NTR స్టైల్‌లో మటన్ పులావ్.. NTR వండినట్లు ఇలా వండుకోండి!

దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నారు. అయితే ఎన్టీఆర్ గొప్ప కుక్ అన్న విషయం చాలా మందికి తెలియదు. ఆయన వంటల్లో మటన్ పులావ్ అనేది స్పెషల్. బిగ్‌బాస్-1 తెలుగు సీజన్‌లో స్వయంగా ఆయనే వంట చేసి ఇంట్లోని కంటెస్టెంట్లకు పెట్టారు కూడా.

ఆయన చేసిన ఈ వంటను సింపుల్‌గా ఇంట్లోనే చేసుకోవచ్చు. అయితే అందుకు కావాల్సిన పదార్థాలు, ఆ వంటను చేసుకునే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఎన్టీఆర్ స్టైల్ మటన్ పులావ్‌కు కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం

> ఒక కేజీ మటన్
> 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్
> రెండు టేబుల్ స్పూన్ల కారం
> ఒకటిన్నర టేబుల్ స్పూన్ గరం మసాలా
> తగినంత ఉప్పు
> అర టీస్పూన్ మిరియాల పొడి
> రెండు కేజీల బాస్మతి బియ్యం
> రెండు స్పూన్ల నూనె
> రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి
> పెరుగు
> 2 దాల్చిన చెక్క
> అర టీస్పూన్ మిరియాలు
> 4 ఏలకులు
> 4 లవంగాలు
> ఒక టేబుల్ స్పూన్ షాజీరా
> ఒక కప్పు ఉల్లిపాయాలు
> అరకప్పు టమాటో
> ఒక కప్పు పుదీనా

ఎన్టీఆర్ స్టైల్‌లో మటన్ పులావ్ తయారీ విధానం

ముందుగా మనం తీసుకున్న కేజీ మటన్‌ను శుభ్రంగా కడుక్కోవాలి. అనంతరం దానిని కుక్కర్‌లో వేసుకొని, దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, తగినంత ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి, తగినంత నూనె, పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. అనంతరం ఆ మటన్‌ను ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి.

తరువాత స్టవ్ వెలిగించి మనం తీసుకున్న మట్టన్ క్వాంటిటీని బట్టి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. రెండు విజిల్స్ ఎక్కువ మంట మీద, రెండు విజిల్స్ తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు బాస్మతి బియ్యాన్ని కడిగి పక్కకు పెట్టుకోవాలి. అంతలో మటన్ ఉడికిపోతే దానిని కిందకు దించేసి పక్కకు పెట్టుకోవాలి.

అనంతరం ఒక గిన్నె తీసుకొని, అందులో సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేగాక అందులో దాల్చిన చెక్క, మిరియాలు, ఏలకులు, లవంగాలు, షాజీరా, వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అనంతరం ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఉడుకుతున్న సమయంలో పుదీనా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అనంతరం అరకప్పు టమాటో వేసుకొని.. వాటన్నిటినీ బాగా కలిపి బాగా మగ్గనివ్వాలి. అనంతరం మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్‌ను ఆ మిశ్రమంలో వేసుకొని.. ఆ మిశ్రమం మొత్తం మటన్‌కు బాగా పట్టేలా కలుపుకోవాలి. రెండు నిమిషాల పాటు ఎక్కువ మంట మీద ఆ మటన్‌ను ఉడికించుకోవాలి.

తరువాత ముందుగా మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ను మటన్ మిశ్రమంలో వేసుకోవాలి. ఒకవేళ బియ్యం ఎక్కువగా నానితే ఒక కప్పు రైస్‌కి ఒక కప్పు.. లేకపోతే ఒక కప్పు రైస్‌కి ఒకటిన్నర కప్పు నీళ్లు వేసుకోవాలి. అనంతరం బియ్యం మొత్తం మటన్‌కు పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు గిన్నెపైన మూత పెట్టి.. సన్నటి మంట మీద రైస్ ఉడికేంత వరకు ఉంచాలి. అప్పుడే మటన్ ఫ్లేవర్ రైస్‌కి పట్టుకొని పులావ్ టేస్టీగా ఉంటుంది. మటన్, రైస్ ఉడికాక కిందకు దించుకుంటే సరిపోతుంది.

ఎన్టీఆర్ స్టైల్‌లో వేడి వేడి, మటన్ పులావ్ సిద్ధమైపోయినట్లే. దానిని ప్లేట్‌లో సర్వ్ చేసుకొని ఎన్టీఆర్ మూవీని టీవీలో పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ తినడమే.

[ of 5 - Users]
Story first published: Monday, October 21, 2024, 12:28 [IST]
Desktop Bottom Promotion