మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు!

Posted By:

ప్రతి ఇంట్లోనూ మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం పూర్తయిన తర్వాత కాస్తో కూస్తో అన్నం మిగిలిపోవడం చాలా సాధారణమైన విషయం. ఆ మిగిలిన చల్లటి అన్నాన్ని మళ్లీ వేడి చేసుకుని తినడానికి చాలామంది ఇష్టపడరు. పోనీ ఫ్రిజ్‌లో పెట్టి మరుసటి రోజు తిందామనుకున్నా దాని రుచి, ఆకృతి మారిపోతుంది. దీంతో చేసేది లేక చివరికి ఆ అన్నాన్ని చెత్తబుట్టలో పారేస్తుంటారు.

Leftover Rice Biryani Recipe in Telugu How to Make Cold Rice Into Delicious Veg Biryani at Home

అయితే మీ ఇంట్లో మిగిలిపోయిన అన్నంతోనే ఏమాత్రం శ్రమ లేకుండా, హోటల్ రుచిని తలపించేలా అద్భుతమైన, ఘుమఘుమలాడే వెజ్ బిర్యానీని చిటికెలో తయారు చేసుకోవచ్చు. సరైన కూరగాయలు, మసాలాలు జోడిస్తే.. ఈ బిర్యానీ పాత అన్నంతో చేశారంటే మీ ఇంట్లో వాళ్లు కూడా నమ్మలేరు.

మిగిలిన అన్నంతో వెజ్ బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు

మిగిలిపోయిన అన్నం
సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమాటా - 1 కప్పు
క్యారెట్, ఫ్రెంచ్ బీన్స్, పచ్చి బఠానీలు - 1 కప్పు
తాజా పెరుగు - అర కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
పచ్చిమిర్చి - 3
బిర్యానీ మసాలా - 1 టేబుల్ స్పూన్
పసుపు, కారం, ఉప్పు - రుచికి సరిపడా
నూనె లేదా నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర, పుదీనా ఆకులు - కొద్దిగా
బిర్యానీ ఆకు,లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా

Leftover Rice Biryani Recipe in Telugu How to Make Cold Rice Into Delicious Veg Biryani at Home

మిగిలిన అన్నంతో వెజ్ బిర్యానీ తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి, అడుగు మందంగా ఉండే ఒక పాన్ లేదా కడాయి పెట్టుకోవాలి. అందులో రెండు చెంచాల నెయ్యి, కాస్త నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క వంటి మసాలా దినుసులు వేసి దోరగా వేయించాలి. ఈ మసాలాలు వేగుతుంటేనే ఇల్లంతా సువాసన వ్యాపిస్తుంది.

-ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి అవి బంగారు రంగులోకి మారేలా వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా కలుపుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు, క్యారెట్, బీన్స్, బఠానీలు వేసి బాగా మగ్గనివ్వాలి. కూరగాయలు త్వరగా ఉడకడానికి కొద్దిగా ఉప్పు చల్లాలి.

-కూరగాయల ముక్కలు సగం ఉడికిన తర్వాత మంటను సిమ్ లో పెట్టి, బాగా గిలకొట్టిన పెరుగును అందులో వేసి కలపాలి. దీనివల్ల బిర్యానీకి కమ్మటి రుచి వస్తుంది. ఆ తర్వాత పసుపు, కారం, బిర్యానీ మసాలా వేసి నూనె పైకి తేలేంత వరకు ఉడికించాలి.

-మసాలా గ్రేవీ పర్ఫెక్ట్‌ గా సిద్ధమైన తర్వాత, అందులో చల్లటి అన్నాన్ని వేసి.. మెతుకులు విరిగిపోకుండా మసాలా అంతా అన్నానికి పట్టేలా నెమ్మదిగా కలుపుకోవాలి.

-చివరగా పైన సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా ఆకులను చల్లాలి. పాన్‌ పై మూతపెట్టి, అతి తక్కువ మంటపై ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు ఉడికించాలి. అంతే మూత తీసి చూస్తే కళ్లు చెదిరే రంగుతో, నోరూరించే సువాసనలతో వెజ్ బిర్యానీ రెడీ.

-ఇలా వేడివేడిగా సిద్ధమైన వెజ్ బిర్యానీకి జోడీగా చల్లటి బూందీ రైతా లేదా ఉల్లిపాయ రింగులు, నిమ్మకాయ పిండుకుని తింటే ఆ మజానే వేరు. ముద్దముద్దకూ కూరగాయల రుచి, మసాలాల ఘుమఘుమలు తగులుతుంటే తినేకొద్దీ తినాలనిపిస్తుంది.

[ of 5 - Users]
Story first published: Sunday, June 21, 2026, 10:15 [IST]
Desktop Bottom Promotion