పెళ్లిళ్లలో వడ్డించే స్పెషల్ కళ్యాణ రసం..ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు..ఇంట్లోనే ఇలా చేసుకోండి

Posted By:

పెళ్లి భోజనాల్లో వడ్డించే ప్రత్యేకమైన రసం రుచి మీకు గుర్తుందా? ఆ వాసనకే సగం కడుపు నిండిపోతుంది. ఆ చిక్కటి, కమ్మటి రుచి నాలుకపై నాట్యమాడుతూ ఉంటుంది. ప్రతిరోజూ చేసుకునే రసానికి, ఆ పెళ్లింటి రసానికి ఎంతో తేడా ఉంటుంది. దాని రహస్యం ఏమిటబ్బా అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆ రహస్యం మరేంటో కాదు,అప్పటికప్పుడు తాజాగా నూరిన ఓ ప్రత్యేకమైన మసాలా పొడి. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ రసంతో కలిపి తింటుంటే, ఆ అనుభూతే వేరు. ఈ కళ్యాణ రసం చేయడం చాలా సులభం. ఒక్కసారి దీని రుచి చూశారంటే, మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు. పెళ్లి భోజనాల్లో వడ్డించే రసాన్ని అదే టేస్ట్ తో మీ ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
రసం పొడి కోసం:
-మినప్పప్పు - 2 టేబుల్ స్పూన్లు
-ధనియాలు - అర టేబుల్ స్పూన్
-మిరియాలు - అర టేబుల్ స్పూన్
-ఎండుమిర్చి - 4
-జీలకర్ర - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
-కరివేపాకు - ఓ రెమ్మ
రసం తయారీకి:
-నూనె - అర టేబుల్ స్పూన్
-ఎండుమిర్చి - 4
-ఆవాలు - 1 టీస్పూన్
-దంచిన వెల్లుల్లి రెబ్బలు - 10
-జీలకర్ర - 1 టీస్పూన్
-కరివేపాకు - ఓ రెమ్మ
-టమోటాలు - 3
-పసుపు - 1 టీస్పూన్
-ఇంగువ - పావు టీస్పూన్
-చింతపండు రసం - పావు కప్పు
-ఉడికించి మెదిపిన కందిపప్పు - 1 కప్పు
-నీళ్లు - రెండున్నర కప్పులు
-ఉప్పు - రుచికి సరిపడా
-బెల్లం తురుము - 1 టేబుల్ స్పూన్
-సన్నగా తరిగిన కొత్తిమీర - గుప్పెడు

తయారీ విధానం

-ముందుగా రసం పొడి సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్‌ పై బాండీ పెట్టి అందులో మినప్పప్పు, ధనియాలు, మిరియాలు, ఎండుమిర్చి వేసి మంచి సువాసన వచ్చే వరకు చిన్నమంట మీద దోరగా వేయించుకోవాలి.

-అవి వేగాక చివరగా జీలకర్ర, కరివేపాకు వేసి ఒక్క నిమిషం వేయించి స్టవ్ ఆపి పూర్తిగా చల్లారనివ్వాలి.

-చల్లారిన తర్వాత వేయించినవన్నీ మిక్సీ జార్‌ లో వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పొడి చేసుకోవాలి.

-ఇప్పుడు అదే బాండీలో నూనె వేడిచేసి, ఆవాలు, ఎండుమిర్చి వేసి చిటపటలాడించాలి. ఆ తర్వాత దంచిన వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి మంచి వాసన వచ్చేవరకు వేయించాలి.

-ఇప్పుడు తరిగిన టమోటా ముక్కలు, పసుపు వేసి, అవి మెత్తగా మగ్గిపోయే వరకు మూతపెట్టి ఉడికించాలి.

-టమోటాలు మెత్తబడ్డాక చింతపండు రసం, ఒక కప్పు నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి.

-ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పప్పు, మనం సిద్ధం చేసుకున్న రసం పొడి, మరో కప్పున్నర నీళ్లు పోసి అన్నీ కలిసేలా తిప్పాలి. రసం ఒక పొంగు రాగానే, స్టవ్ ఆపివేయాలి.

-చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర, బెల్లం తురుము వేసి కలిపి వెంటనే మూతపెట్టాలి. ఆ రుచులన్నీ రసంలోకి ఇంకడానికి ఓ ఐదు నిమిషాలు వదిలేయండి. అంతే నోరూరించే, కమ్మనైన కళ్యాణ రసం రెడీ.

[ of 5 - Users]
Story first published: Wednesday, September 17, 2025, 20:54 [IST]
Desktop Bottom Promotion