సమ్మర్ కూల్ డెజర్ట్..మజా వచ్చే మామిడి పాయసం..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..

Posted By:

ఎండాకాలంలో మామిడి పండును ముక్కలుగా కోసుకుని తినడం ఒక ఎత్తైతే..దాంతో రకరకాల వంటకాలు, స్వీట్లు తయారు చేసుకుని ఆస్వాదించడం మరో ఎత్తు. అలాంటి అద్భుతమైన, నోరూరించే ప్రత్యేక వంటకాల్లో మామిడి పాయసం స్థానం ఎప్పుడూ టాప్ ప్లేస్ లో ఉంటుంది. చిక్కటి పాల మీగడ, స్వచ్ఛమైన నెయ్యి, సుగంధ భరితమైన యాలకుల పరిమళం, వీటన్నింటికీ తోడు మామిడి పండు అద్భుతమైన తీయదనం కలిస్తే ఆ రుచి అమృతమే.

Chill Out This Summer with Rich Creamy Mango Payasam Recipe in Telugu

ఏదైనా పండుగ వచ్చినా, ఇంటికి అతిథులు వచ్చినా, లేదా సెలవు రోజుల్లో కుటుంబ సభ్యులకు ఏదైనా ప్రత్యేకమైన స్వీట్ చేసి తినిపించాలనుకున్నా మామిడి పాయసం బెస్ట్ ఆప్షన్. చాలా తక్కువ సమయంలో, ఇంట్లో ఉండే సాధారణ వస్తువులతోనే ఎంతో సులభంగా మామిడికాయ పాయసం ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

మ్యాంగో పాయసం తయారీకి కావలసిన పదార్థాలు

పండిన మామిడి పండ్లు - 2
చిక్కటి పాలు (ఫుల్ క్రీమ్ మిల్క్)- అర లీటరు
బియ్యం - పావు కప్పు
పంచదార - అర కప్పు
యాలకుల పొడి - అర టీస్పూన్
స్వచ్ఛమైన నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు,కిస్మిస్, పిస్తా- తగినంత

image: homecookingshow

మ్యాంగో పాయసం తయారీ విధానం

-ముందుగా బాస్మతి లేదా పొట్టి గింజల బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, కనీసం అరగంట పాటు నీటిలో నానబెట్టండి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు లేదా పాలు పోసి, అన్నం మెత్తగా (పేస్ట్ లాగా) అయ్యేలా ఉడికించి పక్కన పెట్టుకోండి.

-పండిన మామిడి పండ్లను తీసుకుని, తొక్క తీసి ముక్కలుగా కోసుకోండి. ఈ ముక్కలను మిక్సీ జార్‌ లో వేసి, నీళ్లు కలపకుండా మెత్తని ప్యూరీలా (గుజ్జులా) రుబ్బుకుని పక్కన ఉంచుకోండి.

-ఒక మందపాటి వెడల్పాటి గిన్నెను తీసుకుని, అందులో పాలు పోసి చిన్న మంట మీద వేడి చేయండి. పాలు పొంగు రాకుండా గరిటెతో తిప్పుతూ ఉండాలి. పాలు కాస్త ఆవిరైపోయి, సగం వరకు చిక్కబడేలా మరిగించాలి.

-పాలు బాగా చిక్కబడిన తర్వాత, ముందుగా మెత్తగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని అందులో వేసి ఉండలు లేకుండా కలపండి. పాలు, బియ్యం చక్కగా కలిసిపోయిన తర్వాత, పంచదార, యాలకుల పొడిని వేయండి. పంచదార పూర్తిగా కరిగి, పాయసం చక్కటి సువాసన వస్తున్న సమయంలో స్టవ్ ఆపేయండి.

-అసలు కిటుకు ఇక్కడే ఉంది. పాయసం తయారీలో గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. స్టవ్ ఆపిన వెంటనే వేడివేడి పాయసంలో మామిడి గుజ్జును అస్సలు కలపకూడదు. అలా చేస్తే పాలు విరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పాయసం మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాతే ముందుగా సిద్ధం చేసుకున్న మామిడి రసాన్ని వేసి బాగా కలపాలి.

-చివరగా అందులో ఒక చిన్న కడాయిలో రెండు చెంచాల నెయ్యి వేడి చేసి, అందులో జీడిపప్పు, కిస్మిస్, పిస్తా ముక్కలను బంగారు వర్ణం వచ్చేలా వేయించండి. ఘుమఘుమలాడే ఈ నేతి డ్రై ఫ్రూట్స్‌ను పాయసంలో వేసి కలిపితే చాలు.

-అంతే అమృతం లాంటి మామిడి పాయసం రెడీ. ఫ్రిజ్‌ లో పెట్టుకుని చల్లచల్లగా తింటే, ఆ మజానే వేరు

[ of 5 - Users]
Story first published: Wednesday, May 6, 2026, 13:21 [IST]
Desktop Bottom Promotion