కంచంలో ఎన్ని కూరలున్నా సరే.. ఈ మామిడి అల్లం చారు ముందు దిగదుడుపే!

Posted By:

కంచంలో ఎన్ని రకాల కూరలు, వేపుళ్లు, పచ్చళ్లు ఉన్నా.. చివరగా కాస్త చారు లేదా రసంతో అన్నం తింటేనే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. అన్నం సులభంగా జీర్ణం కావడానికి కూడా ఇది ఎంతో సహాయపడుతుంది. అయితే రోజూ చేసుకునే పప్పుచారు, టమాటా రసం, మిరియాల చారు తిని బోర్ కొట్టిందా? అయితే ఈసారి మీ నాలుకకు ఓ కొత్త రుచిని పరిచయం మామిడి అల్లం చారుతో కొత్త రుచిని ట్రై చేయండి. పుల్లగా, కమ్మగా ఉండే ఈ మామిడి అల్లంతో చేసే చారు రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు.

Mango Ginger Charu Recipe in Telugu The Secret to a Perfect Soul Satisfying Meal

మామిడి అల్లం చారు తయారీకి కావాల్సిన పదార్థాలు

మామిడి అల్లం - 80 గ్రాములు
జీలకర్ర - 3 టేబుల్ స్పూన్లు
ధనియాలు - 4 టేబుల్ స్పూన్లు
ఎండుమిర్చి - 18
మిరియాలు - 2 టేబుల్ స్పూన్లు
చింతపండు - 50 గ్రాములు
టమోటాలు (పండినవి) - 6
కొత్తిమీర - తగినంత
పచ్చిమిర్చి - 4
బెల్లం - 4 టేబుల్ స్పూన్లు
పసుపు - అర టీ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నెయ్యి - 4 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 2 టేబుల్ స్పూన్లు
కరివేపాకు - కొద్దిగా
పచ్చికొబ్బరి తురుము - 6 టేబుల్ స్పూన్లు
ఇంగువ - 2 చిటికెళ్లు

Mango Ginger Charu Recipe in Telugu The Secret to a Perfect Soul Satisfying Meal

మామిడి అల్లం చారు తయారీ విధానం

-ముందుగా చారు మసాలాను సిద్ధం చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మామిడి అల్లం ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 14 ఎండుమిర్చి, మిరియాలు, ధనియాలు వేసి వీలైనంత మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

-ఒక గిన్నెలో చింతపండును తీసుకుని, తగినన్ని నీళ్లు పోసి 15 నిమిషాల పాటు నానబెట్టి, ఆ తర్వాత చిక్కటి రసం తీసుకోవాలి.

-ఈ చింతపండు రసంలో రెండు కట్టల కొత్తిమీర, టమోటాలు వేసి చేత్తో బాగా నలుపుతూ గట్టిగా పిండాలి. అందులో ఉన్న రసం అంతా దిగాక మిగిలిన పిప్పిని తీసి పక్కన పడేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెను మంట మీద ఉంచాలి. అందులో కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, గ్రైండ్ చేసిన మామిడి అల్లం పేస్ట్, పసుపు, ఉప్పు వేయాలి. దీనికి మూడు లీటర్ల నీళ్లు జతచేసి బాగా కలపాలి.

-మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి 15 నిమిషాల పాటు బాగా మరిగించాలి. చారు మరిగిన తర్వాత, అందులో బెల్లం, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

-ఈ చారుకి అసలైన రుచి తాలింపుతోనే వస్తుంది. స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి నెయ్యి వేయాలి. నెయ్యి కరిగాక ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత మిగిలిన 4 ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చికొబ్బరి తురుము వేసి దోరగా వేయించాలి. చివరగా ఇంగువ చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. వేడివేడిగా ఉన్న ఈ తాలింపును మరిగించిన చారులో వేసి కలపాలి.

-ఈ రెసిపీలో అల్లం ఘాటు కొద్దిగా ఎక్కువైందనిపిస్తే.. చారు దించేసిన తర్వాత చివరలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుంటే సరిపోతుంది. రుచి అద్భుతంగా బ్యాలెన్స్ అవుతుంది.

[ of 5 - Users]
Story first published: Wednesday, May 20, 2026, 19:43 [IST]
Desktop Bottom Promotion