పిండి నానబెట్టే శ్రమ లేదు..రుచితోపాటు ఆరోగ్యం అందించే ఓట్స్ మసాలా ఇడ్లీ..15 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే..

Posted By:

ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? అదే ఇడ్లీ, దోశ తిని విసుగొచ్చిందా? అయితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే ఒక అద్భుతమైన వంటకం ఓట్స్ మసాలా ఇడ్లీ. పప్పు నానబెట్టడం, పిండి రుబ్బడం వంటి శ్రమ లేకుండా కేవలం 15 నిమిషాల్లో ఓట్స్ మసాలా ఇడ్లీ రెడీ చేసుకోవచ్చు. ఇది కేవలం రుచికరమైనదే కాదు, బరువు తగ్గాలనుకునేవారికి, ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారికి ఒక వరం లాంటిది. ఓట్స్ మసాలా ఇడ్లీ తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
-ఓట్స్ - 1 కప్పు
-బొంబాయి రవ్వ వేయించింది - అర కప్పు
-పుల్లటి పెరుగు - అర కప్పు
-తురిమిన క్యారెట్ - 2 టేబుల్ స్పూన్లు
-తురిమిన అల్లం - అర అంగుళం ముక్క
-తాలింపు కోసం: నూనె, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, చిటికెడు ఇంగువ, కరివేపాకు
-వంటసోడా - అర టీస్పూన్
-ఉప్పు - రుచికి సరిపడా
-నీరు - తగినంత

తయారీ విధానం

-ముందుగా ఓట్స్‌ ను మిక్సీ జార్‌ లో వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వలా ఉండేలా పొడి చేసుకోవాలి.

-ఒక గిన్నెలో ఈ ఓట్స్ పొడి, వేయించిన బొంబాయి రవ్వ,పుల్లటి పెరుగు, తురిమిన క్యారెట్, అల్లం వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా ఇడ్లీ పిండిలా జారుగా కలుపుకోవాలి.

-ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద బాండీ పెట్టి అందులో కొద్దిగా నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంగువ, కరివేపాకు వేసి చిటపటలాడించాలి. ఈ ఘుమఘుమలాడే తాలింపును పిండిలో వేసి బాగా కలపాలి.

-ఈ మిశ్రమాన్ని మూతపెట్టి ఓ 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. దీనివల్ల రవ్వ, ఓట్స్ చక్కగా నాని ఇడ్లీలు మెత్తగా వస్తాయి.

-చివరగా ఇడ్లీలు పెట్టే ముందు రుచికి సరిపడా ఉప్పు, వంటసోడా వేసి పిండిని ఒకే దిశలో నున్నగా కలపాలి.

-తర్వాత ఇడ్లీ ప్లేట్లకు నూనె రాసి పిండిని వేసి 15 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికిస్తే చాలు. అంతే వేడివేడి, మెత్తటి, సువాసనభరితమైన ఓట్స్ మసాలా ఇడ్లీ రెడీ.

ఈ ఓట్స్ మసాలా ఇడ్లీని కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌ తో తింటే ఆ రుచే వేరు.

[ of 5 - Users]
Desktop Bottom Promotion