పల్లెటూరి ఫేమస్ దోసకాయ పచ్చడి.. వేడి వేడి అన్నంలో తింటే అమృతం కూడా వేస్ట్, ఎలా చేసుకోవాలంటే?

ఎండాకాలం ఎక్కువగా ఆకలి వేయదు. అలాగే ఏం తిన్నా నోటికి రుచిగా అనిపించదు. అందుకే చాలా మంది ఎక్కువగా బయటికి వెళ్లి స్నాక్స్, ఇతర ఫుడ్స్ తింటూ ఉంటారు. ఇంట్లో ఉండే వ్యక్తులైతే ఎక్కువగా కూరలు చేసుకోవడం దానికంటే ముందే పచ్చళ్ళు, చట్నీలు చేసుకొని తింటారు. ఏవైతే నోటికి కాస్త రుచిగా ఉండడంతో పాటు కారం కారంగా, తిన్న ముద్దా కడుపులో దిగే విధంగా ఉంటాయి.

అలాంటి పచ్చడిలో ఒకటే పల్లెటూరి దోసకాయ పచ్చడి. ఈ పచ్చడి పేరు వింటేనే చాలా మంది నోట్లో ఇప్పటికే నీళ్లు ఊరి ఉంటాయి. ఈ పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది. ఈ పచ్చడిలో దోసకాయతో అన్నం తింటున్నప్పుడు ఒక్కో ముక్క దంతాల కింద నలుగుతూ ఉంటే, అబ్బా ఆ రుచి అమృతాన్ని మించి ఉంటుంది. కానీ కాలం మారుతున్న కొద్దీ.. చాలా మందికి ఈ పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది తెలియకుండా పోతుంది. అందుకోసం ఆ రుచిని ఆస్వాదించలేకపోతున్నారు. అయితే ఈ స్టోరీలో పల్లెటూరి దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది తెలుసుకుందాం.

దోసకాయ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు

దోసకాయ - 1 (పెద్దది)
పల్లీలు - 3 టేబుల్ స్పూన్లు
నూనె - 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 15
టమాటాలు - 2
చింతపండు - ఉసిరికాయంత
వెల్లుల్లి రెబ్బలు - 5
జీలకర్ర - అర టీ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా

తాలింపు కోసం:

నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టీ స్పూన్
జీలకర్ర - 1 టీ స్పూన్
మినప్పప్పు - 1 టీ స్పూన్
శనగపప్పు - 1 టీ స్పూన్
ఎండుమిర్చి - 3
కరివేపాకు - 2 రెమ్మలు
పసుపు - పావు టీ స్పూన్
కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం:

  1. దోసకాయ పొట్టు తీసి శుభ్రంగా కడిగి చేదు ఉందేమో చూసుకోవాలి. చేదు లేకపోతేనే ఆ కాయతో పచ్చడి చేసుకోవాలి. ఒకవేళ దోసకాయ చేదనిపిస్తే మరో కాయను తీసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న కాయలోని గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మీకు నచ్చితే గింజలు కూడా వేసుకోవచ్చు.
  2. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పల్లీలు వేసి బాగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి.
  3. అదే పాన్లో నూనె వేసి పచ్చిమిర్చిని వేయించుకోవాలి. ఇక్కడ పచ్చిమిర్చిని మీరు తినే కారానికి అనుగుణంగా సరిచూసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత పక్కకు తీయాలి.
  4. మళ్లీ అదే పాన్లో టమాట ముక్కలు, చింతపండు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
  5. ఈ లోపు ఫ్రై చేసుకున్న పల్లీలపై పొట్టు తీసుకోవాలి.
  6. మిక్సీ జార్లోకి పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, జీలకర్ర వేసి కచ్చాపచ్చాగ గ్రైండ్ చేసుకోవాలి.
  7. అనంతరం అందులోకి ఉడికించిన టమాట గుజ్జు, కొన్ని దోసకాయ ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ దోసకాయ ముక్కలన్నింటినీ వేసుకోనవసరం లేదు. కొన్ని వేసి మరికొన్ని ఉంచాలి.
  8. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఓ బౌల్ లోకి తీసుకుని, అందులోకి మిగిలిన దోస ముక్కలు వేసి కలిపి పక్కన ఉంచాలి.
  9. స్టవ్ ఆన్ చేసి టమాటా ముక్కలు ఉడికించిన పాన్ పెట్టి మరోసారి నూనె పోసి వేడి చేసు
  10. కోవాలిఆయిల్ హీటెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి వేయించాలి.
  11. తాలింపు గింజలు వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఇవీ వేగిన తర్వాత పసుపు, కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
  12. ఆ తర్వాత తాలింపులోకి గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసి కలుపుకుంటే సూపర్ టేస్టీ దోసకాయ ముక్కల పచ్చడి రెడీ. నచ్చితే మీరూ ఓసారి ట్రై చేయండి.
[ of 5 - Users]
Story first published: Monday, March 10, 2025, 15:37 [IST]
Desktop Bottom Promotion