ఈ పచ్చడితో ఇడ్లీ,దోసెలు తింటే స్వర్గమే..వేళ్లు కూడా నాకేస్తారు..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..

Posted By:

మన ఇళ్లలో ఇడ్లీ, దోసెలు ఎంత సర్వసాధారణమో, వాటికి జతగా పచ్చడి కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా పుదీనా పచ్చడి తన ఘుమఘుమలతో, తాజాదనంతో మనల్ని కట్టిపడేస్తుంది. అయితే, ఎప్పుడూ ఒకేలా కాకుండా, ఆ పుదీనా పచ్చడికి ఒక చిన్న మేజిక్ జోడిస్తే ఎలా ఉంటుంది? కేవలం ఒకే ఒక్క పదార్థంతో దాని రుచిని, పోషక విలువలను రెట్టింపు చేయవచ్చు. ఆ అద్భుతమైన పదార్థం మరేదో కాదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉసిరికాయ.

పుదీనాలోని ఘాటుకు, ఉసిరికాయలోని వగరుతో కూడిన పులుపు తోడైతే ఆ రుచి మాటల్లో చెప్పలేనిది. ఈసారి మీ ఇంట్లో పుదీనా పచ్చడి చేసేటప్పుడు, ఈ కొత్త ప్రయోగం చేసి చూడండి. పుల్లపుల్లగా, కమ్మకమ్మగా, ఘాటుగా ఉండే ఈ పచ్చడిని మీ ఇంట్లో వాళ్ళు లొట్టలేసుకుంటూ తింటారు. ఉసిరికాయ కలిపి పుదీనా పచ్చడి ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Elevate Your Idli And Dosa with this Amla Mint Chutney Recipe in Telugu

కావాల్సిన పదార్థాలు
పచ్చడి కోసం:
నూనె - 2 టీస్పూన్లు
శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
మినపప్పు - 1 టేబుల్ స్పూన్
ఎండు మిర్చి - 4
సాంబార్ ఉల్లిపాయలు- 10
వెల్లుల్లి రెబ్బలు - 5
అల్లం - 1 అంగుళం ముక్క
పచ్చిమిర్చి - 2
పెద్ద ఉసిరికాయలు - 2
చింతపండు - చిన్న రెబ్బ
పుదీనా ఆకులు - గుప్పెడు
పచ్చి కొబ్బరి తురుము -అర కప్పు
పసుపు - పావు టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
తాళింపు కోసం:
నువ్వుల నూనె - 1 టీస్పూన్
ఆవాలు - అర టీస్పూన్
మినపప్పు - అర టీస్పూన్
జీలకర్ర - పావు టీస్పూన్
కరివేపాకు - ఒక రెమ్మ
ఎండు మిర్చి - 1

తయారీ విధానం

-ముందుగా స్టవ్‌ మీద బాండీ పెట్టి అందులో 1 టీస్పూన్ నూనె వేడి చేయాలి.

-నూనె వేడయ్యాక అందులో శనగపప్పు, మినపప్పు వేసి అవి బంగారు రంగులోకి వచ్చి, కమ్మటి వాసన వచ్చేవరకు దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఎండు మిర్చి కూడా వేసి వేయించి, అన్నింటినీ ఒక ప్లేట్‌ లోకి తీసుకుని చల్లారనివ్వాలి.

-ఇప్పుడు అదే బాండీలో మరో టీస్పూన్ నూనె వేసి చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఉల్లిపాయలు కొద్దిగా రంగు మారాక పచ్చిమిర్చి, తరిగిన ఉసిరికాయ ముక్కలు వేసి ఓ నిమిషం పాటు బాగా కలపాలి. ఆ తర్వాత చింతపండు, శుభ్రం చేసుకున్న పుదీనా ఆకులు వేసి, ఆకులు మెత్తబడే వరకు వేయించాలి.

-చివరగా అందులో కొబ్బరి తురుము, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆపేయాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.

-ఇప్పుడు మిక్సీ జార్‌ లో ముందుగా వేయించుకున్న పప్పులు, ఎండుమిర్చి, ఆ తర్వాత చల్లారిన ఉల్లిపాయ-పుదీనా మిశ్రమాన్ని వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

-తాళింపు కోసం చిన్న బాండీలో నువ్వుల నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి చిటపటలాడించాలి. ఎండు మిర్చి, కరివేపాకు కూడా వేసి, ఈ తాళింపును రుబ్బి పెట్టుకున్న పచ్చడిలో కలపాలి. అంతే ఘుమఘుమలాడే ఆరోగ్యకరమైన ఉసిరికాయ పుదీనా పచ్చడి రెడీ.

[ of 5 - Users]
Story first published: Tuesday, September 16, 2025, 9:15 [IST]
Desktop Bottom Promotion