నోరూరించే చికెన్ తొక్కు..రోటీ నుండి బిర్యానీ వరకు అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే

Posted By:

వీకెండ్ వస్తే చాలామంది ఇళ్లల్లో తప్పనిసరిగా చికెన్ ఉంటుంది. ఇంట్లో చికెన్ తెచ్చారంటే ఎప్పుడూ అవే పులుసులు, అవే గ్రేవీలు, అవే రోస్టులతో విసిగిపోయారా? చికెన్‌ తో ఏదైనా కొత్తగా, కారంగా, మసాలా ఘాటుగా తినాలనిపిస్తోందా? అయితే ఈసారి ఈ అద్భుతమైన చికెన్ తొక్కును ప్రయత్నించండి. ఇది కేవలం అన్నంలోకే కాదు, చపాతీలు, పూరీలు, నాన్‌లతో తిన్నా భలే రుచిగా ఉంటుంది. ముఖ్యంగా మీరు ప్లెయిన్ బిర్యానీ లేదా బగారా రైస్ చేసుకున్నప్పుడు, దీనిని సైడ్ డిష్‌గా పెట్టుకుంటే ఆ రుచి మరో స్థాయిలో ఉంటుంది. వంట కొత్తగా నేర్చుకునే వారు కూడా దీన్ని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. చికెన్ తొక్కు ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు

-నెయ్యి - 50 గ్రాములు
-బోన్‌ లెస్ చికెన్ - అర కిలో
-ఉల్లిపాయ - 1
-టమోటా - 1
-అల్లం వెల్లుల్లి పేస్ట్ - ¾ టేబుల్ స్పూన్
-పెరుగు - 2 టేబుల్ స్పూన్లు
-పచ్చిమిర్చి - 2
-మసాలా దినుసులు: యాలకులు - 2, లవంగాలు - 3, దాల్చిన చెక్క - 2 అంగుళాల ముక్క, అనాస పువ్వు - 1
-పొడి మసాలాలు: కారం - అర టేబుల్ స్పూన్, పసుపు - అర టేబుల్ స్పూన్, ధనియాల పొడి - పావు టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి - పావు టేబుల్ స్పూన్, గరం మసాలా - 2 చిటికెలు

-కొత్తిమీర, పుదీనా తరుగు - ఒక్కోటి 2 టేబుల్ స్పూన్లు ,

-కరివేపాకు - ఒక రెమ్మ
-ఉప్పు - రుచికి సరిపడా
-నీరు - 1 గ్లాసు

తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగాక, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు దోరగా వేయించుకోవాలి.

-ఇప్పుడు యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు వేసి మంచి సువాసన వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు చల్లితే ఉల్లిపాయలు మరింత మెత్తగా మగ్గుతాయి.

-ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒక్క నిమిషం పాటు వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి.

-ఇప్పుడు టమోటా ముక్కలు వేసి అవి మెత్తగా గుజ్జులా అయ్యేవరకు మగ్గనివ్వాలి. టమోటాలు బాగా మగ్గిన తర్వాత, పెరుగు వేసి ఉండలు కట్టకుండా వెంటనే కలపాలి.

-ఆ తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి, మసాలాలన్నీ బాగా వేగి నూనె పైకి తేలేంత వరకు వేయించాలి.

-ఇప్పుడు శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు వేసి మసాలా అంతా ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. ఒక గ్లాసు నీళ్లు పోసి, మంటను ఎక్కువగా పెట్టి ఒక పొంగు రానివ్వాలి.

-మరుగుతున్నప్పుడు మంటను తగ్గించి, మూత పెట్టి సుమారు 15-20 నిమిషాల పాటు చికెన్‌ ను మెత్తగా ఉడికించాలి.

-చికెన్ ఉడికిన తర్వాత మూత తీసి, మంటను మళ్లీ ఎక్కువ చేసి, నీరంతా ఇగిరిపోయి తొక్కు దగ్గరపడే వరకు ఉడికించాలి. నూనె పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఘుమఘుమలాడే, రుచికరమైన చికెన్ తొక్కు రెడీ.

[ of 5 - Users]
Story first published: Sunday, September 7, 2025, 10:00 [IST]
Desktop Bottom Promotion