కర్ణాటక స్పెషల్ కుకుంబర్ అవలక్కి..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్‌ ఫాస్ట్!

Posted By:

రోజువారీగా తినే ఉప్మా, ఇడ్లీ, దోశలతో పాటు సాధారణ అటుకుల ఉప్మా (పోహా) తిని మీకు బోర్ కొట్టిందా? అయితే నోటికి ఎంతో రుచిగా ఉండే సరికొత్త, ఆరోగ్యకరమైన కర్ణాటక స్టైల్ కుకుంబర్ అవలక్కి(Cucumber Avalakki) ట్రై చేయండి. కీరదోసకాయ, పచ్చి కొబ్బరి తురుముతో చేసే ఈ అటుకుల ఉప్మా కడుపుకు చాలా తేలికగా ఉంటుంది.

Bored of Regular Poha Try This Refreshing Karnataka Style Cucumber Avalakki Recipe in Telugu

వేసవి ఉదయాల్లో లేదా శరీరాన్ని చల్లబరిచే ఆహారం కావాలనుకున్నప్పుడు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఇందులో ఉండే కీరదోస తాజాదనాన్ని ఇస్తే, కొబ్బరి కమ్మదనాన్ని, నిమ్మకాయ కాస్త పులుపును జోడించి అద్భుతమైన రుచిని అందిస్తాయి. ఉదయం హడావిడిలో కేవలం పది నిమిషాల్లో కుకుంబర్ అవలక్కి ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కుకుంబర్ అవలక్కి తయారీకి కావాల్సిన పదార్థాలు

మందపాటి అటుకులు- 1 కప్పు

కీరదోస తురుము - 1 కప్పు
పచ్చి కొబ్బరి తురుము - పావు కప్పు
పల్లీలు- 2 టేబుల్ స్పూన్లు
వంట నూనె - 2 టీస్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
శనగపప్పు - 1 టీస్పూన్
మినపప్పు - 1 టీస్పూన్
ఎండుమిర్చి - 1 లేదా 2
ఇంగువ - చిటికెడు
సన్నగా తరిగిన అల్లం - 1 టీస్పూన్
పచ్చిమిర్చి - 1
కరివేపాకు - 8 ఆకులు
నిమ్మరసం - 2 టీస్పూన్లు
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా

కుకుంబర్ అవలక్కి తయారీ విధానం

-ముందుగా అటుకులను ఒక జల్లెడలో తీసుకుని నీటితో శుభ్రంగా కడగాలి. ఒకటి రెండు నిమిషాలు నానాక, నీళ్లన్నీ వంపేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల అటుకులు మెత్తగా, పొడిపొడిగా తయారవుతాయి. మరీ ఎక్కువసేపు నానబెడితే ముద్దగా అయిపోతాయి.

-కీరదోసకాయను తురుముకొని, ఆ తురుమును చేత్తో గట్టిగా పిండి, అదనంగా ఉన్న నీటిని తీసేయండి.

-ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని.. అందులో నానబెట్టిన అటుకులు, నీరు పిండేసిన కీరదోస తురుము, పచ్చి కొబ్బరి తురుము, రుచికి సరిపడా ఉప్పు వేసి సున్నితంగా కలుపుకుని పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు స్టవ్ వెలిగించి, కడాయి పెట్టుకుని నూనె వేయండి. నూనె వేడెక్కాక పల్లీలు వేసి కరకరలాడే వరకు వేయించి పక్కన పెట్టుకోండి. అదే నూనెలో ఆవాలు వేసి అవి చిటపటలాడుతున్నప్పుడు శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించండి. తాలింపు నుంచి కమ్మటి వాసన వస్తున్నప్పుడు కరివేపాకు వేయండి.

-ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న అటుకుల మిశ్రమాన్ని కడాయిలో వేసి బాగా కలపండి. మంటను సిమ్ లో ఉంచి, సుమారు 2-3 నిమిషాల పాటు వేడి చేయండి.

-చివరగా స్టవ్ ఆఫ్ చేసి, అందులో నిమ్మరసం, వేయించిన పల్లీలు వేసి మెల్లగా కలపండి. పైనుంచి తాజా కొత్తిమీరను చల్లుకుంటే కుకుంబర్ అవలక్కి రెడీ.

[ of 5 - Users]
Story first published: Thursday, April 16, 2026, 16:26 [IST]
Desktop Bottom Promotion