Posted By:

భారతీయ వంటకాల్లో ఒక ముఖ్యమైన భాగంగా మటన్ మసాలా పౌడర్ నిలుస్తుంది. ఇది మటన్ వంటలకు అద్భుతమైన సువాసన,టేస్ట్ ని అందిస్తుంది. ప్యాకెట్స్ లో బ్రాండెడ్ కంపెనీలు అమ్మే మటన్ మసాలా కన్నా 100 శాతం బెస్ట్ గా ఘుమఘుమలాడే మటన్ మసాలా పౌడర్ ని ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోవచ్చు. ఇంట్లో తయారుచేసుకున్న మసాలా పౌడర్ బయట కొన్న వాటికంటే చాలా ఆరోగ్యకరమైనది, రుచికరమైనది. ఎందుకంటే మనం స్వచ్ఛమైన దినుసులను ఉపయోగించవచ్చు, మన టేస్ట్ కి తగ్గట్లు మసాలాను తయారుచేసుకోవచ్చు.

మటన్ మసాలా పౌడర్ ను కేవలం నాన్ వెజ్ లోనే కాకుండా బంగాళదుంపు వేపుడు వంటి వెజ్ కర్రీల్లో కూడా వేసుకోవచ్చు. ఇది వేస్తే వెజ్ కూర టేస్ట్ కూడా నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. ఇంటి నుంచే ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటుంటే కూడా ఇది బెస్ట్ ఆప్షన్. దీనిని తయారుచేసి మార్కెట్లో అమ్ముకోవచ్చు. 100 గ్రాముల మటన్ మసాలా పౌడర్ ను ఇంట్లోనే తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

Best mutton masala powder at home recipe in telugu

మటన్ మసాలా పౌడర్ తయరీకి కావాల్సిన పదార్థాలు
-ఎండుమిర్చి
-యాలకలు
-లవంగాలు
-మిరయాలు
-మెంతులు
-జాజికాయ
-జాపత్రి
-సోంపు
-కసూరి మేథీ
-ఆవాలు
-నల్ల యాలకలు
-బిర్యానీ ఆకులు
-పసుపు
-కారం
-ఉప్పు
-ధనియాలు
-జీలకర్ర

తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 20 గ్రాముల ఎండుమిరపకాయలు, ఒకటిన్నర గ్రాముల బిర్యానీ ఆకులను తుంపి వేసి తక్కువ మంట మీద కలుపుతూ మిర్చీని రంగు మారకుండా పొంగించి ఓ ప్లేట్ లోకి తీసి పక్కనపెట్టుకోండి.

-తర్వాత స్టవ్ మీద ఉన్న అదే పాన్ లో 20 గ్రాముల ధనియాలు వేసి తక్కువ మంటమీద కలుపుతూ మంచి సువాసన వచ్చేదాకా వేయించి వీటిని ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.

-తర్వాత స్టవ్ మీద ఉన్న పాన్ లోనే 4 గ్రాముల ఆవాలు, 2 గ్రాముల యాలకలు, మూడున్నర గ్రాముల నల్ల యాలకలు, 5 లవంగ మొగ్గలు, 2 గ్రాముల మిరియాలు, 4గ్రాముల దాల్చిన చెక్క, 25 గ్రాముల మెంతులు, 1 గ్రాము జాజికాయ ముక్క, 2 గ్రాముల జాపత్రి వేసి సన్నని సెగమీద ఆవాలు చిట్లేదాకా వేయించి ఓ ప్లేట్ లోకి తీసుకొని చల్లారనివ్వాలి.

-ఇప్పుడు స్టవ్ మీద ఉన్న పాన్ లోనే 3 గ్రాముల సోంపు, అర గ్రాము కసూరి మేథీ, 10 గ్రాముల జీలకర్ర, 3 గ్రాముల ఉప్పు వేసి కసూరి మేథీ వేసి కసూరి మేథీ నలిపితే పొడి పొడిగా అయ్యేదాకా కలుపుతూ వేయించి ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద పాన్ లోనే 6 గ్రాముల గసగసాలు వేసి వేడిబడనిచ్చి ఓ ప్లేట్ లోకి తీసి పెట్టుకోండి

-ఇప్పుడు వేయించనవన్నీ చల్లారిన తర్వాత ఎండుమిర్చి,ధనియాలు,బిర్యానీ ఆకు తప్ప మిగతావన్ని మిక్సీ గిన్నెలో వేసి మెత్తని పొడిగా గ్రైండ్ చేసి ఓ గిన్నెలోకి తీసుకోండి.

-తర్వాత మిక్సీ గిన్నెలో వేయించిన ధనియాలు,ఎండుమిర్చి,బిర్యానీ ఆకులు వేసి ఇందులో 2 గ్రాముల సొంటి పొడి, 2 గ్రాముల పసుపు, 8 గ్రాముల కశ్మీర కారం పొడి వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి.

-రెండుసార్లు మిక్సీలో గ్రైండ్ చేసుకున్న పొడులను ఓ గిన్నెలో వేసి బాగా కలిసేలా కలిపండి. అంతే మటన్ మసాలా పౌడర్ రెడీ. దీన్ని జల్లించుకొనిగాలి చొరబడని డబ్బాలో వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Tuesday, July 15, 2025, 18:21 [IST]
Desktop Bottom Promotion