మధురై స్పెషల్ పులిహోర..మీ జన్మలో ఇలాంటి టేస్ట్ రుచి చూసి ఉండరు..ఎలా చేయాలో చూడండి

Posted By:

మనదేశంలోని చాలా టెంపుల్స్ లో ప్రసాదంగా పులిహోర అందిస్తారు. అయితే తమిళనాడు రాష్ట్రంలోని మధురైలోని ఫేమస్ మీనాక్షీసుందరేశ్వర్ ఆలయంలో ప్రసాదంగా ఇచ్చే పులిహోర టేస్ట్ మాత్రం నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. ఇలాంటి పులిహోర ఇదివరకెప్పుడూ తినలేదు అనిపించడం పక్కా. అంత కమ్మగా ఉంటుంది. దీనిని మీ ఇంట్లోనే తయారుచేసుకోవాలంటే ఏమేం పదార్థాలు కావాలి, తయారీ విధానం ఇక్కడ చూడండి.

మధురై స్పెషల్ పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు

బియ్యం-400 గ్రాములు
చింతపండు-80 గ్రాములు
వేరుశెనగపప్పు-అర కప్పు
మెంతులు-1 టీస్పూన్
ధనియాలు- 1 టేబుల్ స్పూన్
నల్ల నువ్వులు- 1 టేబుల్ స్పూన్
మిరియాలు- 1 టేబుల్ స్పూన్
నువ్వుల నూనె
ఎండుమిర్చి-7
ఆవాలు-అర టేబుల్ స్పూన్
మినపగుళ్లు- 1 టేబుల్ స్పూన్
పచ్చి శెనగపప్పు-1 టేబుల్ స్పూన్
ఉప్పు-1 టేబుల్ స్పూన్
పసుపు-పావు టీస్పూన్
ఇంగువ-1టీస్పూన్
కరివేపాకు

మధురై స్పెషల్ పులిహోర తయారీ విధానం

-ముందుగా రెండు కప్పుల బియ్యం శుభ్రంగా కడిగి కుక్కర్ లో వేసి ఇందులో నాలుగు కప్పుల నీళ్లు పోసి 1 గంటసేపు నానబెట్టండి.

-తర్వాత అందులో స్పూన్ ఆయిల్ వేసి మూతపెట్టి మీడియం మంట మీద మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి.

-తర్వాత చింతపండుని ఓ బౌల్ లో వేసి అందులో వేడినీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టండి.

-అరగంట తర్వాత చేతిలో గుజ్జు అంతా పిండుకొని ఓ జాలిపెట్టి వడకట్టుకోవాలి. చింతపండు గుజ్జు మరీ పలుచగా ఉండకూడదు,మరీ చిక్కగా ఉండకూడదు.

-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నూనె లేకుండానే పల్లీలు వేయించి పక్కనపెట్టుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు తీసేసి ఉంచండి.

-ఇప్పుడు అదేపాన్ లో 1 టీస్పూన్ మెంతులు వేసి సగం వరకు వేగిన తర్వాత ఇందులోనే మిరియాలు, ధనియాలు, నల్ల నువ్వులు వేసి వేయించి ఓ గిన్నెలోకి తీసుకొని పక్కనపెట్టుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ మీద పాన్ లో 6 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేడిచేసి అందులో ఎండుమిర్చి వేయించి పక్కనపెట్టుకోండి. ఇప్పుడు అదే నూనెలో మినపగుళ్లు, ఆవాలు, పచ్చిశెనగపప్పు వేసి వేయించి అందులో రెండు ఎండుమిర్చిలను తుంపి ముక్కలు, రెండు రెబ్బల కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ మొత్తాన్ని ఆయిల్ తో సహా తీసి ఓ బౌల్ లో వేసి పెట్టుకోండి.

-ఇప్పుడు అదే పాన్ లో పక్కన ఉంచుకున్న చింతపండు గుజ్జు మొత్తం పోసేయండి. ఇందులో ఉప్పు,పసుపు, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ అది కొంచెం చిక్కబడేంత వరకు మీడియం మంట మీద ఉడికించుకోవాలి.

-ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేయించిన ఎండుమిర్చి వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసి ఈ పొడిని ఓ గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకోండి.

-తర్వాత మిక్సీగిన్నెలో వేయించిన ధనియాలు, మెంతులు, నువ్వులు, మిరియాలను వేసి వాటిని మెత్తగా గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకొని పక్కనపెట్టుకోండి.

-తర్వాత ఉడికించిన అన్నాన్ని పులిహోర కలిపే పల్లెంలో వేసి అందులోనే రెండు రెమ్మల కరివేపాకు, వేయించి పొట్టు తీసిన పల్లీలు వేసి బాగా కలిసేలా కలుపి కొంచెం చల్లారనివ్వాలి.

-తర్వాత చింతపండు గుజ్జు ఉడికిన తర్వాత అందులో గ్రైండ్ చేసి గిన్నెల్లో ఉంచిన పొడులు, ఇంగువ కూడా వేసి కలపాలి. తర్వాత ఇందులో ముందుగా గిన్నెలో రెడీ చేసి ఉంచి పోపును కూడా చింతపండు గుజ్జులో వేసి కలిపి ఆయిల్ సపరేట్ అయ్యి పైకి తేలేంతవరకు ఉడికించుకోవాలి.

-తర్వాత దీన్ని అన్నంలో వేసి కలపడమే. అంతే మధురై స్పెషల్ పులిహోర రెడీ.

[ of 5 - Users]
Story first published: Saturday, February 15, 2025, 11:31 [IST]
Desktop Bottom Promotion