సమ్మర్ స్పెషల్ మ్యాంగో బొబ్బట్లు.. ఒక్కసారి తింటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే రుచి!

Posted By:

ఎండాకాలంలో మామిడి పండుతో ఎన్నో రకాల వంటకాలు చేస్తుంటాం. మామిడి పండును అలాగే తినడమే కాకుండా, మన సాంప్రదాయ తీపి వంటకాలతో జోడిస్తే ఆ రుచే వేరు. పండుగల్లో, శుభకార్యాల్లో మనం చేసుకునే సాధారణ బొబ్బట్లను ఎప్పుడైనా కమ్మని మామిడి పండు రుచితో ట్రై చేశారా? లేకపోతే ఈ సారి పక్కాగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే మ్యాంగో బొబ్బట్లు రుచి చూడాల్సిందే. ఈ సరికొత్త తీపి వంటకం మీ ఇంట్లో వాందరికీ కచ్చితంగా నచ్చుతుంది.

Mango Bobbatlu Recipe in Telugu How to Make Soft and Tasty Mango Bhakshalu at Home

మ్యాంగో బొబ్బట్లు తయారీకి కావాల్సిన పదార్థాలు

శనగపప్పు - అర కప్పు
బెల్లం - అర కప్పు
యాలకులు - 1
మామిడిపండు గుజ్జు (మ్యాంగో ప్యూరీ) - 1 కప్పు
మైదా పిండి - 1 కప్పు
పసుపు - చిటికెడు
ఉప్పు - చిటికెడు
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
నీళ్లు - పిండి కలపడానికి తగినన్ని
కాల్చడానికి నెయ్యి - తగినంత

మ్యాంగో బొబ్బట్లు తయారీ విధానం

-ముందుగా శనగపప్పును శుభ్రంగా కడిగి అరగంట నుంచి గంట పాటు నీళ్లలో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్‌ లో వేసి పప్పును మెత్తగా ఉడికించుకోవాలి.

-ఉడికించిన శనగపప్పును మిక్సీ గిన్నెలో వేసి, అందులోనే బెల్లం, యాలకుల పొడి,2 మామిడిపండ్ల నుంచి తీసిన గుజ్జును వేసి మెత్తని పేస్ట్‌ లా గ్రైండ్ చేసుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ వెలిగించి, ఒక మందపాటి కడాయి పెట్టుకుని గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేయాలి. మంటను తక్కువలో ఉంచి, అడుగంటకుండా గరిటెతో నిరంతరం కలుపుతూ ఉడికించాలి.

-ఈ పూర్ణం మిశ్రమం కాస్త గట్టిపడి, కడాయికి అంటుకోకుండా దగ్గరపడేవరకు తక్కువ మంట మీద ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి, మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇది మరింత గట్టిపడుతుంది. ఇప్పుడు ఆ పూర్ణాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో మైదా పిండి, చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి. ఈ పిండిపై మూతపెట్టి కొద్దిసేపు నాననివ్వాలి. ఆ తర్వాత మళ్లీ ఒకసారి బాగా పిసికి మెత్తగా చేసుకోవాలి.

-ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండి నుంచి చిన్న ఉండను తీసుకుని, చేతితో కొద్దిగా వెడల్పుగా చేయాలి. అందులో ముందుగా సిద్ధం చేసుకున్న మామిడిపండు పూర్ణం ఉండను పెట్టి, ఎక్కడా ఖాళీలు లేకుండా పిండితో పూర్తిగా మూసేయాలి. ఇప్పుడు బట్టర్ పేపర్ పై కొద్దిగా నెయ్యి రాసి, ఈ ఉండను నెమ్మదిగా పల్చటి బొబ్బట్టులా ఒత్తుకోవాలి.

-స్టవ్ పై పెనం పెట్టి వేడి అయ్యాక, దానిపై ఈ బొబ్బట్టును వేయాలి. రెండు వైపులా నెయ్యి రాస్తూ, మంచి బంగారు రంగు మచ్చలు వచ్చేలా, మంటను మీడియంలో ఉంచి దోరగా కాల్చుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన మ్యాంగో బొబ్బట్లు రెడీ. ఈ కమ్మని మ్యాంగో బొబ్బట్లను వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే ఆ మజానే వేరు.

[ of 5 - Users]
Story first published: Friday, June 12, 2026, 8:18 [IST]
Desktop Bottom Promotion