అరుదైన రుచి,అదిరే కమ్మదనం.. ఒక్కసారి తింటే వదలరు ఈ బొమ్మిడాయిల పులుసు..ఎలా చేసుకోవాలంటే

Posted By:

చేపల పులుసు అనగానే మనకు టక్కున గుర్తొచ్చేవి రవ్వ, బొచ్చె, కొరమీను. ఇవి మార్కెట్లో ఎప్పుడూ దొరుకుతాయి కాబట్టి అవే మనకు అలవాటు. కానీ వాటన్నింటినీ మించిన ఓ అద్భుతమైన, అరుదైన రుచి ఒకటి దాగివుంది. అదే బొమ్మిడాయిల పులుసు. ఈ పేరు చాలామందికి కొత్తగా అనిపించవచ్చు. ఎందుకంటే ఇవి ఫారాల్లో పెంచేవి కావు, వాగులు, వంకలు, నదుల్లో సహజసిద్ధంగా పెరిగే స్వచ్ఛమైన చేపలు. అందుకే ఇవి మార్కెట్లో దొరకడం చాలా అరుదు.

ఈ చేపల ప్రత్యేకత కేవలం రుచిలోనే కాదు, తినడంలోనూ ఉంది. దీనికి వెన్ను ముల్లు తప్ప చిన్న చిన్న ముళ్ళు అస్సలు ఉండవు. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంతో ఇష్టంగా, సులభంగా తినేయొచ్చు. ఈసారి మీకు మార్కెట్లో ఈ చేపలు కనిపిస్తే అస్సలు వదలకండి. బొమ్మిడాయిల పులుసు ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Master the Magic of Bommidailu Fish Pulusu with This Easy Recipe

తయారీకి కావాల్సిన పదార్థాలు
చింతపండు -నిమ్మకాయ సైజు
ధనియాల పొడి - 1 టీస్పూన్
కొత్తిమీర - చిన్న కట్ట
జీలకర్ర పొడి - అర టీస్పూన్
పసుపు - అర టీస్పూన్
కారం - 2 టీస్పూన్లు
బొమ్మిడాయలు - అర కిలో
నూనె - 4 టేబుల్ స్పూన్లు
మెంతులు - పావు టీస్పూన్
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 3
కరివేపాకు - 2 రెమ్మలు
అల్లం వెల్లుల్లి ముద్ద - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా

Master the Magic of Bommidailu Fish Pulusu with This Easy Recipe

తయారీ విధానం

-రెండు ఉల్లిపాయలను ముక్కలుగా కోయకుండా, పచ్చిగానే మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి.

-తర్వాత స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక మెంతులు వేసి చిటపటలాడనివ్వాలి. మెంతులు మాడితే పులుసు చేదు వస్తుంది, కాబట్టి దోరగా వేయించాలి.

-ఇప్పుడు సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్‌ ను వేసి, మంటను తగ్గించి ఓవేయించాలి. ఉల్లిపాయ ముద్ద పచ్చి వాసన పోయి, మంచి బంగారు రంగులోకి మారి, నూనె పైకి తేలేంత వరకు వేయిస్తేనే పులుసుకు అసలైన రుచి, చిక్కదనం వస్తుంది.

-ఆ తర్వాత పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి మరో నిమిషం వేయించాలి.

-ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి చిక్కటి రసం తీసి గ్రేవీలో పోయాలి.

-చేప ముక్కలు వేయకముందే ఈ చింతపండు పులుసును, మసాలాలను సుమారు 5-7 నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఇలా చేయడం వల్ల పులుసు రుచి అద్భుతంగా ఉంటుంది. చాలామంది ముక్కలు వేశాక ఎక్కువసేపు మరిగిస్తారు, దానివల్ల ముక్కలు చిదిరిపోతాయి.

-పులుసు బాగా మరిగిన తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు వేసి కలపాలి. గ్రేవీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసి ఒక్క పొంగు రానివ్వాలి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న బొమ్మిడాయి చేప ముక్కలను ఒక్కొక్కటిగా పులుసులో నెమ్మదిగా వదలాలి.

-చేప ముక్కలు వేసాక గరిటెతో అస్సలు కలపకూడదు. అలా చేస్తే సున్నితమైన చేప ముక్కలు విరిగిపోతాయి. గిన్నెను రెండు వైపులా బట్టతో పట్టుకుని సున్నితంగా కదిపితే సరిపోతుంది.

-మూత పెట్టి మీడియం మంట మీద సరిగ్గా 8-10 నిమిషాలు ఉడికిస్తే చాలు. నూనె పైకి తేలి, పులుసు ఘుమఘుమలాడుతుంటే మీ బొమ్మిడాయిల పులుసు సిద్ధమైనట్లే. చివరగా ఉప్పు, కారం చూసుకుని, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని దించేయండి.

-చేపల పులుసు వండిన వెంటనే కాకుండా, ఓ గంట ఆగి తింటే ముక్కలకు పులుసు బాగా పట్టి రుచి రెట్టింపు అవుతుంది. మరుసటి రోజు తింటే ఆ రుచే వేరు.

[ of 5 - Users]
Story first published: Sunday, September 21, 2025, 7:28 [IST]
Desktop Bottom Promotion