పండగకు ఇంటికొచ్చే అతిథికి ఈ పులావ్ పెడితే, జన్మలో మిమ్మల్ని మర్చిపోరు.. రుచి అద్భుతః,ఎలా చేసుకోవాలో తెలుసా?

తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిర్యానీతో పాటు పులావ్ కూడా చాలా ఇష్టం. పండగ వస్తే చాలు ప్రతి ఒక్కరి ఇంట్లో పులావ్ గుమగుమలాడుతుంటుంది. ఈ పులావ్‌లో చాలా రకాలు ఉంటాయి. వాటిలో ఒకటి గోంగూర పులావ్ కూడా ఒకటి. సాధారణంగా గోంగూర వంటకాలు ఆరోగ్యానికి మంచివిగా పరిగణించబడతాయి. మనం సాధారణంగా గోంగూర పచ్చడి, గోంగూర కూర వంటి వంటకాలను మాత్రమే తినాలని ఆలోచిస్తాం. కానీ ఒకసారి గోంగూర పలావును కూడా ట్రై చేసి చూడండి. గుంటూరులో దీనిని చాలా ప్రత్యేకంగా, అద్భుతమైన పద్దతిలో చేస్తారు. ఇంటికి అతిథులు వచ్చినప్పుడు గుంటూరు పద్దతిలో ఈ గోంగూర పులావ్ తయారుచేసి పెడితే మిమ్మల్ని జన్మలో మర్చిపోలేరు. అయితే ఈ స్టోరీలో ఈ గోంగూర పులావ్ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది తెలుసుకుందాం.

గోంగూర పలావ్ కోసం కావలసిన పదార్థాలు:

గోంగూర ఆకులు - 100 గ్రాములు
ఉల్లిపాయలు - 3
ఉప్పు - రుచికి సరిపడా
బిర్యాని ఆకులు - 2
అనాస పువ్వులు - 2
దాల్చిన చెక్క - చిన్న ముక్క
లవంగాలు - 5
యాలకులు - 5
మరాఠీ మొగ్గ - 1
పత్తర్ కా ఫూల్ - చిన్నది
జీడిపప్పులు - 15
షాజీరా - 1 స్పూను
కరివేపాకులు - గుప్పెడు
పచ్చిమిర్చి - 5
పసుపు - ½ స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు - 1 స్పూను
టమాటోలు - 2
బియ్యం - 2 కప్పులు
కొత్తిమీర తరుగు - 3 స్పూన్లు
పుదీనా తరుగు - గుప్పెడు

గోంగూర పలావ్ తయారీ విధానం:

మొదటగా గోంగూర ఆకులను శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. అలాగే బాస్మతి బియ్యాన్ని 20 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి, కొంచెం నూనె వేయాలి. ఆ నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకోవాలి. అవి గోధుమ రంగు వచ్చేలా వేయించి పక్కన ఉంచుకోవాలి.

మిగిలిన నూనెలో, మరి కొంచెం నూనె పోసుకోవాలి. ఇప్పుడు అందులో బిర్యాని ఆకులు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, పత్తర్ కా ఫూల్, మరాఠీ మొగ్గ, యాలకులు వేసి వేయించాలి. వీటి మంచి వాసన వస్తే, జీడిపప్పులను కూడా వేసి వేయించాలి.

తరువాత, షాజీరా, సన్నగా కోసిన పచ్చిమిర్చి మరియు కరివేపాకులను వేసి కలపాలి. ఈ మిశ్రమంలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టును వేసి బాగా కలపాలి. ఆ తర్వాత, సన్నగా కోసిన టమాటా ముక్కలను వేసి అవి మగ్గనివ్వాలి. టమాటాలు యాభై శాతం మగ్గితే, వాటి నుంచి మెత్తగా అవుతాయి.

ఈ సమయంలో, ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర ఆకులను వేసి బాగా కలపాలి. మూత పెట్టి గోంగూర మెత్తగా అయ్యే వరకు ఉడికేలా ఉంచాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి బాగా కలిపి, తగినంత నీటిని పోయాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి, పుదీనా తరుగు మరియు కొత్తిమీర తరుగు వేసి కలపాలి.

చివరగా, ముందుగా వేయించి ఉంచుకున్న ఉల్లిపాయలను పైన చల్లుకుని, మూత పెట్టి మీడియం మంట మీద 30-40 నిమిషాల పాటు ఉడికించాలి. వంట పూర్తయిన తర్వాత, మూత తీసి, బాగా కలిపి సర్వ్ చేసుకోవచ్చు. ఈ గోంగూర పలావ్ రుచి అద్భుతంగా ఉంటుంది. ఇది కొంచెం పుల్లగా, కొంచెం ఘాటుగా ఉంటుంది. గుంటూరు శైలి పద్ధతిలో చేసే ఈ గోంగూర పలావ్ రుచి మీ అతిధులను ఆకట్టుకుంటుంది.

[ of 5 - Users]
Story first published: Thursday, March 27, 2025, 8:40 [IST]
Desktop Bottom Promotion